అన్నదాతలు ఆందోళన చెందవద్దు
నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందండి
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాలలో సమీక్షా సమావేశం
జగిత్యాల టౌన్, ఏప్రిల్ 9: ‘గ్రామస్థాయిలోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు’ అంటూ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్లో ధాన్యం కొనుగోళ్లపై డీఆర్డీఏ, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనంతగా జిల్లాలో ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లావ్యాప్తంగా 406 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, కరోనా నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రైతులు సెంటర్లకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని విజ్ఞప్తి చేశారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని భావించే టీఆర్ఎస్ ప్రభుత్వం, వారి అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని గుర్తుచేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లోనే రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా అవతరించిందన్నారు. ఎఫ్సీఐ సేకరించిన ధాన్యంలో తెలంగాణ వాటా 60 శాతం ఉండడం గర్హనీయమన్నారు.
జిల్లాలో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని జగిత్యాల కలెక్టర్ రవి తెలిపారు. ధాన్యం నాణ్యత పరిశీలనపై ఏవోలు, ఏఈవోలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. టార్పాలిన్ కవర్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, ధాన్యం శుద్ధి, తేమ శాతం కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. ప్యాడీ క్లీనర్ ఉంటేనే ధాన్యం కొనుగోలుకు అనుమతి ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ధాన్యాన్ని తీసుకువచ్చే రైతులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. ధాన్యం సెంటర్లలో కాల్సెంటర్ ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల సంస్థ మేనేజర్ను ఆదేశించారు. నిబంధనలు పాటించని కొనుగోలు కేంద్రాలను బ్లాక్లిస్ట్లో పెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీఎమ్మెఎస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా కో ఆర్డినేటర్ చీటి వెంకట్రావు, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు మాధురి, వినోద్కుమార్, డీఆర్డీవో వినోద్, డీఏవో సురేశ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్కుమార్, మార్కెటింగ్ ఏడీ ప్రకాశ్, పౌర సరఫరాల సంస్థ అధికారి రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భద్రతపై భరోసాకే కార్డన్ సెర్చ్
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం