మెట్పల్లి,సెప్టెంబర్22: మెట్పల్లి పట్టణానికి మరో గురుకుల స్కూల్ మంజూరైంది. వచ్చే నెలలో జ్యోతిబాఫూలే గురుకుల విద్యాలయం ప్రారంభం కానున్నది. కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేలా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీ విద్యార్థుల కోసం సకల హంగులతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున సాంఘిక సంక్షేమ స్కూళ్లను ఏర్పాటు చేసింది. వీటితో సత్ఫలితాలు వస్తుండడంతో తాజాగా మరో 33 బీసీ గురుకుల విద్యాలయాలను మంజూరు చేసింది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లికి కేటాయించింది. ఈ మేరకు జ్యోతి బాఫూలే బీసీ రెసిడెన్సియల్ విభాగం రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా 2022-23 విద్యా సంవత్సరంలోనే ఈ స్కూల్ను ప్రారంభించాలి.
ఈ మేరకు ఉన్నతాధికారులు గురువారం మెట్పల్లి ప్రాంతంలో పలు భవనాలను పరిశీలించారు. అనువుగా ఉండే భవనం దొరికితే అక్టోబర్ మొదటి వారం నుంచి పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు, తరగతుల నిర్వహణను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే ఆరు జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. అందులో అల్లీపూర్ (బాలురు), స్తంభంపల్లి (బాలురు), అయిలాపూర్(బాలురు), మెట్పల్లి(బాలికలు), లక్ష్మీపూర్ (బాలికలు), పెగడపల్లి(బాలికలు)లోనడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మెట్పల్లికి మరొక గురుకుల పాఠశాల మంజూరుకావడంతో ఈ పాఠశాలల సంఖ్య ఏడుకు చేరింది. కాగా మెట్పల్లిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న గురుకుల (బాలురు) పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. 240 మంది విద్యార్థులకు విద్య అందే అవకాశం ఉంటుంది. ఒక్కో తరగతిలో ఏ,బీ సెక్షన్లను ఏర్పాటు చేసి సెక్షన్కు 40 మంది చొప్పున విద్యార్థులను చేర్చుకుంటారు. కాగా, మెట్పల్లికి గురుకుల స్కూల్ కేటాయించడంపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు గురువారం సీఎం కేసీఆర్ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.