ఎన్నిసార్లు పిలిచినా తప్పించుకు తిరుగుతున్నవ్ ఎందుకు?
ఏడున్నరేండ్ల పాలనలో ఏం చేసినవో చెప్పాలి
విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్రెడ్డి
జమ్మికుంట, సెప్టెంబర్11: ‘ఏడున్నరేళ్లు మంత్రిగా ఉన్నవ్. ఒక్క మోరీ కట్టియ్యకపోతివి. హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలు వరద, బురదకు కారణం నీవు కాదా..? రాజేందర్. నీ వైఫల్యం వల్లే 500ఇండ్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు. పైగా నీళ్లల్ల మునిగితే పరామర్శిస్తున్నవ్. ఏం ముఖం పెట్టుకుని పోయినవో చెప్పాలే. దమ్ము, ధైర్యముంటే అభివృద్ధిపై చర్చకు రా.. ఇది నా సవాల్’. అంటూ ఈటలపై టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం జమ్మికుంట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలకు హౌసింగ్బోర్డు కాలనీ, అంబేద్కర్ కాలనీ, కృష్ణకాలనీలతో పాటు కొన్ని కాలనీల్లోని ఇండ్లు వరద నీటిలో మునిగిపోయినయని, ప్రజలు తినే తిండి దగ్గర్నుంచి, అన్నీ నీటిలో తేలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులు చూస్తే గుండె తరుక్కుపోయిందని చెప్పారు. ప్రజలు తిప్పలు పడుతుంటే.. రాజేందర్ మాత్రం రాజకీయం చేసేందుకు వెళ్లాడని ఆరోపించారు. ఉన్నట్టుండి ఇవ్వాల వాళ్ల వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కారిస్తే ఊరుకుంటారా.. తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని స్పష్టం చేశారు. నువ్వు పార్టీని వీడిన తర్వాతే ఇక్కడి ప్రజలకు పట్టిన దరిద్రం పోయిందన్నారు. జమ్మికుంట అభివృద్ధి కోసం సీఎం రూ.50కోట్లు ఇచ్చారని, మంత్రి హరీశ్ ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. హెచ్బీకాలనీలో వరద నీరు నిలువకుండా వెళ్లేందుకు రూ.2.50కోట్లతో మోరీ కట్టిస్తున్నామని, అందుకు నిధులు కూడా వచ్చాయని వివరించారు. ఇటీవల కురిసిన వానలకు నష్టపోయిన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందిస్తామని భరోసానిచ్చారు.
బీజేపీ నుంచి గెలిచి ఏం చేస్తడో చెప్పాలే?: ఎమ్మెల్యే చందర్
ఈటలకు అవకాశం ఉండి కూడా నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటని, ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే చందర్ పిలుపునిచ్చారు. ఈటల టీఆర్ఎస్లో ఉండి ఏడున్నరేళ్లుగా మంత్రిగా పనిచేసిన విషయాలను గుర్తు చేశారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన ఈటల, పార్టీకి వెన్నుపోటు పొడిచారని, తన సొంత లాభం కోసం బీజేపీలో చేరాడని ఆరోపించారు. నాడు అభివృద్ధి చేతకాని ఈటల, ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చి ఓటెలా అడుగుతున్నాడో.. చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు గెలిచే అవకాశం లేదని, ఒక వేళ గెలిస్తే ఏం చేస్తాడో.. చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటలకు ఓటేస్తే ఆగమై పోతామని స్పష్టం చేశారు. బీజేపీకి డిపాటిట్ రాదని, గెల్లు సీనుకు భారీ మెజార్టీనిచ్చేందుకు ప్రజలు ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఇక్కడ టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు రాజ్కుమార్, పీఏసీఎస్, మున్సిపల్ చైర్మన్లు సంపత్, రాజేశ్వర్రావు, కౌన్సిలర్లు నరేశ్, లావణ్య, భాస్కర్, సారంగం, నాయకులు కోటి, సత్యనారాయణరావు, శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్, దిలీప్ ఉన్నారు.