నియోజకవర్గాన్నిఈటల రాజేందర్ పట్టించుకోలేదు
స్పష్టం చేసిన హుజూరాబాద్ యువకులు
మంత్రి గంగుల సమక్షంలో టీఆర్ఎస్లో చేరిక
కరీంనగర్ కార్పొరేషన్/ హుజూరాబాద్టౌన్, జూలై 2: అభివృద్ధిని చూసే టీఆర్ఎస్ పార్టీలో చేరామని హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన యువ నాయకులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈటల రాజేందర్ తమ నియోజకవర్గాన్ని పట్టించు కోలేదని, అభివృద్ధిని విస్మరిం చారని మండిపడ్డారు. ఈ మేరకు సీపీఐ, కాంగ్రెస్, బీజేపీకి చెందిన యువకులు, హమాలీ, మైనార్టీ నాయకులు శుక్రవారం కరీంనగర్లోని మంత్రి గంగుల క్యాంపు కార్యాలయంలో ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరామని హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆ నియోజకవర్గానికి చెందిన సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ నాయకులు, హమాలీ సంఘం, మైనార్టీ నాయకులు మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు చూసి పార్టీలోకి వచ్చామన్నారు. ఇన్నాళ్లూ కీలక పదవిలో ఉన్న ఈటల రాజేందర్ పూర్తిగా నియోజకవర్గంలో అభివృద్ధిని విస్మరించారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరుగుతుంటే హుజూరాబాద్ మాత్రం ఆయన నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్తో అభివృద్ధ్ది జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధ్ది, అన్ని వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్రావు, టీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, హుజూరాబాద్కు చెందిన సీపీఐ హమాలీ సంఘం, యాదవ సంఘం, రాంపూర్ బీజేపీ యూత్, యూత్ కాంగ్రెస్ నాయకులు, మైనార్టీలతోపాటు నాయకులు రాములు, ఆనంద్, సతీశ్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
ఆపద కాలంలో పేదలకు సీఎంఆర్ఎఫ్ చేయూతనందిస్తున్నదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో 110 మందికి రూ. 34 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధిలో పురోగమిస్తున్నదన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పట్టణ, పల్లె ప్రగతి కింద పారిశుధ్య పనులు చేపడుతున్నదని గుర్తు చేశారు. ప్రజారోగ్యం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు శ్యాంసుందర్రెడ్డి, సుంకిశాల సంపత్రావు, నవీన్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాదవులను ఆదుకున్నది టీఆర్ఎస్సే
యాదవులను గత ప్రభుత్వాలు, పార్టీలు ఏనాడూ పట్టించుకోలేదు. అందుకే మమ్ములను అన్ని విధాలా ఆదుకుంటున్న తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీలో మంత్రి గంగుల సమక్షంలో చేరిన. ఈటల లాంటి వాళ్లు ఎంతమంది పార్టీని వీడినా మా లాంటి వాళ్లం టీఆర్ఎస్ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటం. బీజేపీ తెలంగాణలో గెలవదని గతంలో స్వయంగా చెప్పిన ఈటల, ఇప్పుడు ఆయనే బీజేపీలో చేరడం మాకు నచ్చలేదు. టీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న మా ప్రేమను వచ్చే ఎన్నికల్లో చూపెట్టి, ఎట్టి పరిస్థితుల్లో హుజరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురుతుందని నిరూపిస్తాం.
–బండి కొమురయ్య యాదవ్, యాదవ సంఘం ప్రెసిడెంట్ హుజూరాబాద్
ఏనాడూ పట్టించుకోలె
నేను మోటార్ ఫీల్డ్కు వచ్చి 20 ఏళ్లవుతుంది. గత 20 సంవత్సరాలుగా ప్రైవేటు డ్రైవర్లకు ఏనాడూ ఏ ఒక పని కూడా ఈటల రాజేందర్ చేయలేదు. మా లాంటి ప్రైవేటు డ్రైవర్లను ఆదుకొమ్మని ఎన్ని సార్లు కలిసినా ఈటల పట్టించుకోలే. తెలంగాణ ప్రభుత్వం రోడ్ ట్యాక్స్ను రద్దు చేసి, ప్రైవేట్ డ్రైవర్లకు ఉచిత ప్రమాద బీమా కల్పించింది. అందుకే ఆయనను ఓడించేందుకు నేను ఈ రోజు మంత్రి గంగుల కమలాకర్ నాయకత్వంలో టీఆర్ఎస్లో చేరా. ఈటలకు నిరుద్యోగ యువత గురించి మాట్లాడే హకు లేదు. ఆయన స్వార్థపూరిత అబద్ధపు ఆరోపణలను తిప్పికొట్టి, హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకోసం పని చేస్తా.
–ఎస్డీ అఖిల్, కార్ డ్రైవర్ల సంఘం ఉపాధ్యక్షుడు, హుజూరాబాద్