పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా జిల్లా విద్యా శాఖ పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నది. వచ్చే నెల 3వ తేదీ నుంచే పబ్లిక్ పరీక్షలు జరుగనుండగా, ప్రధానంగా వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే రోజూ ఉదయం, సాయంత్రం విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తూ, ఉత్తమ ఫలితాల కోసం తీవ్రంగా కృషి చేస్తూనే, అధికంగా 10 జీపీఏలు రాబట్టేందుకు కష్టపడుతున్నది.
చొప్పదండి, మార్చి 22: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు, స్లిప్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అన్ని సబ్జెక్ట్లను రివిజన్ చేయిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించి, పాఠ్యాంశాల్లో సందేహాలను నివృత్తి చేస్తున్నారు. క్లిష్టతరమైన ప్రశ్నలను సులభమైన పద్ధతిలో రాసే విధానాన్ని బోధిస్తున్నారు. ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు స్నాక్స్ అందిస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన అభ్యాస దీపికలను విద్యార్థులతో ప్రాక్టీస్ చేయిస్తున్నారు.
పాఠశాలల్లో విద్యార్థుల పురోగతిపై 15 రోజులకొకసారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు. సబ్జెక్ట్ల నిపుణులు, విద్యాశాఖ అధికారులు విద్యార్థుల పురోగతిని వివరిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.
జిల్లాలోని 191 ప్రభుత్వ పాఠశాలలు, 147 ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలురు 3210, బాలికలు 3241, ప్రైవేట్ పాఠశాలల్లో బాలురు 3149, బాలికలు 2544 మంది పరీక్షలు రాయనున్నారు. వీరందరి కోసం విద్యాశాఖ జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. డీఈవో జనార్దన్రావు ఎప్పటికప్పుడు పాఠశాలలను సందర్శిస్తూ హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వెనుకబడిన విద్యార్థుల్లో ఎక్కువ మందికి ఇంగ్లిష్, గణితం, ఫిజిక్స్, బయోలజీలో తక్కువ మార్కులు వస్తున్నాయని గుర్తించి సబ్జెక్ట్ ఉపాధ్యాయులు ఈజీ మెథడ్తో బోధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సమయంలో స్నాక్స్ అందిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నం. ప్రతి విద్యార్థికి స్నాక్స్ అందిస్తున్నం. విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకునేందుకు తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో అభ్యాస దీపికలు అందించాం. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నం.
-వేణుకుమార్, మండల విద్యాధికారి
పాఠశాలలో పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నం. ఉదయం, సాయంత్రం పిల్లలకుప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నం. వెనుకబడిన పిల్లలను గుర్తించి వారికి అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తున్నం. ప్రత్యేక తరగతుల్లో పిల్లలకు ప్రభుత్వం అందించిన స్నాక్స్ అందజేస్తున్నం. మా పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించి, అందరికీ 10 జీపీఏ వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నం.
-కోల రమేశ్, ప్రిన్సిపాల్, రుక్మాపూర్ ఆదర్శ పాఠశాల