అర్పపల్లి గ్రామస్తుల ప్రత్యేకత
ఊళ్లో నాలుగు ప్రాథమిక, ఒక జడ్పీ హైస్కూల్
కరోనాతో పెరిగిన డ్రాపౌట్స్
ఆంగ్లమాద్యమ బోధన, ఒకే చోటుకి ప్రైమరీ స్కూళ్ల తరలింపుతో పెరిగిన విద్యార్థుల సంఖ్య
ఫలించిన పంచాయతీ పాలకవర్గం, టీచర్ల కృషి
అంతకుముందే తన ఇద్దరు పిల్లల్ని చేర్పించిన సర్పంచ్
ఆదర్శంగా నిలుస్తున్న ఊరు
సారంగాపూర్,జనవరి 31: ఒకప్పుడు ఓ వెలుగువెలిగి మూతబడే స్థితికి చేరిన పాఠశాలలకు ఆ గ్రామస్తులు పునర్జీవం పోశారు. అందరికంటే ముందుగానే తన ఇద్దరు పిల్లలను సర్పంచ్ సర్కారు బడిలో చేర్పించి మంచి సందేశం ఇవ్వగా, అదే బాటలో తల్లిదండ్రులంతా నడిచారు. ఊళ్లో వేర్వేరు చోట్ల నాలుగు ప్రైమరీ స్కూల్స్, మరోచోట జడ్పీ హైస్కూల్లో కరోనాతో పెరిగిపోయిన డ్రాపౌట్స్ను తగ్గించేందుకు టీచర్లు, పంచాయతీ పాలకవర్గం చేసిన కృషితో చైతన్యవంతమై పూర్వవైభవం తెచ్చారు. 1 నుంచి 7వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ బోధనతోపాటు నాలుగు ప్రాథమిక పాఠశాలలను ఒకే గొడుగుకిందికి తేవడంతో తమ పిల్లలందరినీ ప్రభుత్వ బడికే పంపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు సారంగాపూర్ మండలం అర్పపల్లి గ్రామస్తులు.
అర్పపల్లి. సారంగాపూర్ మండలంలోని పెద్ద ఊరు. గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దాని ఆవరణలో ఒక ప్రాథమిక పాఠశాల, గొల్లవాడ, బెస్తవాడ, చాకలివాడలో మరో మూడు ప్రాథమిక పాఠశాలు ఉన్నాయి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాయి. కానీ తర్వాత కాలంలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. సర్పంచ్, టీచర్లు, పంచాయతీ పాలకవర్గం కృషితో తిరిగి పునర్జీవం పోసుకుని కళకళలాడుతున్నాయి.
ఆంగ్ల మాధ్యమ బోధనతో పూర్వవైభవం..
కరోనాతో పాఠశాలల్లో డ్రాపౌట్స్ పెరిగాయి. విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తుండడంతో గ్రామంలోని నాలుగు ప్రైమరీ స్కూళ్లలో ఒక్కో దాంట్లో పిల్లల సంఖ్య 22 నుంచి 25 వరకు తగ్గిపోయింది. అలాగే జడ్పీ హై స్కూల్లో 49కి పడిపోయింది. ఫలితంగా టీచర్ పోస్టులు తరలిపోయే ప్రమాదం వచ్చిపడింది. దీంతో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సర్పంచ్ కొండ శ్రీలత, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొండ ప్రభాకర్, ఉన్నత పాఠశాల హెచ్ఎం తిరుకోవెల నరేందర్, నాలుగు ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు ఆనందం, శ్రీనివాస్, కాళిదాస్, సత్యనారాయణ గ్రామస్తులతో కలిసి ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించారు. ప్రజల్లో చైతన్యం తెచ్చారు. ఇంగ్లిష్ మీడియం బోధిస్తామని మాటివ్వడంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం నాలుగు ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో పాఠశాలలో 42 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 93 మందికి విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5వరకు, ఉన్నత పాఠశాలలో కూడా 6,7 తరగతులను ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు. ఇంకా కరోనా టైంలో ఎక్కడా లేని విధంగా 1,2వ తరగతులకు ఆన్లైన్ పద్ధతిలో విద్యా భోదన చేస్తూ 3,4,5 తరగతుల పిల్లలకు ఇంటివద్దకే వెళ్లి బోధించి నమ్మకం పెంచారు.
ఒకే గొడుకు కిందికి ప్రైమరీ స్కూళ్లు..
అయితే గ్రామంలోని నాలుగు ప్రైమరీ స్కూళ్లు వేర్వేరు చోట్ల ఉండడం కొంత ఇబ్బందిగా ఉండేది. దీంతో గ్రామస్తులు, టీచ ర్లు సమష్టి నిర్ణయం తీసుకున్నారు. నాలుగు ప్రాథమిక పాఠశాలలను ఒకే వద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోకి తరలించి, విద్యా బోధన చేస్తుండడంతో ఇది మరింత సులువుగా మారింది. ఇది పిల్లల సంఖ్య పెరుగుదల మరింత దోహదపడిందని చెప్పవచ్చు.
సమష్టి కృషితోనే సాధ్యమైంది..
టీచర్లు, గ్రామస్తులు, విద్యార్థుల సమష్టి కృషితో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. మొదటగా విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాం. సంఖ్య తగ్గిపోతుండడంతో ఎలాగైనా పెంచాలని నిర్ణయించుకున్నాం. సర్పంచ్, టీచర్లు కలిసి గ్రామస్తుల సహకారంతో ఇంటింటికీ తిరుగుతూ చైతన్యం తెచ్చాం. 6, 7వ తరగతులను పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తుండడంతో పిల్లల సంఖ్య పెరిగింది. నాలుగేళ్లుగా వరుసగా వందశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నాం.-టీ నరేందర్, హెచ్ఎం, ఉన్నత పాఠశాల, అర్పపల్లి.
పూర్తిగా ఆంగ్ల మాధ్యమ బోధనే..
ప్రైమరీ స్కూల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ప్రైవేట్కు దీటుగా పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే బోధిస్తున్నాం. సర్పంచ్, గ్రామస్తుల సహకారంతో ఉన్నత పాఠశాల ఆవరణలోకే నాలుగు ప్రాథమి పాఠశాలలను తరలించాం. 8 మంది ఉపాధ్యాయులతో బోధన జరుగుతుంది. పిల్లలు చాలా ఇష్టంగా నేర్చుకుంటున్నరు. తగ్గిపోతున్న పిల్లల సంఖ్యను పెంచేందుకు కృషిచేసిన సర్పంచ్, గ్రామస్తులు, టీచర్లకు కృతజ్ఞతలు.-ఆనందం, హెచ్ఎం, ప్రాథమిక పాఠశాల, అర్పపల్లి.
మా ఇద్దరు పిల్లల్ని చేర్పించినం..
గ్రామంలోని పాఠశాలలకు పూర్వవైభవం తేవాలని నిర్ణయించుకు న్నాం. అందుకే మొదట మా ఇద్ద రు పిల్లల్ని ప్రభు త్వ పాఠశాలలో చేర్పించిన. తర్వాత టీచర్లతో కలిసి ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. ఇంకా ఆంగ్ల మాధ్యమ బోధన కూడా తీసుకువచ్చి విద్యార్థుల సంఖ్యను పెంచుకోగలిగాం. విద్యలోనూ మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇందుకు జడ్పీ, ప్రైమరీ స్కూళ్ల హెచ్ఎంలు, టీచర్లు, గ్రామస్తుల సహకారం మరువలేనిది. చాలా సంతోషంగా ఉంది.