మిడ్మానేరు ముంపు గ్రామాల్లో మిగిలిపోయిన చిన్నాచితక సమస్యలు
పరిష్కారం కోసం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ప్రయత్నాలు
తుదిదశకు నష్టపరిహారం చెల్లింపు అంశం lఇటీవలే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు
తాజాగా వినోద్ కుమార్తో వేములవాడ ప్రజాప్రతినిధుల భేటీ
ధన్యవాదాలు తెలిపిన ప్రజాప్రతినిధులు
కరీంనగర్, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాడు సిరిసిల్ల మెట్టప్రాతం..సాగునీటి కోసం దశాబ్దాలపాటు ఎదురుచూపులు..వానకాలంలోనే బీళ్లుగా భూములు..యాసంగిలోనైతే నెర్రలు బారిన నేలలు..వరి సాగు చేస్తే వానల కోసం చూడాల్సిన రోజులు..చివరకు పంట చేతికిరాక అప్పులపాలు..ఆత్మహత్యలవైపు రైతులు..నేడు సిరిసిల్ల సిరుల మాగాణి.. జీవం పోసిన కాళేశ్వరం జలాలు.. కాలంతో సంబంధం లేకుండా నీళ్లు..రికార్డు స్థాయిలో యాసంగి వరి సాగు..అంచనాలకు మించి ధాన్యం దిగుబడి..చింత లేకుండా కొనుగోళ్లు..అన్నదాతల్లో హర్షాతిరేకాలు..
మిడ్ మానేర్ (శ్రీరాజరాజేశ్వర) ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో నష్ట పరిహారం చెల్లింపునకు సాంకేతికపర అడ్డంకులు తొలగిపోయాయి. ఈ అవరోధాలను అధిగమించేందుకు న్యాయపరంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కొనసాగించిన ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి. ముంపు గ్రామాల ప్రజల భూములు, స్థిరాస్తులు ముంపునకు గురైన నోటిఫైడ్ జాబితాలో అవి లేవన్న కారణంగా నష్ట పరిహారం ఇవ్వడం కుదరదని అధికారులు కరాఖండిగా చెప్పారు. దాంతో వినోద్ కుమార్ గతేడాది ఆగస్టు 18న సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి, ముంపు గ్రామాల సమస్యపై కూలంకషంగా చర్చించారు. నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టులో అడ్వొకేట్ జనరల్తో మాట్లాడి, సమస్య పరిష్కారానికి మార్గం సుగమం చేశారు. ఈ అంశాన్ని ప్రత్యేకంగా గుర్తించే విధంగా ప్రభుత్వ పరంగా కూడా పరిగణనలోకి తీసుకునేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ గత ఫిబ్రవరి 26న జీవో ఆర్.టీ.నంబర్. 97ను ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ఆదేశించారు. దాంతో క్షేత్ర స్థాయిలో మిగిలిన చిన్నా చితక సమస్యలు త్వరలోనే పరిష్కారమై, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించేందుకు మార్గం సుగుమమైంది. ఈ నేపథ్యంలో వేములవాడ జడ్పీటీసీ సభ్యుడు మ్యాకల రవి, ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు, వైస్ ఎంపీపీ రేగులపాటి రవిచందర్ రావు, అనుపురం సర్పంచ్ కొండపల్లి వెంకట రమణారావు, చింతలఠాణా సర్పంచ్ రేగులపాటి రాణీ హరిచరణ్ రావు గురువారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్తో భేటీ అయ్యారు. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కృషి చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.