భూమి గుణం తెలుసుకొని సాగితేనే రైతుకు మేలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎర్రభూములే అధికం
రెండోస్థానంలో నల్లరేగడి నేలలు
భూసారం ఆధారంగా సాగుచేస్తేనే అధిక దిగుబడులు
ప్రత్యామ్నాయ పంటలే లాభదాయకం
జగిత్యాల, నవంబర్ 13, (నమస్తే తెలంగాణ) :మన సాగుభూముల్లో ఏయే పోషకాలు ఏయే స్థాయిలో ఉన్నాయి? ఏయే ఎరువులను ఎంత మోతాదులో వాడితే అధిక దిగుబడులు వస్తాయి? ఇంతకీ జిల్లాలో ప్రాంతాలవారీగా ఏయే భూములు ఏయే పంటలకు అనుకూలంగా ఉన్నాయి? ఇవన్నీ తెలియాలంటే రైతన్న మట్టితో చుట్టరికం చేయాలి. నేలను నమ్ముకోవడమే కాదు, ఆ నేల తల్లి గురించి తెలుసుకోవాలి. భూమి గుణం, దాని సారం తెలుసుకొని పంటలు సాగు చేసినప్పుడే ప్రతిఫలం వస్తుంది. మంచి దిగుబడి వచ్చి, లాభాల పట్టే అవకాశముంటుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీరొక్క నేలలు కనిపిస్తాయి.. ఒక్కోచోట ఒక్కో రకం భూములు ఉన్నాయి.. గోదావరి తీర ప్రాంతంలో ఒండ్రు నేలలు అధికంగా ఉంటే.. మైదాన ప్రాంతాల్లో ఎర్ర, నల్లరేగడి భూములు అధికంగా ఉన్నాయి.. మరికొన్ని చోట్ల సౌడు భూములు కనిపిస్తాయి. వీటిలో వాతావరణ పరిస్థితులు, భూసారం ఆధారంగా పంటలు వేస్తే మేలైన దిగుబడులు వస్తాయి.. వెరసీ రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించే అవకాశాలు ఉంటాయి.
కరీంనగర్ జిల్లాలో నేలల రకాలు
కరీంనగర్ జిల్లాలో 1.25 లక్షల హెక్టార్ల సేద్యానికి అనుకూలమైన భూమి ఉన్నది. జిల్లాలో పెద్ద మొత్తంలో లోతైన సున్నపు నల్లనేలలు (44.2 శాతం) విస్తరించి ఉన్నాయి. కరీంనగర్ పరిధిలో ఒండ్రు మట్టినేలలు 13.8 శాతం, ఎరుపు కంకర మట్టి నేలలు 13.1 శాతం, ఎర్ర బంక మట్టి నేలలు 13.1 శాతం ఉన్నాయి. జిల్లాలో 93,841 ఎకరాల్లో సున్నపు నల్లనేలలు ఉన్నాయి. మానేరు తీరం వెంట 29,265 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక ఎరుపు కంకర మట్టి నేలలు 27,771 ఎకరాలు, ఎర్ర బంకమట్టి నేలలు 27,775 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి.
ఒండ్రు నేలలు
సహజసిద్ధంగా ఏర్పడిన సారవంతమైన నేలలను ఒండ్రు నేలలు అంటారు. పొటాషియం, పాస్పరస్ అధికంగా ఉండడంతో పసుపు రంగులో కనిపిస్తాయి. వీటిలో పొటాష్, సున్నపురాయి సమృద్ధిగా, నత్రజని తక్కువగా ఉంటుంది. నదులు అనేక ఏండ్లుగా ప్రవాహంలో తీసుకువచ్చిన ఒండ్రుమట్టిని నిక్షేపం చేయడంవల్ల ఇవి ఏర్పడుతాయి. ఉమ్మడి కరీంనగర్లో తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ నేలలకు నీటిని నిల్వ చేసుకునే గుణం ఎక్కువ. పొటాషియం ఎక్కువగా ఉండి, నైట్రోజన్, పాస్పరస్ తక్కువగా ఉంటాయి. వరి, చెరుకు, అరటి వంటి పంటల సాగుకు అనుకూలం. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో దాదాపు మూడేసి వేల ఎకరాల్లో, కరీంనగర్ జిల్లాలో 29 వేల ఎకరాల్లో ఈ ఒండ్రు నేలలు విస్తరించి ఉన్నాయి.
నల్లరేగడి నేలలు
అర్థ శుష్క పరిస్థితులు ఉండే దక్కన్ పీఠభూమిలో బస్టాల్ శిలల శైథిల్యంతో నల్లరేగడి నేలలు ఏర్పడ్డాయి. మెత్తని ఇనుప పదార్థాలు ఉండడం వల్ల నల్లగా కనిపిస్తాయి. వీటిని చెర్నోజెమ్, రేగూర్గా పిలుస్తుంటారు. ఈ రకం భూములు నీటిని గ్రహించి ఎక్కువ కాలం నిల్వ చేసుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటిలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, కార్బొనేట్, అల్యూమినియం పుష్కలంగా, నత్రజని, పాస్పారిక్ ఆమ్లం, సేంద్రియ పదార్థం తక్కువ మోతాదులో ఉంటాయి. పత్తి పంటకు అత్యంత అనుకూలమైనవి. అందుకే వీటిని బ్లాక్ కాటన్ సాయిల్స్గా పేర్కొంటారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో అత్యధికంగా విస్తరించి ఉన్నాయి. పత్తే కాకుండా మిర్చి, పొగాకు, పసుపు లాంటి పంటలు వేయవచ్చు. నీటి సౌకర్యం ఉన్న నల్లరేగడి నేలల్లో ఆముదం, పొద్దు తిరుగుడు, మక్కజొన్న, పెసర, మినుము, ఉలువలు, జొన్నలు, వర్షాధారిత నల్లరేగడి నేలల్లో శనగ, కుసుమ, ఆవాలు సాగు చేసుకోవచ్చు.
ఎర్ర నేలల లక్షణాలు
సహజంగా ఎర్రమట్టి నేలలు అంతగా సారవంతమైనవి కావు. నీటిని గ్రహించే శక్తి తక్కువ. ఐరన్ ఆక్సైడ్తో కూడి ఉండడంతో ఎరుపు రంగులో కనిపిస్తాయి. వీటిలో మొక్కల పెరుగుదలకు కావాల్సిన పౌష్టిక, సేంద్రియ పదార్థాలు తక్కువగా, భాస్వరం ఎక్కువగా ఉంటుంది. ఈ నేలలు తేలికగా ఉండి, గాలిపారాడేట్లుగా ఉంటాయి. ఈ నేలల్లో ప్రధానంగా జొన్న, సజ్జ, పల్లి, ఆముదాల సాగుకు అనుకూలం. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో నీటి సౌలభ్యం అధికంగా ఉండడం, 24 గంటల కరెంట్తో మెజార్టీ రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి మూస పద్ధతుల్లోనే ముందుకెళ్తున్నారు. అయితే, మారిన పరిస్థితుల్లో నీటి సౌకర్యం ఉన్న ఈ ఎర్రనేలల్లో పల్లి, ఆముదం, పొద్దుతిరుగుడు, కంది, పెసర, మినుము, అలసంద, జొన్న, మక్కజొన్న, కుసుమ పంటలు, వర్షాధారితమైన ఎర్రనేలల్లో ఉలువలు, జొన్నలు వేయాలని పొలాస శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల సేద్యపు జిల్లాగా ప్రసిద్ధిగాంచింది. అయితే, ఇక్కడి భూములు పూర్తిగా సారవంతమైనవి కావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జిల్లాలో దాదాపు 1.30 లక్షల హెక్టార్ల సేద్యభూమి ఉన్నది. ఎర్రబంక మట్టి నేలలే (46.5 శాతం)అధికంగా విస్తరించి ఉన్నాయి. ఎరుపు నిస్సార లోమ్ భూములు 10.9 శాతం, లోతైన నల్లనేలలు 8 శాతం, మధ్యస్థ నల్లనేలలు 7.1 శాతం ఉన్నాయి. సారవంతమైన ఒండ్రు నేలలు కేవలం 0.9 శాతం మాత్రమే. అది కూడా గోదావరినది ప్రవాహం ప్రారంభమయ్యే ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో ఉన్నాయి. జిల్లాలో మొత్తంగా 1,32,627 ఎకరాల్లో ఎర్రబంకమట్టి నేలలు, 31,104 ఎకరాల్లో ఎరుపు లోమ్ నేలలు, లోతైన నల్లరేగడి నేలలు 22,745 ఎకరాలు, మధ్యస్థ నల్లనేలలు 20,260 ఎకరాల్లో ఉన్నాయి. కేవలం 2,621 ఎకరాలు మాత్రమే ఒండ్రు నేలలు.
ఎర్ర, నల్లరేగడి నేలలే 70 శాతం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 70 శాతం ఎర్ర, నల్లరేగడి నేలలే. 20 శాతం సున్నపు నేలలు. మరో 10 శాతం ఇతర రకాలు ఉన్నాయి. మొత్తంగా 93 శాతం భూమిలో నత్రజని లోపం కనిపిస్తున్నది. 80 శాతం పాస్పరస్, 78 శాతం పొటాషియం అధికంగా ఉన్నది. ఇలాంటి భూములు ఆరుతడి పంటల సాగుకు అనుకూలమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.