ఊరూరా రైతుబంధు ఉత్సవాలు
ఎడ్లబండ్లతో ర్యాలీలు
మహిళలకు ముగ్గుల పోటీలు
పంట క్షేత్రాల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు
కరీంనగర్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : పెట్టుబడి సాయం అందించి అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అన్నదాతలు హారతి పడుతున్నారు. 24 గంటల ఉచిత కరెంటు, ఎరువులు, విత్తనాలు ఇస్తూ వ్యవసాయం పండుగలా మార్చిన ప్రగతి ప్రదాతకు జేజేలు పలుకుతున్నారు. గత పది రోజులుగా రైతుబంధు నగదు వస్తుండడంతో పల్లెల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. ఎడ్ల బండ్ల ర్యాలీలు, ముగ్గుల పోటీలతో వారోత్సవాలు ఊరూరా ఉత్సాహంగా సాగుతున్నాయి. మరోవైపు పంట క్షేత్రాల్లో సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ రైతులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
రైతుబంధు వారోత్సవాలతో పల్లె గూటికి పండగొచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు రైతాంగం పాలాభిషేకం చేస్తూ తమ కృతజ్ఞతను చాటుకుంటున్నది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేటలో నిర్వహించిన ఎడ్లబండ్ల ర్యాలీల్లో స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రామడుగు మండలపరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సంబురాల్లో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేట, బొంపల్లి గ్రామాల్లో భారీ ట్రాక్టర్ ర్యాలీ తీయగా, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడిపారు. భారీ జెండాను ఊపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బొంపల్లిలో కడారి కొమురేశ్ అనే రైతు పొలంలో ‘కేసీఆర్’ పేరుతో నారు గుజులను ఏర్పాటు చేశాడు. అంతర్గాం మండలం విలేజ్ అంతర్గాంలో రైతులు తమ ఇళ్ల ముందు వేసిన ముగ్గులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తిలకించారు. ధర్మారం మండలం మల్లాపూర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర, హరిదాస్నగర్, రాగట్ల పల్లిలో రైతుబంధు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పొలాల్లో కేసీఆర్ పేరిట నాట్లు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. తంగళ్లపల్లిలో మహిళా రైతులను సన్మానించారు.
మా బతుకులు మారినయ్..
కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంకనే మా రైతుల బతుకులు మారినయ్. అంతకు ముందు దళారుల చేతుల్ల నష్టపోయెటోళ్లం. కేసీఆర్ సార్ దళారీ వ్యవస్థను పోగొట్టిండు. ఒకప్పుడు ఇత్తనాలు బ్లాకుల కొనేది. ఎరువులు గంతే. గిప్పుడు నకిలీ ఇత్తనాల మాటే లేదు. అవి అమ్మినట్లు తెలిస్తే కేసులు పెడుతున్నరు. ఒకప్పుడు పెట్టుబడులకు పైసలున్నోళ్ల దగ్గరికి పోయి అడ్డగోలు మిత్తికి తీసుకచ్చెటోళ్లం. పంటను అగ్గువసగ్గువకు అమ్ముకునెటోళ్లం. ఏం మిగలకపోయేవి. గిప్పుడు గవన్నీ పోయినయ్. కేసీఆర్ సారు ఎవుసానికి అన్ని సౌలత్లు చేసిండు. పెట్టుబడికి సాయం చేస్తున్నడు. రైతులు ఎవరి దగ్గరికి అప్పుకు పోకుండ చేస్తున్నడు కాబట్టే పంట లాభాలు మిగులుతున్నయ్. కరెంట్ ఫ్రీగ ఇచ్చి ఏ బాధలు లేకుండ చూస్తున్నడు. బీజేపీ సర్కారు అడ్లు కొనేది లేదని తొండి పెడుతుంటే ఎందుకు కొనరని మా పక్షాన కేసీఆర్ సార్ నిలబడి కొట్లాడుతున్నడు. నాకు రెండెకరాలు ఉంది. ఏడాదికి రెండు సార్లు మొత్తం ఇరవై వేల రైతుబంధు పైసల్ అస్తయ్.. ఇట్ల నాలుగేండ్ల నుంచి అస్తున్నయ్..-అమ్ముల భిక్షపతియాదవ్, రైతు, హరిపురం(ఓదెల)