రాష్ట్రంలో ఎనిమిది వైద్య కళాశాలలు, నాలుగు సూపర్ స్పెషాలిటీ వైద్యశాలల ఏర్పాటు
వచ్చే ఆగస్టు నుంచి రామగుండం వైద్య కళాశాల తరగతులు ప్రారంభం
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
ఫర్టిలైజర్సిటీ, ఫిబ్రవరి 1: పేద ప్రజలకు ఉచిత కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రూ.10వేల కోట్లతో తెలంగాణలో ఎనిమిది వైద్య కళాశాలలు, నాలుగు సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు, 14 నర్సింగ్ కళాశాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వైద్య కళాశాల అభివృద్ధి పనుల పరిశీలనకు బుధవారం ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మంత్రికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జడ్పీ చైర్మన్ పుట్టమధుకర్ పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి దవాఖాన అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వచ్చే ఆగస్టు నాటికి వైద్య కళాశాల తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, పేదలకు అందుబాటులో మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో కార్మికుల వైద్యం కోసం కళాశాల ఏర్పాటు హర్షణీయమన్నారు. దేశవ్యాప్తంగా 158 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తూ తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించకపోవడం కేంద్రం వైఖరిని స్పష్టం చేస్తున్నదన్నారు. ఈ విషయంలో తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు తమ నాయకులను ప్రశ్నించాలన్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ, సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన వైద్యకళాశాల నిర్మాణం త్వరలో పూర్తి కానున్నట్లు తెలిపారు. అలాగే బసంత్నగర్లో రూ.9కోట్ల వ్యయంతో రాజీవ్ రహదారి ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంగీతా సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ పుట్టమధుకర్, కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, నర్సింహాచారి, మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, జడ్పీటీసీలు ఆముల నారాయణ, కందుల సంధ్యారాణి, టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు తానిపర్తి గోపాల్రావు, పాతిపల్లి ఎల్లయ్య, పీ శ్రీనివాస్, వంగ శ్రీనివాస్, కాల్వ స్వరూప శ్రీనివాస్, అచ్చె వేణు, గంగా శ్రీనివాస్, అడ్డాల గట్టయ్య, మూల విజయారెడ్డి, బాలరాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.