రాష్ట్ర సర్కారు ఆది నుంచీ అన్నదాతకు అండగా నిలుస్తున్నది. వ్యవసాయాన్ని పండుగలా మార్చి, సంపూర్ణ సహకారం అందిస్తున్నది. సాగునీరు, 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంటల కొనుగోళ్లు ఇలా అనేక పథకాలతో భరోసానిస్తున్నది. ఈ యేడాది అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ‘నేనున్నా’నంటూ ధైర్యమిచ్చింది. కేంద్రం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీకి ఎదురు చూడకుండా.. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఎకరాకు 10 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించింది. అంతే కాదు, రెండు సార్లుగా 1,25,884 మంది రైతులకు 125.24 కోట్ల పరిహారం అందించింది.
కరీంనగర్, జూలై 8 (నమస్తే తెలంగాణ): గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో వడగండ్లు, అకాల వర్షాలు రైతులను వెంటాడాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 22 వరకు పంటలను తీవ్రస్థాయిలో దెబ్బతీశాయి. అప్పుడు ప్రధానంగా వరితోపాటు మామిడి, మక్క, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోగా, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చలించిపోయారు. రైతుల్లో ధైర్యం నింపి ఆదుకునేందుకు సీఎం కేసీఆరే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. మార్చి 23న రామడుగు మండలం లక్ష్మీపూర్, గుండి గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించి, రామడుగు రైతు వేదికగా ప్రెస్మీట్ ఏర్పాటు చేసి రైతులకు ధైర్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా.. పరిహారం ఎకరాకు 10 వేలకు పెంచి ఇస్తామని అదే రోజు ప్రకటించి భరోసానింపారు. ఇచ్చిన మాట ప్రకారం నెలలోపే అంటే ఏప్రిల్లో పరిహారం విడుదల చేశారు. ఏప్రిల్లోనూ అకాల వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, వ్యవసాయ అధికారులు నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. ఆ మేరకు మరోసారి ఎకరాకు 10 వేల చొప్పున నష్ట పరిహారం విడుదల చేశారు. రెండు నెలల్లో జరిగిన పంట నష్టానికి రెండు సార్లు పరిహారం విడుదల చేసి మరోసారి తాను రైతు పక్షపాతినని సీఎం కేసీఆర్ నిరూపించుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో 125.24 కోట్లు
రెండు నెలల్లో జరిగిన నష్టానికి ఆయా జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని విడుదల చేసింది. మార్చిలో పడిన అకాల వర్షాల కారణంగా ఉమ్మడి జిల్లాలో 15,853 మంది రైతులకు సంబంధించి 15,752.7 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అందుకు 15.79 కోట్లు గత ఏప్రిల్లోనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 90 రోజుల వ్యవధిలో రైతుల ఖాతాల్లో జమ చేయగా, ఏప్రిల్లో జరిగిన నష్టానికి సంబంధించి తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 1,10,132 మంది రైతులకు సంబంధించిన 1,09,278 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, అందుకు 109.45 కోట్లు విడుదల చేస్తూ గురువారమే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం 90 రోజుల వ్యవధిలో రైతుల ఖాతాల్లో జమ కానున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో చూస్తే 1,25,884 మంది రైతులు 1,25,030 ఎకరాల్లో పంటలు కోల్పోగా, అందుకు 125.24 కోట్ల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
ఆ సారు మాటంటే మాటే
పంట నష్టం జరిగినంక ఇంత జెప్పన పైసలు వస్తయని అనుకోలె. మొన్న యాసంగిల కోతకచ్చిన పొలమంతా రాళ్లువడి పొర్క అయింది. ఇత్తు లేకుంట రాలింది. ఆశ లేకుంటవోయింది. కేసీఆర్ సార్ నష్టం కట్టిస్తమని చెప్పినంక పాణం నిమ్మలమైంది. అయిన మాటంటే మాటే. మా రైతులకు అండగా నిలవడ్డడు. గందుకనే ఇపుడు పైసలు సుతం వచ్చినయ్. నష్టం బాగనే జరిగినా ఇట్ల రైతులకు పైసలచ్చి ఆదుకునెటోళ్లు సుతం ఉండాలెగదా. ఎకురానికి పది వేల రూపాలిచ్చుడు మునుపు ఉన్నదా..? ఏ రెండు వేలో మూడు వేలో చేతుల పెట్టెటోళ్లు. ఇప్పుడట్లగాకుంట పది వేలు ఇయ్యవట్టె. మల్ల ఏ ఆఫీసు సుట్టూ తిరుగుడు లేకుంట రైతులకు అవుసరం ఉన్నపుడు తీస్కునెతట్టు పైసలు బ్యాంకు ఖాతలనే ఎయ్యవట్టె.
– గుజ్జుల నరిసింహారెడ్డి, రైతు (గుజ్జులపల్లి)
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
మొదటిసారి విడుదల చేసిన నష్ట పరిహారం ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమైంది. తాజాగా, రెండోసారి పంట నష్ట పరిహారం విడుదల చేసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటే పరిహారం రావడానికి ఏండ్లకు ఏండ్లు పట్టేదని, కానీ స్వరాష్ట్రంలో తక్షణమే సాయం అందుతున్నదని సంబుర పడుతున్నారు. గతంలో ఎకరాకు 10 వేల పరిహారం ఏ ప్రభుత్వాలూ ఇవ్వలేదని, రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ ఇంత పెద్ద మొత్తంలో సాయం అందిస్తున్నారని కొనియాడుతున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడే ఆదుకుంటే రైతుకు ధైర్యంగా ఉంటుందని, అదే పని ఇప్పుడు సీఎం చేస్తున్నారని చెబుతున్నారు. ఎంత కష్టమైనా రైతులకు అండగా నిలిచి ఆదుకుంటామని సీఎం చెప్పిన మాటలు తమకు మరింత ఆత్మైస్థెర్యాన్ని పెంచాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, బంగారు పంటలతో రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలుపుతామని స్పష్టం చేస్తున్నారు. కొండంత అండగా కేసీఆర్ ఉండగా తమకు ఎలాంటి ఇబ్బందులూ రావనే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు.
దేశంలో ఎక్కడా లేని పరిహారం
కేంద్ర నిబంధనల ప్రకారం చూస్తే అకాల వానలతో పంటలు దెబ్బతింటే.. వరికి ఎకరాకు 5,400, మక్కకు 3,332, మామిడికి 7,200 చొప్పున పరిహారం ఇస్తున్నది. అది కూడా ఎన్ని నెలలు పడుతుందో, సంవత్సరాలు పడుతుందో తెలియదు. అనేకసార్లు కేంద్ర బృందాలు సర్వే చేసి వెళ్లిన తర్వాత కూడా నిర్ధారిత పరిహారం రైతులకు అందని దాఖలాలు లెక్కకు మించి ఉన్నాయి. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఎకరాకు 10 వేల పరిహారం చెల్లిస్తామని చెప్పడమేకాదు, కేంద్రంతో సంబంధం లేకుండానే పరిహారం అందించారు.
పరిహారం మొత్తం అందింది
నేను 36 గుంటల్లో నువ్వుల పంట సాగు చేశా. ప్రకృతి వైపరీత్యాల వల్ల కురిసిన వర్షాలకు పంట మొత్తం నష్టపోయా. బాధగా ఉండె.. కానీ, వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం చెప్పడంతో కొంత ధైర్యం వచ్చింది. చెప్పినట్టే పరిహారం తొందరగానే వచ్చింది. నేను 36 గుంటల్లో నువ్వుల పంట సాగు చేశా. ప్రభుత్వం పరిహారం కింద రూ.9500 మంజూరు చేసింది. పరిహారం డబ్బులు తొందరలోనే నా బ్యాంక్ ఖాతాల పడటంతో రందిలేకుంట పోయింది. గత ప్రభుత్వాల సమయంలో చాలా సార్లు పంటలకు నష్టం జరిగింది. అయితే, పరిహారం అంతంతే వచ్చేది. కానీ, తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం నష్టపోయిన మొత్తానికి పరిహారం దక్కింది. రైతులకు మంచి చేసే ప్రభుత్వం మళ్లీ రావాలి.
– గంగం గంగారెడ్డి, రైతు కలికోట (కథలాపూర్ మండలం)
గతంల ఎవరూ పట్టించుకోలె
ఆరుగాలం కష్టపడి పండించిన పంట వానదేవుని అగ్రహానికి గతంల చాలా సార్లు నష్టపోయినం. కానీ, అప్పటి నాయకులు ప్రతీసారి పంటల్ని పరిశీలించుడు.. ఫొటోలకు పోజులిచ్చుడు.. మళ్లీ పత్తకు రాకుంట పోవుడు ఉంటుండె. కేసీఆర్ సార్ మాత్రం మాకు పంట నష్టానికి పరిహారం ఇచ్చి అదుకున్నడు. నేను మా శ్రీరాములపల్లి గ్రామంల ఉన్న రెండెకరాల భూమిల వరి పంట వేసిన. మార్చిల కురిసిన వడగండ్ల వానకు వడ్లన్నీ నేల రాలినయ్. అధికారులు వచ్చి పంట నష్టాన్ని రాసుకొని పోయిన్రు. 20 రోజుల్లో నా బ్యాంక్ ఖాతాకు రూ.7500లు వచ్చినయ్.
– వంగపల్లి కమలాకర్రెడ్డి, రైతు శ్రీరాములపల్లి (కొడిమ్యాల మండలం )
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్
దేశంలో ఏ రాష్ట్రంల ఇవ్వని పథకాలను రైతుల సంక్షేమం కోసం మన రాష్ట్రంల సీఎం కేసీఆర్ ప్రవేశపేడుతున్నరు. రైతుబంధు, రైతు బీమా పథకాలు ఎక్కడా లేవు. కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు నింపి రైతుల పంటలకు సాగు నీరు అందిస్తున్నరు. ఉచిత కరెంట్ ఇచ్చి మోటర్ల దగ్గర కరెంటు షాక్తో రైతుల మరణాలు లేకుండా చేసిన్రు. మా శ్రీరాములపల్లి గ్రామంల నాకు నాలుగెకరాల భూమి ఉంది. మార్చి నెలల కురిసిన వడగండ్ల వానకు వరి పంట దెబ్బతినడంతో వ్యవసాయాధికారులు వచ్చి పంట నష్టాన్ని రాసుకొని వెళ్లిన్రు. నా బ్యాంక్ ఖాతాల రూ.25 వేలు పడ్డయి. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కేసీఆర్కు ధన్యవాదాలు.
– చల్ల దయాకర్రెడ్డి, రైతు, శ్రీరాములపల్లి ( కొడిమ్యాల మండలం)