విచ్చలవిడి రసాయనిక ఎరువులతో విషతుల్యం
భూమితోపాటు మానవాళి మనుగడకు ప్రమాదం
నేడు ప్రపంచ నేలల దినోత్సవం
కరీంనగర్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : మానవాళికి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్లో నేల ఒకటి. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న రైతుకు.. ఆ నేలకు విడదీయలేని అనుబంధమున్నది. కానీ, ఇబ్బడిముబ్బడిగా వాడుతున్న రసాయనిక ఎరువులతో ఆ భూమి సహజత్వాన్ని కోల్పోతున్నది. పంట ఉత్పత్తులు విషతుల్యమవుతుండగా, నేల ఆరోగ్యమే కాదు, మానవ ఆరోగ్యమూ దెబ్బతింటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో నేలతల్లిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భూమి గుణం, దాని సారం తెలుసుకొని సాగు చేస్తేనే ప్రతిఫలం వస్తుంది. నాణ్యమైన దిగుబడులు రావడంతోపాటు లాభాల బాట పట్టే అవకాశముంటుంది.
మంచి పంట పండించాలంటే అనువైన, సారవంతమైన భూమి అవసరం. కానీ, ఆ నేల మోతాదుకు మించి రసాయన ఎరువుల వాడకం, పంట మార్పిడి చేయకపోవడంతో తన సహజగుణం కోల్పోతున్నది. పంట విషతుల్యమవుతున్నది. మానవాళి ఆరోగ్యంపైనా ప్రభావం పడుతున్నది. జీవవైవిధ్యం కూడా దెబ్బతింటున్నది. అధిక దిగుబడులు సాధించాలనే ఆశే ఇందుకు ఓ కారణమవుతున్నది. ఈ విషయం అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. భూసారం పూర్తిగా దెబ్బతిన్న తర్వాత ఎరువుల మోతాదును ఎంతగా పెంచినా ఫలితం లేకుండా పోతున్నదని తేలింది. రైతులకు భూమి భౌతిక, రసాయన లక్షణాలపై సరైన అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిస్సారమై పోతున్న భూములను మరింత చెడిపోకుండా కాపాడుకోవాలంటే రైతులకు నేలల ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించాల్సిన అవసరమున్నది. ఈ నేపథ్యంలో 2015 డిసెంబర్ 5 నుంచి ప్రపంచవ్యాప్తంగా నేలల దినోత్సవాన్ని నిర్వహిస్తుండగా, మన రాష్ట్ర సర్కారు నేలల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భూసార పరీక్షలపై విస్తృత ప్రచారం చేస్తున్నది. ప్రతి మూడేళ్ల కోసారి భూ సార పరీక్షలు చేయించాలని రైతులకు సూచిస్తున్నది. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నది.
పరీక్షలతోనే భూ పరిరక్షణ..
భూమి గుణం, దాని సారం తెలుసుకొని సాగు చేసినప్పుడే ప్రతిఫలం వస్తుంది. భూసార పరీక్షలు చేయిస్తేనే ఆ నేల స్వభావం తెలిసి పోతుంది. పంటల సాగుకు ఏవైనా పోషక లోపాలు ఉంటే వాటిని సవరించుకునే అవకాశం ఏర్పడుతుంది. భూసార పరీక్షల ద్వారా ముఖ్య పోషక పదార్ధాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ పరిమాణం తెలుస్తుంది. భూమిలోని ఇతర లోపాలైన ఆమ్లస్థితి, క్షారత్వం, లవణ పరిమాణాలను, సూక్ష్మ పోషకాల పదార్థాల లోపాలను ఈ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. పోషక పదార్థాలు ఎక్కువ, తక్కువ అయితే పంట దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదమున్నది. ఈ నేపథ్యంలో మూడేళ్లకోసారి భూసార పరీక్షలు చేయించి, వాటి ఫలితాల ఆధారంగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆశించిన దిగుబడులు సాధించవచ్చు. అలాగే భూమికి అనుగుణంగా ఏ ఎరువులు ఎంత పరిమాణంలో వేయాలో తెలుసుకోవచ్చు. తద్వార అనవసర ఖర్చులు తగ్గించుకోవచ్చు.
ఇలా సంరక్షించుకుందాం..
నేల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రస్తుతం విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరమున్నది. సిఫారసు చేసిన మోతాదులో రసాయనిక ఎరువులను వాడాలి. వీలైనంత వరకు భూసార పరీక్షలు చేయించుకొని, నేలలోని లోపాలకు అనుగుణంగా ఎరువులు, ఇతర యాజమాన్య పద్ధతులు పాటించాలి. అధిక దిగుబడులకు రసాయనిక ఎరువులు ఎంత ముఖ్యమో నేల ఆరోగ్యానికి సేంద్రియ ఎరువుల వాడకం అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. జీవన ఎరువులను వాడి నేలను సారవంతం చేయాలి. సంప్రదాయ పద్ధతుల ద్వారా దున్ని పంటలు పండించడం వల్ల నేలలో ఉండే సేంద్రియ కర్భన పదార్థం క్షీణిస్తోంది. జీరో టిల్లేజ్, మాదిరి టిల్లేజ్ పద్ధతులు పాటించడం ద్వారా నేలలోని సేంద్రియ కర్బన పదార్థాలను పెంచుకోవచ్చు. సూక్ష్మ జీవులకు అనువైన వాతావరణాన్ని కల్పించుకోవచ్చు. ఎర్ర నేలలు, ఇసుక నేలల్లో సేంద్రియ కర్బనం చాలా తక్కువ ఉంటుంది. దీనివల్ల నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండి, కోతకు కూడా ఎక్కువగా గురవుతాయి. ఇటువంటి నేలల్లో పంట వ్యర్థాలను, ఇతర సేంద్రియ ఎరువులను వాడుకోవడం మంచిది. సమస్యాత్మక నేలలు అంటే ఆమ్లత్వపు నేల ఉదజని సూచిక ఆధారంగా సున్నం అందించడం, క్షారత్వపు నేలల ఉదజని సూచికల ఆధారంగా జిప్సం అందించడం ద్వారా నేలల యాజమాన్యం చేసుకోవడం మంచిది.
మన జీవనాధారం నేల..
ఒక సెంటీ మీటర్ నేల ఏర్పడటానికి దాదాపు వెయ్యేండ్లు పడుతుంది. ప్రతి జీవరాశి పుట్టుక నుంచి మరణించే వరకు నేలలు వాటి జీవనంపై ప్రభావం చూపుతాయి. ప్రపంచానికి అవసరమైన 95 శాతం ఆహార ఉత్పత్తులు నేలపైనే ఆధారపడి ఉంటాయి. ఆహారం, ఇంధనం, దుస్తులు ఉత్పత్తి చేయడానికి నివాసాలు నిర్మించుకోవడానికి నేలనే ఆధారం. నేల ఆరోగ్యం నేల భౌతిక, రసాయన, జీవ సంబంధిత లక్షణాల మీద ఆధారపడి ఉన్నది. మొక్కల పెరుగుదలకు, మానవుడి ఆహారం కోసం, పరిశుభ్రమైన తాగునీటి కోసం ఆరోగ్యమైన నేల ఎంతో అవసరం. ప్రతి రోజు మనం తీసుకునే ఆహారం, పోషక విలువలు నేరుగా నేల ఆరోగ్యంపైన ఆధారపడి ఉంటాయి. నేలలోని వివిధ పరిమాణంలోని సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, పోషకాలు మొక్కల పెరుగుదలకు తోడ్పడుతున్నాయి. సాధారణంగా నేల నమూనాలలో 45 శాతం ఖనిజాలు, 25 శాతం నీరు, గాలి, 5 శాతం సేంద్రియ పదార్థాలు ఉంటాయి. ఆరోగ్య వంతమైన నేలల్లో కార్బన్ ఎక్కువ శాతం ఉంటుంది. ఇది నేలల నిర్మాణం, నీటిని నిల్వ చేయడంలో పోషకాలను స్థిరీకరించడంలో ప్రాధాన పాత్ర పోషిస్తుంది. నేలలో సేంద్రియ కర్బన పదార్థం ఎక్కువగా ఉండడంతో స్థూల, సూక్ష్మ రంధ్రాలు సమాన నిష్పత్తిలో ఉండి వర్షపు నీరు ఇంకిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
భూమి ఆరోగ్య స్థితి కార్డు..
మట్టి నమూనాలను పరీక్షించిన తర్వాత భూమి ఆరోగ్య స్థితి (సాయిల్ హెల్త్) కార్డును వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అందిస్తారు. వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ కార్డు ద్వారా పంట భూములు నిస్సారమై చెడిపోకుండా పశువుల పెంట, కంపోస్టు, పచ్చిరొట్ట లాంటి సేంద్రియ, రసాయనిక ఎరువులు సమగ్రంగా, సమతుల్యంగా ఏ విధంగా వాడాలో తెలియజేస్తారు. ఈ పరీక్షా ఫలితాల ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపడితే స్థిరమైన, నాణ్యమైన, అధిక దిగుబడులు పొందే అవకాశముంటుంది.