ఆనవాయితీ వెనుక దాగున్న హెల్త్ రహస్యం
తరచుగా తీసుకుంటే రోగనిరోధకశక్తి పెంపు
వ్యాధుల నియంత్రణకు దోహదం
కరోనా వేళ ఎంతో ఉపయోగకరం
గుండె జబ్బు, అస్తమా వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు
గర్భిణులకూ ఉపయోగకరమంటున్న శాస్త్రవేత్తలు
ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా మత్స్యసిరులు
కరీంనగర్, జూన్7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎండలతో చెమటలు పోయించిన రోహిణి కార్తె ముగిసి, ముంగిళ్లు చల్లబరిచే ‘మృగశిర’ నేటితో మొదలుకాబోతున్నది! మృగశిర అనగానే చేపల కూర గుర్తుకొస్తుంది! ఈ కార్తె ప్రవేశం రోజు చేపలు తినడం ఆచారం అనాదిగా వస్తున్నది. అప్పుడే అందరి నోరూరుతున్నది. ఈ రోజు ఓ చేప ముక్కైనా తినాలని జిహ్వ తహతహలాడుతున్నది. లేకుంటే వెలితిగా అనిపిస్తుంది. నిజానికి దీని వెనుక ఆరోగ్య రహస్యమూ దాగి ఉన్నది. సీజన్ మారుతున్న ప్రస్తుత సమయంలో చేపలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాదు, వ్యాధుల బారిన పడే ముప్పు తగ్గుతుంది. కరోనా వేళ ‘డీ విటమిన్’ ఎంతో అవసరంగా కాగా, ఇది జిమ్మల్లో పుష్కలంగా ఉంటుంది.
మృగశిర కార్తె మంగళవారం నుంచి ప్రారంభం కాబోతున్నది. మొదటి రోజు చేపల కూర తినాలనే ఆచారం అనాదిగా వస్తున్నది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగున్నది. అందుకే ఎప్పుడూ తినని వారు సైతం ఆరోగ్యం కోసం ఒకటో, రెండో ముక్కలు తినడం కనిపిస్తుంది. కార్తె ప్రవేశం రోజు చేపలకు ఫుల్ గిరాకీ ఉం టుంది. గిరాకీతోపాటు రేటు కూడా కాస్త ఎక్కువగా ఉంటుం ది. ఒకప్పుడు బయటి ప్రాంతాల నుంచి తెచ్చి అమ్మే మత్స్యకారులు ఈ సారి రాష్ట్ర సర్కారు చేపట్టిన ‘నీలి విప్లవం’తో చెరువుల్లో చేపల పంట పండడంతో డిమాండ్కు తగ్గ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. కార్తె రోజు సాధారణ రో జుల కంటే ధరలకు అమ్ముతారు. బొమ్మె అయితే 600 నుం చి 800 దాకా, రవ్వు, బొచ్చె, బంగారుతీగ రకాలు 150 నుంచి 200లకుపైగా, చిన్న జెల్లలు 500లకుపైనే విక్రయిస్తున్నారు.
వ్యాధుల నియంత్రణకు చేపలు..
మృగశిర కార్తెలో చేపలను ఎందుకు తింటారో తెలుసా..? రోకండ్లను సైతం పగుల గొట్టే ఎండలు వెళ్లిపోయాయి. వానలతో పాటు చల్లని, చక్కని వాతావరణాన్ని మృగశిర కార్తె మోసుకొస్తుంది. 15 రోజుల పాటు ఈ కార్తె ఉంటుంది. మృగశిర ప్రారంభంలో చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి పాటిస్తున్నాం. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడడంతో మన శరీరంలోనూ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు. తద్వారా గుండె జబ్బు లు, అస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇదేగాక ఈ సీజన్లో చాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. జ్వరం, దగ్గు బారిన పడతారు. అలా కాకుండా ఉండాలంటే.. చేపలను తినాల్సిందే. ఈ కార్తెలో పూర్వీకులు శాఖాహారులైతే ఇంగువను బెల్లంలో కలుపుకుని గోలిలాగా తయారు చేసుకొని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువ, చింత చిగురుతో కలుపుకుని తినేవారు.
కరోనా వేళ నిరోధక శక్తి..
ప్రస్తుతం కరోనా ప్రతి ఒక్కరినీ భయపెడుతున్నది. దీనిని అడ్డుకోవాలంటే రోగనిరోధకశక్తి అవసరం. ఇది చేపల్లో బాగా లభిస్తుంది. రెగ్యులర్గా చేపలు తినడం వల్ల విటమిన్ డీతోపాటు ఒమేగా 3 ఆమ్లాలు ఎక్కవగా లభిస్తాయి. ఇవి అనేక వ్యాధులను నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతాయి. ఒమేగా-3 ఆమ్లాలు కంటిచూపును, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండె సంరక్షణకు తోడ్పడుతాయి. ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును, అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ప్రస్తుతం కొవిడ్ వేళ హార్ట్ స్ట్రోక్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చేపలను తరచుగా తీసుకోవడం వల్ల గుండె సంబంధింత వ్యాధుల ముప్పును తగ్గించుకునే అవకాశముంటుంది. స్థానికంగా దొరికే నాణ్యమైన పెద్ద చేపలను ఇంగువ, చింత చిగురుతో కలిపి వండుకుని తినడం చాలా మంచిదని పలువురు మేధావులు చెబుతున్నారు.
మృగశిర కార్తె అంటే..
ఆశ్విని మొదలుకుని రేవతి వరకు మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం ఒక్కో కార్తెలో ఒక్కోవిధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి నైరుతి రుతుపవనాలు వస్తాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడడం.. ప్రకృతిలో పలు మార్పులు జరిగే నేపథ్యంలో అనేక రకాల చెడు సూక్ష్మక్రిములు, క్రిమి కీటకాలు పునరుత్పత్తి అవుతాయి. మానవుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం, దగ్గు వచ్చి, శ్వాస సంబంధ వ్యాధులు వస్తుంటాయి.
పుష్కలమైన పోషకాలు
చేపలలో అనేక మాంసకృత్తులతోపాటు శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి.
కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
మానవునికి కావాల్సిన అతి ముఖ్యమైన, రుచిని పెంచే లైసిన్, మిథియోనిన్, ఐసొల్యూసిన్ వంటి అమైనో ఆమ్లా లు పుష్కలంగా లభిస్తాయి.
చేప కొవ్వులు చాలా సులభంగా జీర్ణమై శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల దాకా ఎవరైనా తినచ్చు.
చేపల్లో ఉన్న కొవ్వులు (కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరైడ్స్) మన శరీర రక్త పీడనంపై (అంతిమంగా గుండెపై) మంచి ప్రభావం చూపుతాయి.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్ఏ, ఈపీఏ వంటివి కంటి చూపునకు పనిచేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. థయామిన్, రైబోప్లవిన్, నియాసిన్, పెరిడాక్సిన్, బయోటిన్, పెంటోదినిక్ ఆమ్లం, బీ 12 వంటి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.
సముద్ర చేపల కాలేయంలో (కాడ్ చేప) విటమిన్ ఏ, డీ, ఈ వంటి కొవ్వులో కరిగే విటమిన్స్ ఎక్కువగా లభిస్తుంది.
చేపలలో పాలీ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నందున వైద్యులు గుండె సంబంధిత, అస్తమా, మధుమేహ వ్యాధిగ్రస్తులకు సిఫారసు చేస్తున్నారు.
మన ప్రాంతంలో లభించే పరక, చందమామ కొడిప, ఇసుక దొందులు, పాపర్లను చింత చిగురుతో కలిపి వండి తింటే ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా గర్భిణులు, చంటి పిల్లల తల్లులు తీసుకుంటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. పిల్లలకు సరిపడినంత పాల వృద్ధితోపాటు వ్యాధి నిరోధక శక్తి, నాడీ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది.
మన రాష్ట్ర చేప అయిన కొర్రమీను(నల్ల చేప)లో లభించే ఆరాఖిడోనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం తొందరగా గడ్డకట్టించే స్వభావం కలిగి ఉంటుంది.
దేశీయ మార్పు చేపల్లోని ఐరన్, కాపర్ వంటి ఖనిజ పోషకాలు హిమోగ్లోబిన్ సంశ్లేషణలో, రక్తం ఉత్పత్తిలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
మృగశిర కార్తెలో ఏ చేపలను ఏ రూపంలో తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
చేపల్లో విటమిన్ డీ ఎక్కవగా లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ (కీళ్ల వాతం)తో బాధపడుతున్న వారికి ఉపశమనం ఉంటుంది. కీళ్ల నొప్పులు, వాపుల తగ్గుదలకు సహాయపడుతుంది.
చేపలు తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది. ముఖ్యంగా వృద్ధుల్లో వచ్చే అల్జీమర్స్ వ్యాధిని తగ్గించడంలోనూ ఈ ఆహారం సహాయపడుతుంది.