సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా
హుజూరాబాద్ దళిత బంధు రిసోర్స్ పర్సన్లు, జిల్లా అధికారులతో సమావేశం
ట్రాక్టర్ డీలర్లు, విజయ, కరీంనగర్ డెయిరీ ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్ష
కరీంనగర్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకం కింద లబ్ధిపొందేవారు ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా సూచించారు. ఈనెల 16న హు జూరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ స్కీంను ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం కలెక్టరేట్లో హుజూరాబాద్ దళితబంధు రిసోర్స్పర్సన్లు, జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగున ఉన్న దళితుల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని చెప్పారు. పథకం ప్రారంభం రోజున సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఎంపిక చేసిన 20మంది లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను పంపిణీ చేస్తారని తెలిపారు. అర్హులందరికీ అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్లతో మాట్లాడి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ దళితులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యమన్నారు. లాభదాయం గల యూనిట్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. గొప్ప పథకానికి శ్రీకారం చుడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. కాగా ఒకే గ్రామంలో వివిధ రకాల యూనిట్లు మంజూరు చేయాలని దళితబంధు మండల రిసోర్స్ పర్సన్లు కోరారు. నైపుణ్యంలేని వారికి శిక్షణ ఇప్పించాలని సూచించారు.
కోరుకున్న యూనిట్లు మంజూరు చేయాలి ..
దళితబంధు ద్వారా దళితులకు మెరుగైన స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉత్తమ యూనిట్లను ప్రతిపాదించాలని రాహుల్ బొజ్జా అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో ట్రాక్టర్ డీలర్లు, విజయ, కరీంనగర్ డైయిరీ ప్రతినిధులు, జిల్లా అధికారులతో దళితబంధు పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేస్తారని తెలిపారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేలా వినూత్న స్వయం ఉపాధి యూనిట్లను ప్రతిపాదించాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులు కోరుకున్న యూనిట్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సీఈవో ప్రియాంక, డీఆర్డీవో శ్రీలత, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్కుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మధుసూధన్శర్మ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జువేరియా, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి నేతానియల్, పంచాయతీ రాజ్ ఎస్ఈ సుదర్శన్రావు, ట్రాక్టర్ డీలర్లు, విజయ, కరీంనగర్ పాల డెయిరీల డీలర్లు తదితరులు పాల్గొన్నారు.