వీడనున్న హుజూరాబాద్ ఉపఎన్నిక ఉత్కంఠ
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
మొదట పోస్టల్ బ్యాలెట్లు.. ఆ తర్వాత ఈవీఎంలు
కొవిడ్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ కేంద్రాలు
సిబ్బందికి శిక్షణ ఇచ్చిన ఎన్నికల అధికారులు
పొరపాట్లు జరుగకుండా చూడాలని ఆదేశాలు
lస్ఆర్ఆర్ కళాశాల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
కరీంనగర్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలనున్నది. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభిస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా రెండు హాళ్లలో 14 టేబుళ్లు సిద్ధం చేయగా, 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానున్నది.మొదట హుజూరాబాద్ మండల ఓట్లను, చివరగా కమలాపూర్ మండల ఓట్లను లెక్కించనున్నారు. ప్రతి రౌండుకు అరగంట సమయం పట్టే అవకాశం ఉందని, అధికారులు చెబుతున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కోసం కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లను సిద్ధం చేశారు. ఒక్కో హాల్లో ఏడు చొప్పున మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్పై ముగ్గురు సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నారు. 22 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రతి రౌండ్కు అర గంట సమయం పడుతుందని చెబుతున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ మొదలు కానుంది. 753 పోస్టల్ బ్యాలెట్లు పోలవగా, వీటిని అర గంటలో లెక్కించి 8.30కి ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఒక్కో రౌండ్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కలు తీస్తారు. అనంతరం రిటర్నింగ్ అధికారి రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటిస్తారు. ఒక్కో రౌండ్కు అర గంట సమయం పడుతున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు 11 గంటల సమయం పట్టవచ్చు. అంటే రాత్రి 8 గంటల వరకు తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
మొదట హుజూరాబాద్ ఓట్లే..
ఓట్ల లెక్కింపు మొదట హుజూరాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట బూత్ నంబర్-2 నుంచి ప్రారంభిస్తున్నారు. మండలంలోని 14 గ్రామాల తర్వాత పట్టణ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట తర్వాత చివరగా కమలాపూర్ మండల ఓట్లను లెక్కించనున్నారు. ఈ మండలంలోని శంభునిపల్లి బూత్ ఓట్లను చివరగా లెక్కిస్తామని రిటర్నింగ్ అధికారి రవీందర్రెడ్డి తెలిపారు.
ప్రతి రౌండ్కు ఫలితాల వెల్లడి
కౌంటింగ్ ఫలితాలను రౌండ్ల వారీగా వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. రెండు హాళ్లలో ఏర్పాటు చేసిన 14 టేబుళ్లపై ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది లెక్కిస్తారు. అనంతరం లాటరీ ద్వారా ఎంపిక చేసిన ఐదు వీవీ ప్యాట్లోని స్లిప్లను పరిశీలిస్తారు. వాటికి అనుబంధంగా ఉన్న బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లలో ఉన్న ఓట్లు వీవీ ప్యాట్స్లోని స్లిప్పులతో సరిపోతున్నాయా లేదా పరిశీలించాక ఫారం 17సీ ద్వారా రిటర్నింగ్ అధికారి ప్రతి రౌండ్కు ఒకసారి ఫలితాలను విడుదల చేస్తారు.
ఫలితాల వెల్లడికి ఆలస్యం తప్పదా?
ఉప ఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు ఉండడం, పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదు కావడంతో తుది ఫలితాలు వెల్లడికి ఆలస్యం తప్పేలా లేదు. ఒక్కో రౌండ్కు అర గంట చొప్పున సమయం తీసుకున్నా 11 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఒక ఈవీఎంలో 16 మంది అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. 30 మంది అభ్యర్థులకు 2 ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కౌంటింగ్లో ప్రతి రౌండ్లో రెండు ఈవీఎంలోని ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి నెలకొన్నది. అంతేకాకుండి నిబంధన ప్రకారం ప్రతి రౌండ్లో ఐదు వీవీ ప్యాట్ స్లిప్లను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాత్రి 8 గంటలకుగాని తుది ఫలితాలు వెలువడే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.
కౌంటింగ్ సిబ్బందికి కలెక్టర్ శిక్షణ
ఉప ఎన్నిక కౌంటింగ్లో విధులు నిర్వహించే సిబ్బందికి సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తదితర అధికారులు శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్లో పాటించాల్సిన నియమనిబంధలను వారికి వివరించారు. ఎక్కడా పొరపాటు జరగనీయవద్దని, సొంత నిర్ణయాలు తీసుకోవద్దని సిబ్బందిని హెచ్చరించారు. అనుమానం వస్తే రిటర్నింగ్ అధికారి దృష్టికి తేవాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు.