విద్యానగర్/ జమ్మికుంట/ మానకొండూర్ ఆగస్టు 5: జిల్లాలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ డీ శ్రీనివాసరావు వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు జమ్మికుంట ఏరియా దవాఖాన, మానకొండూర్ పీహెచ్సీని సందర్శించారు. వైద్యసిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయాచోట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ను పక్కాగా చేపట్టాలని వైద్యసిబ్బందికి సూచించారు. ప్రైమరీ కాంటాక్ట్ కింద 20 నుంచి 25 మందికి పరీక్షలు చేయాలన్నారు. పాజిటివ్ బాధితులకు తగిన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ డివిజన్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాక్సినేషన్పై దృష్టిపెట్టాలని, రెండోడోసుకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 18 ఏండ్లు ప్రతిఒక్కరికీ టీకా వేసేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ప్రతిరోజు 8 నుంచి 9 వేల కరోనా టెస్ట్లు చేయాలని, ఇంటింటా జ్వర సర్వేను కొనసాగించాలని చెప్పారు. వానకాలంలో డెంగ్యూ, మలేరియా లాంటి విషజ్వరాలు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డాక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర వైద్యవిద్యాశాఖ డైరెక్టర్ కే రమేశ్రెడ్డి మాట్లాడుతూ పీహెచ్సీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి కొవిడ్ పాజిటివ్ కేసులను గుర్తించాలని ఆదేశించారు. సీఎం కార్యాలయ ఓఎస్డీ టీ గంగాధర్ మాట్లాడుతూ, ప్రతిఒకరూ మాసులు ధరించి, భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, ప్రోగ్రాం ఆఫీసర్లు, మానకొండూర్ పీహెచ్సీ వైద్యాధికారులు సంధ్యారాణి, బియాబాని, సీహెచ్వో రాజునాయక్, సూపర్వైజర్ రాజు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.