కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 4 : కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారి (ఎన్హెచ్-563) విషయంలో కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదని, గతంలోనే మంజూరైన ఈ రహదారిని ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. 2019లోనే కేంద్రం ఆమోదం తెలిపిన ఈ ప్రాజెక్టును ఇప్పుడు కొత్తగా కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్టుగా ప్రచారం చేయడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. ఏడేళ్లుగా ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ కనీసం తట్టెడు మట్టి కూడా తీయించలేకపోయారని ఎద్దేవా చేశారు.
ఏటా ఈ రహదారిపై పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నా, వందల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నా ఆయనకు చిత్తశుద్ధి కనిపించడంలేదని మండిపడ్డారు. కరీంనగర్ అభివృద్ధి కోసం కేంద్రం రూ.20 వేల కోట్లు మంజూరు చేసిందని పదేపదే చెబుతున్న సంజయ్.. ఆ నిధులు ఎకడ ఖర్చయ్యాయో.. ఏయే పనులు చేశారో.. వివరాలతో శ్వేతపత్రాన్ని 48 గంటల్లో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016-19 కాలంలోనే అప్పటి సీఎం కేసీఆర్, ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కృషితో ఎన్హెచ్-563 జాతీయ రహదారి మంజూరైందని గుర్తు చేశారు.
2019 ఎంపీ ఎన్నికలకు ముందే టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు. 2024లో రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత సెప్టెంబర్ నాటికే టెండర్లు పూర్తవుతాయని, 2025 సెప్టెంబర్లో పనులు ప్రారంభమవుతాయని సంజయ్ పలుసార్లు ప్రకటించారని గుర్తుచేశారు. 2020లోనే ప్రారంభమై పూర్తి కావాల్సిన పనులను ఇప్పుడు మళ్లీ ఆమోదముద్ర పేరుతో ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 60 శాతానికి పైగా భూసేకరణ పూర్తయిందని, మిగిలిన 40 శాతం భూసేకరణ పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు ఏంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తీగలగుట్టపల్లి వద్ద నాలుగేళ్లుగా ఆర్వోబీ నిర్మాణం పూర్తి కాలేదని, కొండగట్టు అభివృద్ధికి ఒక రూపాయి నిధులు కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి అంశంపై విమర్శలు చేసిన ఆయన, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డితో బీజేపీ నాయకుల చీకటి దోస్తీ ప్రజలకు అర్థమైందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో, ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కృషితో కరీంనగర్కు స్మార్ట్సిటీ మంజూరైందని, రూ.వెయ్యి కోట్లతో నగరాన్ని అద్దంలా తీర్చిదిద్దామన్నారు. జాతీయ రహదారి విషయంలో వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, చొప్పదండి నియోజకవర్గ నాయకుడు రమణారావు, తదితరులు పాల్గొన్నారు.