దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలి
చేపల ఉత్పత్తి, పెంపకంలో రాణించాలి
సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ పబ్లిక్ సిస్టం అడ్వయిజర్ దాసరి బాలకిషన్
జమ్మికుంట, డిసెంబర్ 7: యువకులంతా దళిత బంధును సద్వినియోగం చేసుకొని, ఫిషరీస్ యూనిట్లను నెలకొల్పి చేపల పెంపకంలో రాణించాలని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ పబ్లిక్ సిస్టం అడ్వయిజర్ దాసరి బాలకిషన్ పిలుపునిచ్చారు. సీఐపీఎస్, పీఎంఎంఎస్వై సహకారంతో జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో మత్స్య శాస్త్రవేత్త ప్రభాకర్ ఆధ్వర్యంలో దళిత యువతకు చేపల ఉత్పత్తి, మార్కెటింగ్, వ్యవస్థాపకతలో నైపుణ్యాభివృద్ధిపై 15 రోజుల పాటు శిక్షణ ఇవ్వగా, మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలకిషన్ హాజరై మాట్లాడారు. శాస్త్రవేత్తల సహకారంతో శిక్షణ పొందిన దళితులంతా ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
శిక్షణకు వచ్చిన దళిత యువకులంతా దళిత బంధుకు అర్హత సాధించారని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ పబ్లిక్ సిస్టం అడ్వయిజర్ దాసరి బాలకిషన్ పిలుపునిచ్చారు. దళిత బంధు నిధులతో ఫిషరీస్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని, చేపల ఉత్పత్తి, పెంపకంలో రాణించి ఆర్థిక ప్రగతి సాధించాలని సూచించారు. శాస్త్రవేత్తల సహకారంతో శిక్షణ పొందిన దళితులంతా ఆర్థికాభివృద్ధిని సాధించాలని పేర్కొన్నారు. సీఐపీఎస్, పీఎంఎంఎస్వై సహకారంతో జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో మత్స్య శాస్త్రవేత్త ప్రభాకర్ ఆధ్వర్యంలో దళిత యువతకు చేపల ఉత్పత్తి, మార్కెటింగ్, వ్యవస్థాపకతలో నైపుణ్యాభివృద్ధిపై 15 రోజుల పాటు శిక్షణ ఇవ్వగా, మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల కోసం అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని, రుణాలు అందజేస్తున్నాయని తెలిపారు. అవకాశాలను దళితులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చేపల ఉత్పత్తి, పెంపకంలో శిక్షణ పొందిన యువత యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఫిషరీస్ కోర్సు నాలుగేళ్లు ఉంటుందని, కానీ, ఇక్కడి యువత కేవలం 15 రోజుల్లోనే కోర్సు పూర్తి చేసుకోవడాన్ని అభినందించారు. శిక్షణ పొందిన ప్రతి దళిత యువకుడు యూనిట్ ప్రపోజల్స్ను అందించడాన్ని మెచ్చుకున్నారు. శిక్షణ తీసుకున్న యువకులంతా శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో ముందుకు సాగాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. శిక్షణ ద్వారా ఉపాధి పొందుతూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వరికి బదులుగా భూముల్లో చేపల పెంపకం చేపట్టాలని, శిక్షణతో వచ్చిన పరిజ్ఞానంతో శ్రద్ధతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. తర్వాత శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఇక్కడ శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్రావు(హెడ్ అండ్ సీనియర్), వేణుగోపాల్, ప్రశాంతి, శ్రీనివాస్రెడ్డి, విజయ్, శిక్షణ పొందిన యువకులు, తదితరులున్నారు.
కేవీకే అందుబాటులో ఉండడం మా అదృష్టం
కేవీకేలో ఎప్పుడూ మంచి కార్యక్రమాలు, శిక్షణలు జరుగుతున్నయ్. మాకు మంచి అవకాశం వచ్చింది. చేపల పెంపకం మీద శిక్షణ ఇచ్చిన్రు. ఈ 15 రోజుల్లో ఎన్నో నేర్చుకున్నం. జీరో నాలెడ్జ్తో ఇక్కడికి వచ్చినం. ఇప్పుడెంతో జ్ఞానం పెంచుకున్నం. కేవీకే అందుబాటులో ఉండడం మా అదృష్టం. మార్కెట్ల ఫిష్కు డిమాండ్ ఎక్కువున్నది. అయితే వినియోగదారులకు సరిపడా మార్కెట్లు లేవు. మార్కెట్ ఏర్పాటు చేసుకుంటా. అంతేకాకుండా రెడీ ఫర్ ఫిష్ యూనిట్ను పెడ్తా.
ఔట్లెట్ పెట్టి ఆర్థికాభివృద్ధి సాధిస్తం
ఎమ్మెస్సీ చదివినా. శిక్షణ కోసం ఇక్కడికచ్చిన. మాకు ఇచ్చిన శిక్షణ బాగుంది. మార్పు ఇక్కడి నుంచే మొదలు పెడ్త. వారసత్వంగా నాకింత భూమిన్నది. శిక్షణ తర్వాత ఐడియా వచ్చింది. చేపల పెంపకంతో స్థిరపడ్తా. మా ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్ లాంటి నగరాల్లో ఔట్లెట్ పెడ్తం. ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసుకుంటం. అవసరమైతే రిటేల్ సెంటర్ పెట్టుకుంటం. ఏది అవసరమనుకుంటే అది పెడ్తం. వ్యాపారం ప్రారంభిస్తం. ఆర్థికాభివృద్ధి సాధిస్తం.