ఓట్ల రాజకీయమే ఆ పార్టీ ధ్యేయం
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్కుమార్
మధురానగర్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల ధర్నా
గంగాధర, నవంబర్ 12 : మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఓట్ల రాజకీయం చేయడమే తప్ప రైతు సంక్షేమంపై బీజేపీ నాయకులకు సోయి లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా మండలంలోని మధురానగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధర్నాకు వినోద్కుమార్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. గత ఆగస్టులోనే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి కబురు వచ్చిందని, మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పియూష్గోయల్ను కలిసినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని కేంద్రం చేసిన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆ దిశగా అవహగాన కల్పిస్తుంటే రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ఓట్ల రాజకీయాలు చేస్తూ రైతులను పక్కదారి పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో ఎన్నికలు ఉండడంతో మొత్తం ఎరువులను ఆ రాష్ర్టాలకే కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నదన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎరువుల సమస్య పెద్ద ఎత్తున ఎదురుకానుందన్నారు.
రాష్ర్టానికి రావాల్సిన ఎరువుల కోటా ఇవ్వలేదని, కోటా మొదటి దశలోనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎంపీలుగా ఉన్న కిషన్రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ రాష్ర్టానికి వచ్చే కోటా తెచ్చి ఇక్కడి రైతులకు అందేలా చేయాలన్నారు. నిన్నటివరకు ధాన్యం మేమే కొంటున్నామని బీజేపీ నాయకులు ప్రచారం చేసుకున్నారని గుర్తుచేశారు. పంట మార్పిడి విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నుంచి లేఖ వచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. 64 ఏళ్లు పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రైతులకు చేసింది ఏమి లేదన్నారు. కొట్లాడి సాధించికున్న తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు.
ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి రూ.5 లక్షల బీమా వచ్చేలా చేయడంతో పాటు ప్రీమియం కూడా ప్రభుత్వమే కడుతున్నదని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని, రాష్ట్ర బీజేపీ ఎంపీలు ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు బీజేపీ నాయకులను గ్రామాల్లో నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, డీసీఎంఎస్ డైరెక్టర్ వీర్ల వెంకటేశ్వర్రావు, ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఏఎంసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, విండో అధ్యక్షులు, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.