వినూత్న ఆలోచనలతో సరికొత్త డిజైన్లను ఆవిష్కరించాలి
సిరిసిల్లలో మెగా పవర్లూం క్లస్టర్ కోసం కేంద్రంతో కొట్లాడుదాం
పోరాటంలో నేతన్నల భాగస్వామ్యం కావాలి
రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాలిస్టర్ వస్త్రపరిశ్రమ కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి కేటీఆర్
సిరిసిల్ల/ సిరిసిల్లటౌన్, నవంబర్ 12: నేతన్నల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలూ కృషిచేస్తున్నారని, వెన్నుదన్నుగా ఉంటున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని సినారె కళామందిరం ప్రాంగణంలో జరిగిన సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా వచ్చారు. పాలకవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మాట్లాడారు. నేతన్నల సమస్యలపై కేసీఆర్కు పూర్తి స్థాయి అవగాహన ఉందని, స్వయంగా వస్త్రవ్యాపార సంఘం పెద్దలతో కార్మికులకు లాభం కలిగించే విధంగా చర్చించి వారికి జీవన ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. సిరిసిల్లలో నేతన్నలకు బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ ఆర్వీం వస్ర్తాల ఆర్డర్లు ఇచ్చి వారి కుటుంబాలలో వెలుగులు తేవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం వల్లే సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు లేవని చెప్పారు. వస్త్ర వ్యాపారులు ప్రపంచంతో పోటీపడి మారుతున్న ట్రెండ్కు తగిన ఆలోచనలు చేసి ఉత్పత్తి చేస్తే భవిష్యత్ ఉంటుందన్నారు. వస్త్ర పరిశ్రమ కేంద్రాలైన తిర్పూర్, కోయంబత్తూర్లో తాను పర్యటించిన సమయంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు వారికి మద్దతు ఇవ్వడంలేదని చెప్పారని, కేవలం వారి ఆలోచన విధానం, శ్రమతోనే బ్రాండ్గా నిలదొక్కుకుంటున్నట్లు చెప్పారని గుర్తు చేశారు.
వస్త్ర ఉత్పత్తిదారులు పూర్తిగా ఆధారపడవొద్దని సరికొత్త డిజైన్లతో వినూత్న ఆలోచనలతో ముందుకు వెళితే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. సిరిసిల్లలో మెగా పవర్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని గత ఏడేళ్లుగా కోరుతున్నా మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా పవర్లూం క్లస్టర్ ఏర్పాటుకు త్వరలో కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలుస్తానని, సానుకూల స్పందనలేకుంటే పోరాటానికి రాజకీయాలకు అతీతంగా మద్దతునివ్వాలని కోరారు. మెగా పవర్లూం క్లస్టర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి కార్యాచరణ రూపొందించే విధంగా ఆలోచన చేస్తున్నట్లు వివరించారు. దీనికి పూర్తి స్థాయి నేతన్నల మద్దతు కావాలని కోరారు. సిరిసిల్లలో పద్మశాలీ కల్యాణ మండపం, వసతి గృహం ఏర్పాటుకు స్థలం కేటాయించామని, దీనికి సంబంధించి వ్యాపారులు తమవంతు భాగస్వామ్యం అందించి త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సూచించారు. నూతన కార్యవర్గం అధ్యక్షుడు మండల సత్యం, కార్యదర్శి యెల్దండి దేవదాస్తో పాటు కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ రవీందర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయకార్యదర్శి గూడూరి ప్రవీణ్, జిల్లా ఇంచార్జి తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, పాలిస్టర్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
అమాత్యుడి పర్యటన ఇలా..
సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన రైతు ధర్నాకు మధ్యాహ్నం 12.16 గంటలకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. దాదాపు 2గంటల పాటు ధర్నా చేశారు. తర్వాత మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వివాహ వేడుకలకు హాజరైన ఆయన నాలుగు గంటలకు వస్త్రపరిశ్రమ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు.