జాతీయ రహదారుల నిర్మాణంలో నిలువెత్తు నిర్లక్ష్యం
అంగీకారం తెలిపినా నిధులు కేటాయించని వైనం
రైల్వే లైన్ల విషయంలో అదే ధోరణి
మెగా పవర్లూం క్లస్టర్ ఏర్పాటుపై శీతకన్ను
పక్క రాష్ర్టానికి ట్రిపుల్ ఐటీ.. మనకు మొండిచేయి
ఈసారి బడ్జెట్లో బండి సాధిస్తారా? చడీసప్పుడు లేకుండా ఉంటారా?
ప్రజల్లో సర్వత్రా చర్చ
కరీంనగర్, జనవరి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మూడేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై నిర్లక్ష్యం చూపుతున్న కేంద్రం.. ఈసారి బడ్జెట్లోనైనా కరుణచూపుతుందా?.. లేక ఎప్పటిలాగే కర్కశత్వాన్ని ప్రదర్శిస్తుందా? అన్న చర్చ ప్రజల్లో జోరుగా సాగుతోంది. ఆనాటి ఎంపీ వినోద్కుమార్ ఐదేళ్ల పాటు నిర్విరామ పోరాటం మేరకు.. పలు జాతీయ రహదారులు, కొత్త రైల్వే లైన్లకు అంగీకారం తెలిపిన కేంద్రం.. ఆ తర్వాత వాటి ముచ్చట పూర్తిగా మరిచిపోయింది. ఫలితంగా జాతీయ రహదారి కూడలిగా మారాల్సిన కరీంనగర్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. రైల్వేలైన్ల విషయంలోనూ అదే ధోరణితో వ్యవహరిస్తోంది. నేతన్నల కోసం మెగా పవర్లూం క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఏడేళ్లుగా చేస్తున్న విజ్ఞప్తిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. మన జిల్లాకు రావాల్సిన ట్రిపుల్ఐటీని పక్క రాష్ట్రం తన్నుకపోయినా మన ఎంపీ అడిగిన పాపాన పోలేదు. రైల్వే కోల్కారిడార్ మాట అటకెక్కింది. ఈ పరిస్థితుల్లో ఈసారి కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం ప్రవేశపెడుతుండగా.. కరీంనగర్ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈసారైనా ఏమైనా సాధిస్తారా? లేక ఎప్పటిమాదిరిగానే చడీసప్పుడు లేకుండా ఉంటారా? అన్న అంశంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
గత మూడేళ్లుగా బడ్జెట్ కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ ఉమ్మడి జిల్లాపై పూర్తి నిర్లక్ష్యం చూపుతోంది. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, ఇతర కేటాయింపులపై వివక్ష ప్రదర్శిస్తోంది.
మెగాపవర్ లూం క్లస్టర్ మొర పట్టించుకోరూ?
సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా, చేనేత జౌళీశాఖ మంత్రిగా, మెగా పవర్లూం క్లస్టర్ మంజూరు చేయాలని ఎనిమిదేళ్లుగా మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరుతున్నారు. కానీ, ఏనాడూ ఈ దిశగా కేంద్రం అడుగులు వేయడం లేదు. రాజకీయాలు మాని కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ మెగాపవర్లూం క్లస్టర్, చేనేత సమూహాలకు క్లస్టర్లు, ఇండియన్ టెక్స్టైల్స్ ఇన్స్టిట్యూట్ తెలంగాణకు తీసుకురావాలని ఎన్నోసార్లు కేటీఆర్ విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ హైండ్లూం టెక్నాలజీ’ అనే సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేదని, రాష్ర్టాల విభజన తర్వాత అది నెల్లూరుకు తరలిపోయిందని, ఆలాంటి సంస్థను మనరాష్ట్రంలోని పోచంపల్లిలో ఏర్పాటు చేయాలని పలుమార్లు కేంద్ర మంత్రులకు స్వయంగా మంత్రి కేటీఆర్ లేఖలు రాశారు. కానీ, నేటికీ స్పందన లేదు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, దుబ్బాక, కమలాపూర్, జమ్మికుంట, నల్లగొండలో చేనేత క్లస్టర్లను మంజూరు చేయాలని కోరుతున్నా.. కేంద్రం మన మొర పట్టించుకోవం లేదు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో సిరిసిల్ల కూడా ఉందన్న విషయాన్ని ఎంపీ బండి సంజయ్ మరిచి పోవద్దని, ఇప్పటికైనా వీటిని మంజూరు చేయిస్తారా. ? లేదా తేల్చి చెప్పాలని వారం రోజుల క్రితం సిరిసిల్ల వేదికగా మంత్రి కేటీఆర్ డిమాండ్ చేసినా.. బండి సంజయ్ నుంచి మాత్రం ఉలుకూ పలుకూ లేదు. మంత్రి కేటీఆర్ డిమాండ్ చేసిన తర్వాత సిరిసిల్లకు వెళ్లిన బండి సంజయ్ పవర్లూం క్లస్టర్ గురించి కాస్తంత కూడా మాట్లాడకపోవడం ఆయన నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తోంది. ఇవేకావు.. హుజూరాబాద్ ఎన్నికల్లో ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. కేంద్ర పథకాలను తెచ్చి హుజూరాబాద్ను మూడుపువ్వులు, ఆరుకాయలుగా మారుస్తామంటూ మ్యానిఫెస్టో విడుదల చేశారు. వారు చెప్పిన మ్యానిఫెస్టోలో ఒక్కటంటే ఒక్కటీ అమలు కాలేదు. ఆ దిశగా అడుగులు పడలేదు.
పత్తాలేని రైల్వే లైన్.. పట్టని కోల్కారిడార్
కరీంనగర్-కాజీపేట వయా హుజూరాబాద్ నూతన రైల్వే లైన్కు ఆనాటి ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ఒక ప్రణాళికా బద్ధంగా కేంద్రాన్ని ఒప్పించారు. ఆ మేరకు కేంద్రం లైన్ నిర్మాణం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) తయారు చేసేందుకు రైల్వే బోర్డు ఒప్పుకొంది. ఇన్ని జరిగిన తదుపరి… ఈరోజు ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. ఈ విషయంలో కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ముందుండి ప్రాజెక్టు పనులు సాగేలా చూడాలి. కానీ.. ఆయన పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఈరోజు ప్రవేశపెట్టే బడ్జెట్లోనైనా దీనికేమైనా మోక్షం వస్తుందో చూడాలి.
‘బండి’ సాధించేనా..?
ప్రస్తుత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. ఎంపీగానే కాదు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష హోదాలో కొనసాగుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్నది సామెత. అంటే, ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నసమయంలోనైనా.. ఆయనకు ఎంపీగా రాజకీయ అవకాశాన్ని కల్పించిన కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. గత మూడేళ్లుగా ఆ దిశగా ప్రయత్నాలు సాగిన దాఖలాలు మాత్రం లేవు. కనీసం ఈ బడ్జెట్లోనైనా.. బండి ఏమైనా సాధిస్తారా? లేదా? అన్నది మంగళవారం తెలిసిపోనున్నది. ఈ బడ్జెట్ ద్వారా బండి సత్తా చాటుకుంటారా?లేక సడీసప్పుడు లేకుండా ఉంటారో? తేలుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కర్ణాటకకు రెండు.. మనకు మొండి చేయి
కరీంనగర్కు ట్రిపుల్ఐటీ ఇవ్వాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 2021లో లేఖ రాశారు. అయితే, అది మనకు కాదని కర్ణాటక రాష్ర్టానికి రెండో ట్రిపుల్ఐటీ ఇచ్చారు. ట్రిపుల్ఐటీ కోసం చేసిన చట్టం ప్రకారం చూసినా.. ప్రతి రాష్ర్టానికి ఒక ట్రిపుల్ఐటీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిబంధనలను తుంగలో తొక్కారు. అలా ఎలా? ఇస్తారని మాజీ ఎంపీ వినోద్కుమార్ పలుమార్లు కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ విషయంలో ఆయన గతేడాది సెప్టెంబర్లో కేంద్ర విద్యాశాఖాధికారులతో కలిసి చర్చించారు. ట్రిపుల్ఐటీ కరీంనగర్కు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ పరంగా అన్ని వసతి సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేసినా.. నేటి వరకు అతీ గతీ లేదు. ఆ దిశగా అడుగులు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత కోరుతున్నా.. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఏనాడూ కేంద్రాన్ని ట్రిపుల్ ఐటీని కరీంనగర్లో ఏర్పాటు చేయమని కోరకపోవడం సొంత నియోజకవర్గంపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో? తెలిసిపోతున్నది.
నాడు అంగీకారం.. నేడు నిర్లక్ష్యం
మాజీ ఎంపీ, ప్రస్తుత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు 16వ లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణలోనే కరీంనగర్ను జాతీయ రహదారుల జంక్షన్ చేయాలన్న లక్ష్యంతో పని చేశారు. ఆ మేరకు ఆయన అనేక జాతీయ రహదారులకు కేంద్రం నుంచి అంగీకారం వచ్చేలా కృషి చేశారు. కానీ, నేటి ఎంపీ బండి సంజయ్ మాత్రం అవి ఆచరణలో అమలయ్యేలా చర్యలు తీసుకోవడం లేదు. నాడు అంగీకారం తెలిపిన కేంద్రం.. నేడు సదరు జాతీయ రహదారుల ఊసే ఎత్తకపోవడం దీనికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు.
కరీంనగర్- సిరిసిల్ల- ఎల్లారెడ్డి-పిట్లం 164 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులకు 2016 ఫిబ్రవరి 16న సూత్రప్రాయంగా కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
జాతీయ రహదారి జంక్షన్ 353 సీ నుంచి భూపాల్పల్లి- అంశాన్పల్లి- గొర్లవీడు, నేరెడ్పల్లి- గర్మిళపల్లి-బూరపల్లి- ఎమ్పెడ్-వావిలాల- జమ్మికుంట-వీణవంక-కరీంనగర్ వరకు 131 కిలోమీటర్ల జాతీయ రహదారికి సూత్రప్రాయంగా అంగీకరించి 2, 4, 6 లేన్స్ అప్ గ్రేడ్ చేస్తామని 2017 ఆగస్టు 31న ప్రకటించిన కేంద్రం నేటి వరకు పట్టించుకోలేదు.
సిరిసిల్ల-సిద్దిపేట-దుద్దెడ రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా నంబర్ 365బీగా ప్రకటిస్తూ 2016 ఫిబ్రవరి 16న సమాచారాన్ని ఇచ్చిన కేంద్రం డీపీఆర్ సిద్ధం చేయనున్నట్లు తెలిపినా తిరిగి పట్టించుకోలేదు.
మెదక్-సిద్దిపేట- ఎల్కతుర్తి 133 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం 2016 నవంబర్ 24న సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ విషయంలో ఇటీవల కాలంలో కొంత ప్రోగ్రెస్ కనిపిస్తున్నా.. అశించిన స్థాయిలో మాత్రం ముందుకు సాగడం లేదు.
బోయినపల్లి వినోద్కుమార్ 16వ లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు జగిత్యాల-కరీంనగర్-కామారెడ్డి-పిట్లం జాతీయ రహదారి, అలాగే కోరుట్ల-వేములవాడ-సిరిసిల్ల-సిద్దిపేట-జనగామ-సూర్యాపేట, అలాగే కరీంనగర్-వీణవంక-జమ్మికుంట- చిట్యాల్-భూపాలపల్లి- మహదేవ్పూర్-సిరోంచ జాతీయ రహదారి మంజూరు కావాలని కోరారు. కానీ, నేటి వరకు కేంద్రం నుంచి స్పందన కనిపించడం లేదు.
ఉత్తర తెలంగాణలో జాతీయ రహదారుల హబ్గా కరీంనగర్ జిల్లాను తీర్చిదిద్దేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు జాతీయ రహదారుల పనుల పర్యవేక్షణ కోసం 2016 జూన్ 24న ఎస్ఈ కార్యాలయాన్ని వినోద్కుమార్ ఆనాడు పట్టుబట్టి ఏర్పాటు చేయించారు. కానీ.. నేడు పనులు లేక వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది.
భారత్ మాల జాబితాలోకి కరీంనగర్- వేములవాడ-సిరిసిల్ల-పిట్లం రోడ్ను చేర్చుతామని, త్వరలోనే ఈ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించి మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గతేడాది హామీ ఇచ్చారు. అలాగే, కరీంనగర్- చల్లూరు-టేకుమట్ల- భూపాలపల్లి రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. కానీ, నేటి వరకు అతీగతీ లేదు.