నాడు ధాన్యం అమ్ముకోవాలంటే తిప్పలు
కేంద్రాల వద్ద రోజులకొద్దీ పడిగాపులు
అయినా మద్దతు ధర దక్కక దిగాలు
నేడు అన్నదాతకు అండగా సీఎం కేసీఆర్
గ్రామాల వారీగా కొనుగోలు సెంటర్లు
ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మద్దతు ధరతో కొనుగోళ్లు
వారంలోపే బ్యాంకు ఖాతాల్లో నగదు జమ
రైతులకు ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు
కరీంనగర్, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు ఆరుగాలం పండించిన పంటను అమ్ముకుందామంటే దగ్గరలో మార్కెట్ ఉండేది కాదు. కిలోమీటర్ల దూరం పోవాలంటే రవాణాకు వేలకు వేలు ఖర్చయ్యేది. తీరా తీసుకెళ్లిన తర్వాత మార్కెట్లో ధాన్యం పోద్దామంటే జాగ ఉండేదికాదు. ఎక్కడోచోట పోసిన తర్వాత రోజులకొద్దీ పడిగాపులు గాసేది. కొనడానికి వచ్చిన అడ్తీదారులు ఒక్కొక్కరు ఒక్కో (ధర నిర్ణయం) పాట పాడుతోంటే రైతుగుండె దడతో బరువెక్కేది. నిర్ణయమయ్యేదాకా ముఖంలో ఆందోళన కనిపించేది. మద్దతు ధర ఊసే లేక పోయేది. ఇంకొంచెం రేటు పెడితే బాగుండు అని అనుకునేది. ధాన్యం అమ్మిన తర్వాత సేట్ల కార్యాలయాలకు వెళ్లి డబ్బుల కోసం గంటల తరబడి వేచిచూసేది. బిల్లు పట్టికలో ఆ చార్జీ.. ఈ చార్జీ.. కమీషన్ అని సవాలక్ష రాసి మిగిలిన పైసలు రైతు చేతిల పెట్టేది. ఈ తిప్పలన్నీ ఎందుకని కల్లంకాన్నే దళారీకి అమ్మితే ఆఖరికి అప్పే మిగిలేది.
ఇప్పుడు రైతు పంట అమ్ముకోవడానికి ఊరు దాటాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పోర్ట్ చార్జీలకు వేలకు వేలు పెట్టాల్సిన పనిలేదు. ధాన్యాన్ని పట్టుకపోయి పడిగాపులు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ధర ఎంత పెడుతరో అన్న ఆందోళన ఏమాత్రం లేదు. డబ్బుల కోసం ఎటూ తిరగాల్సిన పని ఎంతమాత్రమూ లేదు. ఎందుకంటే.. రాష్ట్ర సర్కారు కర్షకులపై కరుణ చూపుతున్నది. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అండగా నిలుస్తున్నది. రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఎక్కడికో వెళ్లి ఇబ్బంది పడకుండా, ఊరిలోనే మద్దతు ధరతో కొంటూ భరోసానిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు యంత్రాంగం ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నది. ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్లు జాతరలా సాగుతుండగా, పండించిన ప్రతి గింజకూ మద్దతు ధర దక్కుతున్నది. రైతు అమ్మిన వారంలోపే వారి బ్యాంకు ఖాతాల్లో ఏ చార్జీలు లేకుండా నగదు జమ అవుతున్నది. ఆపత్కాలంలోనూ కొనుగోళ్ల తీరును చూసి కర్షకలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
ఈ యాసంగిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి సాగు గణనీయంగా పెరిగింది. పోయినసారి 7.98 లక్షల ఎకరాల్లో వేయగా, ఈసారి 9.19 లక్షల ఎకరాల్లో సాగయింది. గతంతో పోలిస్తే 1.21 లక్షల ఎకరాలు అదనంగా ఉన్నది. అయితే, నీటి లభ్యత పెరగడమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. కాళేశ్వరం ఎత్తిపోతలు పూర్తిగా అందుబాటులోకి రావడంతో ప్రధాన ప్రాజెక్టులను నింపి, వాటి పరిధిలో నీటిని విడుదల చేశారు. ఇదే సమయంలో ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద వరద కాలువకు తూములు పెట్టి సాగుకు నీరందించారు. వీటితోపాటు అనుసంధాన చెరువులు, కుంటలను నింపి ఆయకట్టును తడిపారు. ఉమ్మడి జిల్లాలో నలుమూలలకు నీళ్లు పారడంతో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. అదే స్థాయిలో దిగుబడి వస్తున్నది. గత యాసంగిలో ఉమ్మడి జిల్లాలో 17.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, అందులో జిల్లా అవసరాలకు పోనూ 14.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈసారి 1.21 లక్షల ఎకరాల్లో సాగు కాగా, 22.17 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసింది. అలాగే, జిల్లా అవసరాలకు 3.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పోనూ, 18.58 లక్షల మెట్రిక్ టన్నులను ప్రస్తుతం కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
ఒకప్పుడు బంతి కొట్టిన తర్వాత వడ్లను ఎండబోసే వారు. ఆ తర్వాతే తూర్పార పట్టే వారు. ఈ సమయంలో ఏ మాత్రం తరుగు లేకుండా పక్కకు నెట్టేవారు. తూర్పార పట్టిన వడ్లను వారం పాటు కల్లంలోనే ఎండబోసేవారు. వడ్లను ఒక చేతిలో పోసుకొని మరోచేతితో గట్టిగా రాకితే వడ్లపై ఉన్న పొట్టు పోయి బియ్యం అయ్యేవి. అలా బియ్యం అయితేనే కానీ, కోనుగోలు చేసే వారు కాదు. అంతేకాదు, మట్టిపెల్ల కనిపించినా.. తడిసినా కొనేవారు కాదు. ప్రస్తుతం వచ్చే ధాన్యంతో పోలిస్తే అప్పట్లో ఉమ్మడి జిల్లాలో వచ్చే ధాన్యం 30 నుంచి 40 శాతం మాత్రమే ఉండేది. అయినా కొనుగోలుకు సవాలక్ష కొర్రీలు ఉండేవి. మార్కెట్కు తీసుకెళ్లినా కొనే వాళ్లు లేకపోవడం, రెండు మూడు రోజుల పాటు మార్కెట్లోనే ఉండాల్సివచ్చేది. చివరకు అడ్తీదారులు పెట్టిందే ధర అన్నట్లుగా ఉండేది. ఆ తర్వాత గత ప్రభుత్వాల హయాంలో కొనుగోలు కేంద్రాలు అమల్లోకి వచ్చాయి. అయినా అన్నదాతకు పూర్తి స్థాయి న్యాయం జరుగలేదు. కానీ, స్వరాష్ట్రంలో అన్నదాతకు మేలు జరుగుతున్నది. లక్షల మెట్రిక్ టన్నుల్లో ధాన్యం వస్తున్నా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నది. అన్నదాతకు అండగా నిలుస్తున్నది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు అంతంతే ఉన్నా.. ఆ కష్టనష్టాలను భరిస్తూ, కర్షకులపై కరుణ చూపుతున్నది.
సర్కారు భరోసా
ఓవైపు కరోనా విజృంభిస్తున్నది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నది. మరోవైపు కేంద్రం కొత్త నిబంధనలతో కొర్రీలు పెడుతున్నది. నూతన చట్టాలు తెచ్చి కొనుగోళ్లకు అడ్డుకట్ట వేస్తున్నది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సర్కారు బృహత్తర కార్యక్రమం చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రైతు చెంతకే వెళ్లి ధాన్యం కొనాలని నిర్ణయించింది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ తెలంగాణ తరహా ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదు. కనీసం మార్కెట్ యార్డులకు తెచ్చిన ధాన్యాన్నే కొనుగోలు చేసే దిక్కు లేదు. కానీ, మన రాష్ట్రంలో మాత్రం రైతుకు పూర్తి భరోసా దొరుకుతున్నది. ఓవైపు సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్, పెట్టుబడి కోసం రైతుబంధు ఇచ్చి, కుటుంబానికి ధీమానిచ్చేందుకు రైతుబీమా కల్పించి సర్కారు అండగా నిలుస్తున్నది. ఇంతటితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగిపోలేదు. పండించిన ప్రతి గింజనూ కొనాలని, అందుకే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారయంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రస్తుతం కరోనాతో క్లిష్ట పరిస్థితులు ఉన్నా ఎక్కడా రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని సూచించారు. ఆ మేరకు రంగంలోకి దిగిన అధికారులు ఊరూరా ధాన్యం కొంటున్నారు. ఏ కోణంలో చూసినా ప్రభుత్వానికి తలకు మించిన భారం అయినా రైతుల కోసం భరిస్తున్నారు. దీంతోపాటు అకాలవర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని సైతం రెండుసార్లు ఎండబోసి తెస్తే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కొనుగోళ్లు జరుగుతున్న తీరుపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కల్లం తీర్చిన కష్టం..
పండిన ధాన్యాన్ని ఆరబోసేందుకు జాగలేక ఒకప్పుడు నరకయాతన పడేది. వర్షం వస్తే నిండా మునిగేది. ఈ క్రమంలో ప్రభుత్వం సబ్సిడీతో నిర్మిస్తున్న కల్లాలు రైతుల కష్టం తీర్చుతున్నాయి. 60 చదరపు గజాల నిర్మాణానికి రూ.65వేలు, 70 చదరపు గజాలకు రూ.78వేలు, 80 గజాల నిర్మాణానికి రూ.85వేలు మంజూరు అవుతుండగా, సద్వినియోగం చేసుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఇప్పటి వరకు 55 మంది కల్లాలు నిర్మించుకోగా, ఇటీవల వచ్చిన ధాన్యం దిగుబడులను ఆరబోసుకుంటున్నారు. వీటిపై ధాన్యం త్వరగా ఎండడంతోపాటు అకాల వర్షాల నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది.