కరీంనగర్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ గడ్డ వలసజీవులకు బతుకునిస్తున్నది. కాళేశ్వరం జలాలు, సంక్షేమ పథకాల అమలుతో ఎవుసం పండుగలా మారి, వేలాది మందికి బతుకుదెరువు చూపుతున్నది. చేతినిండా పని లేక.. పనికి తగ్గ కూలి దొరక్క.. కుటుంబాలను పోషించలేక.. సొంతూళ్లను వదిలి వచ్చిన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బిహార్, ఒడిశా రాష్ర్టాల కార్మికులను అక్కున చేర్చుకుని, భరోసా ఇస్తున్నది. వ్యవసాయంతోపాటు అనుబంధరంగాల్లోనూ పుష్కలమైన ఉపాధి అవకాశాలు దొరుకుతుండగా, వలస కూలీలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ రాష్ర్టాల్లో పట్టించుకున్నోళ్లే లేరని, ఇక్కడ పనులు, సౌకర్యాలు బాగున్నాయని సంతోషపడుతున్నారు. గిట్టుబాటు కూలితో నాలుగు పైసలు సంపాదించుకొని వెళ్తున్నామని, భార్యాబిడ్డలను బాగా చూసుకుంటున్నామని చెబుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యవసాయం ఊహించని రీతిలో విస్తరించింది. గతంలో బీళ్లుగా ఉన్న భూములన్నీ సాగులోకి వచ్చాయి. గతంలో కూలీ నాలీ చేసుకున్న జిల్లా వాసులు నీటి వసతి పెరుగడంతో వ్యవసాయం చేసుకుంటున్నారు. చాలా మంది కూలీలు రైతులుగా మారడంతో ఒక్కసారిగా కూలీలకు తీవ్ర కొరత ఏర్పడింది. అదే సమయంలో వ్యవసాయమేకాదు అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా పెరుగడంతో ఇతర రాష్ర్టాల కూలీలకు ఉమ్మడి జిల్లా బతుకుదెరువుగా మారింది. వారికి ఎకరాల కొద్ది భూములున్నా నీటి వసతి లేకపోవడం, పనులు దొరికినా అంతగా గిట్టుబాటు కాకపోవడంతో కొన్నేండ్లుగా జిల్లా బాటపడుతున్నారు. నాట్లు వేయడం నుంచి కోతలు, మోతల వరకు అన్ని పనులు ఇప్పుడు వలస కూలీలే చేస్తున్నారు. నాట్లు వేసేందుకు బిహార్, పశ్చిమబెంగా నుంచి వందలాది మంది వస్తున్నారు. ఆయకట్టు ప్రాంతాల్లోని గ్రామాల్లోనే మకాం వేస్తున్న కూలీలు ప్రతి సీజన్లో రెండు మూడు నెలలు ఇక్కడే ఉండి నాట్లు వేసి వెళ్తున్నారు. గుత్తలు పట్టుకుని వేస్తున్నారు. స్థానిక రైతులు వారికి ఎలాంటి లోటు లేకుండా వసతులు కల్పిస్తున్నారు. చాలా మంది వాళ్ల పనులు పూర్తయ్యే వరకు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు.
రైస్ మిల్లుల్లోనూ వారే..
బిహార్, ఒడిషా, చత్తీష్గఢ్, పశ్చిమబెంగా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి కూలీలు వచ్చి రైస్ మిల్లుల్లో పనులు చేసుకుంటున్నారు. గిట్టుబాటు కూలీ, క్రమం తప్పకుండా పనులు దొరకడంతో ఇక్కడికి క్యూ కడుతున్నారు. నాట్లు వేసే పనులు ఏడాదిలో రెండు సీజన్లలో మాత్రమే లభిస్తున్నా ఆ కొద్ది కాలం ఇక్కడికి వచ్చి పనులు చేసుకుని ఆశించినంత సంపాదించుకుని తిరిగి వాళ్ల సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. గత రెండు మూడేళ్లలో ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చే కూలీల సంఖ్య విపరీతంగా పెరిగింది. కొందరు కేవలం వరి నాట్లకే కాకుండా రైస్ మిల్లుల్లో హమాలీలుగా, కూలీలుగా ఉంటున్నారు. రెండు మూడేళ్లుగా హమాలీ పనులు క్రమం తప్పకుండా లభిస్తుండడంతో ఏడాది పొడవునా ఇక్కడే ఉంటూ వీలు దొరికినపుడే సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇక్కడి బాయిల్డ్ రైస్ మిల్లుల్లో ఎక్కువగా బిహార్ నుంచి వచ్చిన కూలీలే పనులు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనూ వీళ్లే హమాలీలుగా ఉంటున్నారు.
మా దేశంల ఇట్ల పనులు దొరకయ్..
మాది నేపాల్. బిహార్ బార్డర్కు 2 కిలోమీటర్ల దూరం ఉంటది. మూడేండ్ల కింద బిహర్ల తెలిసినోళ్లతోని ఇక్కడికి వచ్చిన. కొడుకు పెండ్లికి అప్పు అయ్యింది. ఇక్కడ పనిచేసుకొని తీర్చిన. ఇక్కన్నే పనిచేసుకొని నాలుగు పైసలు ఎనకేసుకోవాల్నని చూస్తున్న. నేపాల్ల భూమి ఉంది కానీ ఇక్కడి లెక్క నీళ్లుండయి. చాన భూములు బీళ్లు ఉంటయి. ఇక్కడ ఎటు చూసిన పంటలే కనిపిస్తయి. మంచిగ పనిదొరుకుతది. మా దేశంల ఇక్కడి లెక్క పనులు ఉండయ్. బతుకుదెరువు తక్కువ. ఇక్కడ రెండు మూడు నెలలు కష్టపడితే వచ్చే పైసలు మా దగ్గర ఏడాది కష్టపడినా రావు. అందుకనే బిహార్ వాళ్లతోని ఇక్కడికి వచ్చి హమాలీ పని చేసుకుంటున్నా. అప్పు తేరింది. ఇపుడు పైసలు జమ చేసుకుంటున్న. – ఈత్లాల్, నేపాల్ దేశ వలస కూలీ
మా దగ్గర నీళ్లు ఉండయి..
మాకు భూములున్నయి. కానీ నీళ్లు లేవు. ఏం చేస్తం. ఏదో పని చేసి బతికినం. కానీ తెలంగాణల ఎవుసం పనులు బాగున్నయని అంటే మూడేండ్ల నుంచి ఇక్కడికి వస్తున్నం. వరి నాట్లు గుత్తకు పట్టి వేస్తున్నం. మంచి కూలీ గిట్టు బాటు అయితంది. రెన్నెళ్లపాటు పని దొరుకుతది. ఇక్కడ సీఎం కేసీఆర్ సార్ దయ వల్ల నీళ్లు బాగా ఉన్నాయి. కాలువల్లో నీళ్లు ఎక్కువగా పారుతున్నయి. మా దగ్గర ఇట్ల ఉంటే బాగుండు. కానీ ఎవరూ పట్టించుకోరు.-అంకుష్ పటేవార్, కూలీ, గచ్చిరోలి, మహారాష్ట్ర
తెలంగాణల కేసీఆర్ మంచిగ జేస్తండు..
మా రాష్ట్రంల గిసొంటి సర్కార్ ఉంటే మంచిగ ఉండేది. మాకు ఉపాధి లేదు. భూములు ఉన్నా నీళ్లు ఉండయి. ఇక పంటలు ఎట్ల పండుతయి. మా సర్కారు పట్టించుకోదు. మా రాష్ట్రంలో ఇలాంటి పనులు లేనేలేవు. అందుకే బతుకుదెరువులేక ఉపాధి కోసం ఉన్న ఊరిని వదిలి రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి బతుకుతున్నం. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నం. మంచిగ గిట్టుబాటు అయితది. నాలుగు డబ్బులు మిగులుతున్నై.-జగన్నాథ్ బిందా, సునాసిక్వా, నవపడా, ఒడిస్సా
రోజుకు రూ900 దొరుకుతయి..
మా దగ్గర పని లేదు. వ్యవసాయ కూలీగా పనొక్కటే దొరికేది. రెకలు ముకలు చేసుకున్నా రోజుకు రూ.400 కూడా దొరకయి. నా కొడుకులు చదువుకుంటున్నరు. ఖర్చులు పెరిగిపోయాయి. ఇల్లు గడవడమే కష్టమైతంది. తెలంగాణల ఎవుసం బాగుందని, నాట్లు వేసేందుకు కూలీలు దొరకడం లేదని తెలిసింది. ఏజెంట్ల ద్వారా బతుకుదెరువు కోసం వలస వచ్చి నాట్లు వేస్తున్నాం. రోజుకు 17 మందిమి 5 ఎకరాలకు పైగా నారును పంచుకొని నాట్లను వెయ్యగలరు రోజుకు తొమ్మిది వందల వరకు కుళ్ళు పడుతున్నాయి.
ఇకడ మాకు ఆదాయం మంచిగా ఉంది.