పారిశ్రామిక ప్రాంతం సిగలో మరో నగ చేరబోతున్నది. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రామగుండానికి ఐటీ టవర్ రాబోతున్నది. ఈ ప్రాంతవాసుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. మిత్రుడు కోరుకంటి చందర్ కోరిక మేరకు త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ శుక్రవారం అసెంబ్లీ వేదికగా ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కొంతకాలంగా ఎమ్మెల్యే చందర్ చేసిన కృషి ఫలించగా, ఈ ప్రాంత యువత ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేకుండా ఇక్కడే ఐటీ ఉద్యోగం చేసుకునే అవకాశం దొరకనున్నది.
గోదావరిఖని, ఆగస్టు 4: పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో స్థానిక యువతకు ఉపాధి చూపాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదు. ఎలాంటి కంపెనీలను ఇక్కడకు తీసుకురాలేదు. తెలంగాణ ఏర్పాటు త ర్వాత సర్కారు స్థానికంగా యువతకు కొలువులు కల్పించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నది. అందులో భాగంగా జిల్లాలకు కంపెనీలను తీసుకొస్తున్నది. ఐటీ రంగాన్ని హైదరాబాద్కే పరిమితం చేయకుండా ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరిస్తున్నది. ఇప్పటికే కరీంనగర్ సహా ఎన్నో జిల్లాల్లో ఐటీ టవర్లను ఏర్పాటు చేసింది. తాజాగా, రా మగుండంలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
సింగరేణి, ఎన్టీపీసీ, కేశోరాం, జెన్కో లాంటి భారీ పరిశ్రమలు కలిగిన పారిశ్రామిక ప్రాంతంలో 3 లక్షలకు పైగా జనాభా ఉంటుంది. ఈ ప్రాంత ఉద్యోగుల పిల్లలు చాలా మంది ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారే. వీరి చదువులకు అనుగుణంగా స్థానికంగా ఐటీ ఉద్యోగాలు లేక హైదరాబాద్, బెంగళూర్, ఫూణె, తదితర నగరాలకు వెళ్తున్నారు. మరికొందరు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలకు వెళ్లి కొలువులు చేస్తున్నారు. ప్రధానంగా రామగుం డం రీజియన్లోని ఆర్జీ-1, 2, 3 ఏరియాలకు సంబంధించి వేలాది మంది కార్మికుల పిల్లలు ఐటీ రం గంలోనే ఉన్నారు. అయితే, రామగుండంలో ఐటీ టవర్ ఏర్పాటైతే ఇక్కడే ఉద్యోగాలు లభించే అవకాశముంటుంది.
పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం జిల్లా కేంద్రాలకు ఏమాత్రం తీసిపోదు. ఈ పట్ణణం ఐటీకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుంది. జిల్లా కేంద్రమైన పెద్దపల్లికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో నే ఉండడం, అలాగే రామగుండంలో రైల్వే సేషన్ ఉండడంతో ఈజీగా రాకపోకలు సాగించే అవకాశమున్న ది. హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల, వరంగల్ ప్రాం తాల నుంచి మెరుగైన రోడ్డు రవాణాతోపాటు రైల్వే సౌ కర్యం ఉన్నది. దీనికి తోడుగా సింగరేణి సంస్థకు చెం దిన పెద్ద డివిజన్గా ఉన్న శ్రీరాంపూర్ డివిజన్ కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో అక్కడి సింగరేణి కార్మికుల పిల్లలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉం డే అవకాశమున్నది. ఇలా అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉన్న రామగుండంలో ఐటీ టవర్ ఏర్పాటు చేస్తే ప్రముఖ కంపెనీలు కూడా వచ్చే అవకాశముంటుంది. ఐటీ రంగంలో ఉన్న ఈ ప్రాంత పిల్లలు కూడా ఇక్కడ పనిచేయడానికి ఉత్సాహం చూపే ఆస్కారముంటుంది. అలాగే, ఐటీ టవర్ ఏర్పాటైతే రామగుండం రూపురేఖలు మారిపోనున్నాయి.
రామగుండంలో ఐటీ టవర్ ఏర్పాటుకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొద్ది రోజులుగా పట్టువిడకుండా ప్రయత్నం చేస్తున్నారు. సీఎం కేసీఆర్తోపాటు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి విన్నవిస్తూ వస్తున్నారు. కొన్ని నెలల క్రితం కేటీఆర్ గోదావరిఖని పర్యటన సమయం లో ఐటీ టవర్ ఏర్పాటు చేస్తామని, ఇక్కడికి కొన్ని కంపెనీలు ముందుకు రావాల్సి ఉందని, తాను అమెరికా పర్యటనకు వెళ్తున్న క్రమంలో రామగుండంలో ఐటీ టవర్ ఏ ర్పాటుకు సంబంధించి ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే కోరుకంటి చందర్ కూడా స్వయంగా అ మెరికాకు వెళ్లి కొందరు ఐటీ ప్రతినిధులతో భేటీ అ య్యారు. ఆ కంపెనీల ప్రతినిధులు ఆసక్తి చూపడంతో ఆ విషయాన్ని ఇటీవల మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రామన్న శుక్రవారం అసెంబ్లీ వేదికగా రామగుండంలో ఐటీ టవర్ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఐటీ టవర్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఈ క్రమంలోనే ఆయన ఇటీవల అమెరికాకు వెళ్లి కొంత మంది ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారని, రామగుండంలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపారని చెప్పారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతం (కోల్బెల్ట్) ఏరియాలో ఐటీటవర్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దాల కాలంగా ఉన్నది. ఇది నా హయాంలో సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ కృషితోనే ఐటీ టవర్ ఏర్పాటు కాబోతున్నది. నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఐటీ టవర్ ఏర్పాటుకు ఎంతో కృషి చేశా. కొంతకాలం క్రితం గోదావరిఖనికి కేటీఆర్ వచ్చిన సమయంలో ఐటీ టవర్ నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు సిద్ధమయ్యాం. అయితే, కంపెనీలు ముందుకు వచ్చిన తర్వాతనే ప్రారంభించుకుందామని మంత్రి చెప్పడంతో కొంత ఆలస్యం జరిగింది. మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్లినప్పుడు ఐటీ టవర్ కోసం కృషి చేశారు. మరింత బలంగా ఈ ప్రాంతానికి ఐటీని తీసుకురావాల నే ఉద్దేశంతో నేను కూడా అమెరికా వెళ్లి ఐటీ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడా. సానుకూలత వ్యక్తమైంది. రా మగుండంలో ఐటీ టవర్ ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా. ఈ ప్రాంత ప్రజల తరఫున నా కృతజ్ఞతలు.
– కోరుకంటి చందర్, రామగుండం ఎమ్మెల్యే