50మంది బీజేపీ, కాంగ్రెస్లకు చెందిన యాదవ యువకులు టీఆర్ఎస్లో చేరిక
జమ్మికుంట, ఆగస్టు 31: యాదవులకు అధికార భాగస్వామ్యం కల్పించేందుకే ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం పోలవేని పోచమల్లు ఆధ్వర్యంలో జమ్మికుంట మండలం కోరపల్లి, వీణవంక మండలం వల్భాపూర్ గ్రామాలకు చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్లకు చెందిన యాదవ యువకులు హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి హరీశ్రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గొల్ల, కుర్మలకు గొర్రెల యూనిట్లను 75 శాతం సబ్సిడీ పై పంపిణీ చేసే కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించామన్నారు. మొదటి విడుతలో 79.16 లక్షల గొర్రెలను 3,76,985 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయగా, అవి రెట్టింపు అయ్యాయన్నారు. పుట్టిన గొర్రె పిల్లల విలువ సుమారు రూ.6,500 కోట్లు ఉంటుందని తెలిపారు. 2019 పశుగణన ప్రకారం తెలంగాణ రాష్ట్రం 1.92 కోట్ల గొర్రెల సంఖ్యతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు.
అలాగే 1.22 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో ఇక్కడి నుండి మాంసం ఎగుమతి చేసే దిశగా అభివృద్ధిని సాధిస్తుందని చెప్పారు. పెరిగిన గొర్రెల ధరల కారణంగా సీఎం కేసీఆర్ రెండో రూ.1.25 లక్షలుగా ఉన్న యూనిట్ ధరను రూ.1.75 లక్షలకు పెంచారని చెప్పారు. రెండో విడుతలో రూ.6,125 కోట్ల వ్యయంతో 3.5 లక్షల మంది గొల్ల, కుర్మలకు యూనిట్లను పంపిణీ చేయనున్నామని చెప్పారు. గెల్లు శ్రీనును గెలిపించుకొని హుజూరాబాద్ను అభివృద్ధి చేసుకుందామన్నారు. బీజేపీ ఏడేండ్లలో హుజూరాబాద్కు చేసిందేమిటో చెప్పాలన్నారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిందన్నారు. దళిత, గిరిజన, ఓబీసీలకు ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్ లేకుండా బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. ఇలాంటి పార్టీకి బుద్ధి చెప్పడానికి ఇదే సరైన సందర్భమన్నారు. హుజూరాబాద్ గడ్డ టీఆర్ఎస్కు అడ్డా అని, గులాబీ జెండానే ప్రజలకు అండా అని పేర్కొన్నారు.