భారీ పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉపాధి దొరకడంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించిన సిద్దిపేట జిల్లా బెజ్జంకి, కోహెడ మండలాల ప్రజల ఆశపై పిడుగుపడ్డట్టు అయ్యింది. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రెండు ఇథనాల్ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు, రైతులు విలవిలలాడుతున్నారు. పరిశ్రమల నుంచి వస్తున్న దుర్వాసన ప్రజలు భరించలేక పోతున్నారు. భారీ శబ్దాల కారణంగా కంటిమీద కనుకు కరువుతున్నది. వ్యర్థాలతో నీటి వనరులు కలుషితం అవుతున్నాయి. పంటల సాగుపైనా ప్రభావం చూపుతున్నది. నేల,నీరు,వాయు జల కాలుష్యంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
బెజ్జంకి, జూలై 15 : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామశివారులో ఏర్పాటు చేసిన గ్రీన్వెస్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, పోతారం వైట్ఫీల్డ్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఇథనాల్ పరిశ్రమలతో కాలుష్యం చోటుచేసుకుంటున్నది. ప్రతిరోజు 25 వేల లీటర్ల సామర్థ్యంతో ఈ పరిశ్రమల్లో ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో ఎలాంటి కాలుష్యం జరగదని, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని అప్పట్లో తమను నమ్మించి పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పించినట్లు ప్రజల ఆరోపిస్తున్నారు. తీరా ఇప్పుడు ఇథనాల్ పరిశ్రమల కాలుష్యంతో కంటిమీద కునుకులేకుండా పోయిందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

అప్పట్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొంతమంది ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటును అడ్డుకునే ప్రయ త్నం చేశారు. కానీ, అన్నిశాఖల అనుమతులు రావడంతో అధికారులు పరిశ్రమల ఏర్పాటుకు సహకరించారు. ఈ ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటులో శంకర్నగర్కు చెందిన యువకుడు ఒకరు గ్రామాల్లో క్రియాశీలంగా ఉన్న వారిని గుర్తించి, పరిశ్రమల నుంచి డబ్బులు ఇప్పిం చి, మభ్యపెట్టి పరిశ్రమలు ఏర్పాటయ్యేలా కృషిచేశాడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుగ్గిళ్ల గ్రామ పరిరక్షణతో కమిటీ ఏర్పాటు చేసి గ్రామంలో ఇథనాల్ పరిశ్రమ నిర్మాణాన్ని నిలిపివేసే ప్రయత్నం చేశారు. ఈ ఇథనాల్ పరిశ్రమలు లాభార్జనే ధ్యే యం గా సామర్ధ్యం కంటే ఎక్కువ గా ఉత్పత్తి చేస్తూ తమకు హాని చేస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇథనాల్ పరిశ్రమల నుంచి వెలువడే దుర్వాసనతో ప్రజలు ముక్కుమూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాయు,జల, శబ్ధ కాలుష్యం చోటుచేసుకుంటున్నది. గుగ్గిళ్ల రెవెన్యూ శివారులో ఏర్పాటు చేసిన ఇథనాల్ పరిశ్రమ నుంచి వస్తున్న వ్యర్థాలు నేరుగా వాగులు, కాలువలోకి వదలుతున్నారు. ఆ వ్యర్థాలు తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్లోకి చేరి చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు.

పరిశ్రమల వ్యర్థాలు రిజర్వాయర్లోకి వస్తుండడంతో తమ చేపలు ఎవరూ కొనరని, అసలు చేపలు బతకడం లేదని మత్స్యకారలు ఆందోళన చెందుతున్నారు. చెరువులోని నీటిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు తాగడంతో రోగాల బారిన పడుతున్నాయని గొర్రెల కాపరులు చెబుతున్నారు.
ఇథనాల్ పరిశ్రమల కాలుష్యంతో సమీపంలోని వ్యవసాయ భూముల్లో భూసారం దెబ్బతిని, పంటల దిగుబడి, నాణ్యతపై ప్రభావం చూపుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యానికి బయపడి కూలీలు సైతం చేనుల్లో పనులు చేయడానికి ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కూలీ డబ్బులు ఎక్కువగా ఇస్తేగాని కూలీలు వచ్చే పరిస్థితి లేదని, పంటల దిగుబడి తగ్గడం,కూలీల రేట్లు పెరిగి తమకు నష్టాలే మిగులుతున్నాయని రైతులు వాపోతున్నారు.
ఈ రెండు ఇథనాల్ పరిశ్రమల్లో ఇతర రాష్ర్టాలు, ఇతర ప్రాంతాల వారు పనులు చేస్తున్నారని, వారి తీరుతో చుట్టుపక్కల గ్రామా ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూలీ పనికి వచ్చిన వారు మద్యం తాగి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో వలస కూలీ ఒకరు ఇక్క డ మూగజీవాలపై అఘాత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేగింది. పరిశ్రమల చుట్టూ మహిళలు ఒంటరిగా వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. పరిశ్రమల పరిసర ప్రాంతాల్లో డ్రోన్స్ పనిచేయడం లేదని రైతులు తెలిపారు.
బెజ్జంకి మండలం రాజీవ్ రహదారికి సమీపంలో ఉండడంతో హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల వారు ఇక్కడి వ్యవసాయ భూములను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరిచేవారు. కానీ, ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటు తర్వాత కాలుష్యంతో ఇక్కడ భూములు కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో రియల్ ఎస్టేట్ మందగించడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కొనుగోలుదారులతో కళకళలాడిన ఈ ప్రాంతం, ఇప్పుడు భూములు కొనేవాళ్లు తగ్గిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇథనాల్ పరిశ్రమల దుష్ర్పభావంతో ఇబ్బంది పడుతున్న పోతారం, నర్సింహులపల్లి, దాచారం, ముత్తన్నపేట, క్రాసింగ్, బెజ్జంకి, గుగ్గిళ్ల, తిమ్మాయిపల్లి, రేగులపల్లి, కోహెడ మండలంలోని శనిగరం, శంకర్నగర్ గ్రామాల ప్రజలు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఇథనాల్ పరిశ్రమల కాలుష్యం నుంచి తమను రక్షించడంతో పాటు పరిశ్రమలను శాశ్వతంగా మూసివేయాలని ప్రజలు సోమవారం బెజ్జంకి తహసీల్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఇక్కడి నుంచి ఈ పరిశ్రమలను తరలించి తమ ప్రాణాలు కాపాడాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
ఇథనాల్ పరిశ్రమ నుంచి వెలువడే చెడు వాసన భరించలేకపోతున్నాం. మా గ్రామం పరిశ్రమకు దగ్గరగా ఉండటంతో వాసన మరింత ఎక్కువగా వస్తున్నది. శబ్ధం గట్టిగా రావడంతో ప్రజలందరికీ నిద్ర కూడా కరువుతున్నది. పరిశ్రమ నుంచి వ్యర్థ జలాలు వదులుతున్నారు. దీంతో నేల,నీరు,గాలి కాలుష్యం చోటుచేసుకుంటున్నాయి. ఇథనాల్ పరిశ్రమలు వచ్చిన తర్వాత మాకు అన్ని విధాలుగా నష్టం జరుగుతున్నది.
-జెట్టి లక్ష్మణ్, రైతు,నర్సింహులపల్లి (సిద్దిపేట జిల్లా)