తిమ్మాపూర్, ఆగస్టు 4: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ బుధవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమైంది. బుధవారం ఇంజినీరింగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినట్లు ఎంసెట్ రీజినల్ కోఆర్డినేటర్ టీ శ్రీలక్ష్మి తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించామన్నారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆయాన్ డిజిటల్, వాగేశ్వరీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, శ్రీ చైతన్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలాజికల్ సైన్సెస్, శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలాజికల్ అండ్ ఇంజినీరింగ్, కరీంనగర్లోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలాజికల్ అండ్ సెన్స్, హుజూరాబాద్లోని కమలా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలాజికల్ అండ్ సెన్స్, పెద్దపల్లి జిల్లాలోని మంథని జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బుధవారం 3001 మందికి ఏర్పాట్లు చేయగా 2,902 మంది హాజరు కాగా, 99 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. కాగా విద్యార్థులను పరీక్షకు గంట ముందే లోనికి అనుమతించారు. పరీక్షా కేంద్రం ఆవరణలో విద్యార్థులకు చేతులను శుభ్రం చేయించడంతోపాటు ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు.