కరీంనగర్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : 2022 జనవరి 1 వరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను అందరినీ ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు చేసేందుకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఆర్డీవో ఆనంద్ కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో అంగన్వాడీ టీచర్లు, రిసోర్స్ పర్సన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 6, 7, 27, 28 (శని, ఆదివారాల్లో) తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల ప్రత్యేక నమోదు కార్యక్రమం బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో)ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, రిసోర్స్ పర్సన్లు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారందరినీ ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుంచి ఫారం-7 ద్వారా లేదా సుమోటోగా తీసుకొని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని సూచించారు. అలాగే డబుల్ ఓటర్లను గుర్తించి తొలగించాలని, శాశ్వతంగా వలస వెళ్లిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని సూచించారు. ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండి వేరే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరుగా నమోదై ఉంటే ఫారం -8 ద్వారా సరిచేయాలని సూచించారు. బీఎల్వోలకు ఓటర్ల నమోదుకు సంబంధించి ఫారం-6, ఫారం-7, ఫారం-8, ఫారం-8ఏ తదితర రకాల ఫారాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కరీంనగర్ ఆర్డీవో కార్యాలయంలో హెల్ప్డెస్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 6, 7 తేదీల్లో ఓటర్ నమోదు, మార్పులు చేర్పులపై ఏమైనా సందేహాలుంటే హెల్ప్ డెస్లో సంప్రదించాలని సూచించారు. క్లెయిమ్స్ సమర్పించుటకు ఈ నెల 30 గడువని తెలిపారు. ఈ నెల 6, 7 తేదీల్లో పోలింగ్ కేంద్రాలను రోల్ అబ్జర్వర్, కలెక్టర్ తదితర ఎన్నికల అధికారులు సందర్శించడంతో పాటు జాబితాలను పరిశీలిస్తారని, అంగన్వాడీ టీచర్లు, రిసోర్స్ పర్సన్లు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాల్లో ఉండాలని తెలిపారు. సమావేశంలో కరీంనగర్ కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ సుధాకర్, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, కమలాకర్ పాల్గొన్నారు.