దశాదిశ మార్చనున్న చరిత్రాత్మక పథకం
వాసాలమర్రిలో ప్రారంభం
ఈ నెల 16న పైలెట్ ప్రాజెక్టు హుజూరాబాద్లో లాంఛనంగా శ్రీకారం
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అంకురార్పణకు ఏర్పాట్లు
సమీక్షలు, సమావేశాలతో అధికారులు బిజీబిజీ
సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా పర్యవేక్షణ
ఆనందంలో దళితబిడ్డలు
ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
కరీంనగర్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ దళిత బంధు’ ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపబోతున్నది. ఈ చరిత్రాత్మక పథకం అమలుకు గురువారం తొలి అడుగు పడింది. యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో ప్రారంభం కాగా, ఈ నెల 16న హుజూరాబాద్ గడ్డపై లాంఛనంగా అంకురార్పణ కానున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండగా, దళితలోకం వేయికండ్లతో ఎదురుచూస్తున్నది. గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు చేసుకున్నది. ఆర్థికంగా, సామాజికంగా తమ బతుకులను మారుస్తున్న దళితబాంధవుడు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞత చాటింది.
దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ‘తెలంగాణ దళిత బంధు’ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. 10 లక్షల ఆర్థికసాయాన్ని అందించి వారు ఆర్థికంగా, సామాజికంగాఎదుగాలనేది ఈ పథకం ముఖ్య ఉదేశ్యం కాగా, తనకు అత్యంత ఇష్టమైన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. గత నెల 19న హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఆ తర్వాత ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు గత నెల 26న ప్రగతిభవన్లో సదస్సు ఏర్పాటు చేశారు. నియోజకవర్గం నుంచి 427 మంది ప్రతినిధులను ఆహ్వానించి దిశానిర్దేశం చేసి, భరోసానిచ్చారు. పథకం అమలుకు జరుగుతున్న ఏర్పాట్లను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తాజాగా యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో ఈ పథకాన్ని ప్రారంభించగా, పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్ గడ్డపై ఈ నెల 16న లాంఛనంగా అంకురార్పణ చేయనున్నారు. రైతు బంధు పథకం ఆవిష్కరించిన శాలపల్లి-ఇందిరానగర్ వేదిక నుంచే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
రైతు బంధును ఆవిష్కరించిన చోటే..
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆది నుంచీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అంటే ఎంతో మక్కువ. 2001లో సింహగర్జన ఇక్కడే చేపట్టి ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చడంలో ఈ జిల్లా కీలకమైందని ఆయన విశ్వసిస్తారు. ఆ తర్వాత ఇక్కడ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కరీంనగర్ జిల్లా ప్రజలు ముందుంటారని నమ్ముతారు. అందుకే పథకానైన్నా ఇక్కడ నుంచే అంకురార్పణ చేసేందుకు మొగ్గుచూపుతారు. దేశ వ్యాప్తంగా ఎంతో ఖ్యాతిని పొందిన రైతుబంధును ఇందిరానగర్ – శాలపల్లి నుంచే శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇదే వేదిక నుంచి ఈ నెల 16న ‘దళితబంధు’ను లాంఛనంగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్తోపాటు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కూడా ఈ స్థలాన్ని ఇది వరకే పరిశీలించి ఎంపిక చేశారు.
అమలుకు కసరత్తు..
హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 20,929 దళిత కుటుంబాలు ఉన్నాయి. అందులో హుజూరాబాద్లో 5,323, జమ్మికుంటలో 4,996, వీణవంకలో 3,678, ఇల్లందకుంటలో 2,586తోపాటు వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని కమలాపూర్లో 4,346 కుటుంబాలు ఉన్నాయి. దళిత బంధు అర్హులందరికీ అందేలా పకడ్బందీగా కసరత్తు చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో సుమారు 100 గ్రామాలుండగా, ప్రతి గ్రామానికీ ఒక ఐఏఎస్ అధికారిని నియమించబోతున్నారు. సదరు అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో వారం రోజుల పాటు ఉండి దళితుల స్థితిగతులపై పూర్తి స్థాయిలో సర్వే చేపడుతారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం 10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. కానీ, ఈ ఆర్థికసాయాన్ని దేని కోసం వినియోగించుకుంటున్నారు?, నెల నెలా ఆదాయం వచ్చే విధంగా ఎలాంటి ఉపాధిని ఎంచుకున్నారనే విషయాన్ని మాత్రం అధికారులు నిత్యం పర్యవేక్షిస్తారు. లబ్ధిదారులుగా ఎంపికైనప్పుడే వారికి ఒక కార్డును ఇస్తారు. దానిలో ఒక చిప్ ఉంటుంది. లబ్ధిదారులు ఎప్పుడు ఎంత డబ్బు బ్యాంకు నుంచి విడిపిస్తున్నారు? దేని కోసం ఖర్చు చేస్తున్నారనే విషయాన్ని సునాయసంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.
ఉన్నతాధికారుల సమీక్షలు..
‘దళిత బంధు’ను హుజూరాబాద్ నియోజకవర్గం లో ఏ విధంగా అమలు చేయాలనే విషయాలపై జిల్లాతోపాటు రాష్ట్ర స్థాయి అధికారులు నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా రెండు మూడు రోజులుగా జిల్లాలోనే మకాం వేసి అధికారులతో సమీక్షిస్తున్నారు. దళితులు ఎలాంటి యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే ఉపాధి లభిస్తుందనే విషయాలపై కసరత్తు చేస్తున్నారు. ఇందుకు పారిశ్రామిక వేత్తలు, ఇతర పేరున్న సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి సమీక్షలు నిర్వహిస్తున్నారు. మండలాల్లో దళితబంధు రిసోర్స్ పర్సన్లను ఏర్పాటు చేసి గ్రామాల్లో తిప్పుతున్నారు. దళితులు ఎలాంటి యూనిట్లపై ఆసక్తి చూపుతున్నారో ప్రతి రోజూ నమోదు చేస్తున్నారు. దళితులు చెప్పిన యూనిట్ల గురించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. అంతే కాకుండా కొన్ని స్వయం ఉపాధి సం స్థల ప్రతినిధులు ఇస్తున్న సలహాలు, సూచనలను రిసో ర్స్ పర్సన్ల ద్వారా గ్రామాల్లోని దళితులతో చర్చకు పెడుతున్నారు. ఇలా పలు రకాలుగా అధ్యయనం చేస్తున్న అధికారులు స్వయం ఉపాధి యూనిట్లపై సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రోజూ అధికారుల ద్వా రా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.
దేశానికే స్ఫూర్తి.. దళితబంధు
దేశంలో ఏ రాజకీయ పార్టీకి గానీ, రాజకీయ నాయకుడికి గానీ రాని ఒక గొప్ప అద్భుతమైన ఆలోచన దళిత బంధు. ఈ పథకం ద్వారా దళితులు ఆర్థికంగా స్థిర పడగలిగితే దేశాభివృద్ధికి కిందకే వస్తుంది. అంబేద్కర్ కన్న కలలు నెరవేర్చడానికే సీఎం కేసీఆర్ ఈ పథకం ద్వారా దళితుల ఆర్థిక స్థితిగతులను మార్చే బృహత్తర పథకానికి రూపకల్పన చేశారు. దేశ చరిత్రలోనే గొప్ప నాయకునిగా మిగిలిపోతారు. దేశంలోని అన్ని రాష్ర్టాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తాయి. దేశానికే స్ఫూర్తిగా నిలువనుంది.
మా బతుకులు మారుతయి..
నేను పెయింట్ పని చేసుకుని బతుకుత. మా ఊళ్లె శానా మంది ఇదే పని చేస్తరు. సీఎం కేసీఆర్ ప్రకటించిన దళితబంధు అమల్లోకి రావడం నిజంగా సంతోషంగా ఉన్నది. ఈ పథకంతో మాలాంటోళ్ల బతుకులు మారుతయి. ఎంతో మంది జీవితాలు బాగుపడుతయి. నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యమంత్రికి మా నియోజకవర్గం అంటే చాలా ప్రేమ ఉన్నది. అందుకే పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన్రు. ఇది మేం మరిచిపోం.