న్యాలకొండపల్లి రైతు క్షేత్రంలో ఎదిగిన రెండు వృక్షాలు
14 ఏండ్ల తర్వాత కాత.. మండమండకూ కాయలు
మన నేలలు అన్ని పంటలకూ అనువైనవని నిరూపితం
అబ్బుర పడుతున్న రైతు ఆకుల లక్ష్మయ్య
కరీంనగర్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : ఎక్కడో హిమాలయాలు, పర్వత శ్రేణుల్లో కనిపించే రుద్రాక్ష, ఇప్పుడు మన నేలపైనా సాగవుతున్నది. శీతల ప్రాంతాల్లో పండే యాపిల్, ఇతర దేశాల్లో దొరికే అంజీరా, డ్రాగన్ఫ్రూట్, ఖర్జూర ఇది వరకే మన వద్ద సాగు కాగా, ఇప్పుడు గంగాధర మండలం న్యాలకొండపల్లిలో రుద్రాక్ష వృక్షం ఫలాలను అందిస్తున్నది. రిటైర్డ్ ఆర్టీవో ఆకుల లక్ష్మయ్య 14 ఏళ్ల క్రితం తన మామిడితోటలో రెండు మొక్కలు నాటగా, ఇప్పుడవి వృక్షాల్లా ఎదిగాయి. ఊహించని విధంగా మండమండకూ కాయలు విరగకాశాయి. ఇది చూసిన రైతు ఆనందానికి అవధులు లేకుండా పోగా, మన నేలలు బంగారమని మరోసారి నిరూపితమైంది. ఏ పంటకైనా, ఏ వృక్ష జాతికైనా అనువైనవేనని తేలింది.
గంగాధర మండలం న్యాలకొండపల్లికి చెందిన ఆకుల లక్ష్మయ్య రవాణా శాఖలో ఆర్టీవోగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయనకు గ్రామంలో పన్నెండెకరాల మామిడి తోట ఉండగా, అందులో వివిధ రకాలు సాగు చేస్తున్నారు. 14 ఏళ్ల క్రితం అంటే.. 2007లో ఓ మిత్రుడి సలహాతో హైదరాబాద్లోని గ్రోమోర్ నర్సరీ నుంచి రెండు రుద్రాక్ష మొక్కలు తెచ్చి అదే తోటలో నాటారు. అవి ఇక్కడ మనగలుగుతాయో లేదో అనే అనుమానంతోనే నాటిన ఆయన, ఫలాల కోసం ఇన్నేళ్లపాటు నిరీక్షించారు. అయితే ఆ మొక్కలు ఎదిగి వృక్షాలయ్యాయి. ఒక్కో వృక్షం 25 నుంచి 30 అడుగుల ఎత్తుకు ఎదిగాయి. కానీ, కాతకు రాలేదు. అయినా ఆయన ఏనాడూ నిరాశ చెందలేదు. ఇలాంటి అరుదైన వృక్షం తన క్షేత్రంలో ఉండడమే మహాభాగ్యంగా భావించారు. ఈ రెండు వృక్షాలను ఇన్నాళ్లూ సంరక్షిస్తూ వచ్చారు. గతేడాది పూత వచ్చినా నిలువలేదు. ఈ యేడాది ఆగస్టులో మళ్లీ పూత వచ్చింది. ఇప్పుడు కాత కూడా వచ్చింది. ఒక చెట్టు కాయలు కొంత తక్కువ కాసినా.. మరో చెట్టు మాత్రం మండ మండకూ విరగకాసింది. 15 నుంచి 20 కిలోల కాయలు వచ్చే అవకాశాలున్నాయి. రెండు చెట్లకు ఎక్కువగా త్రిముఖి రుద్రాక్షలు, కొన్ని ద్విముఖి, ఏకముఖి రుద్రాక్షలు వస్తున్నాయి. అరుదైన రుద్రాక్షలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కానీ, తనకు మార్కెట్తో సంబంధం లేదని, తన క్షేత్రంలో ఇలాంటి వృక్షం ఉండడమే తన అదృష్టమని లక్ష్మయ్య ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రుద్రాక్షలు కాయడం శివుడి అనుగ్రహమే..
రుద్రాక్షలను హిందువులు దైవంతో సమానంగా భావిస్తారు. ఈ రుద్రాక్షలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఇలాంటి అరుదైన వృక్ష జాతి నా క్షేత్రంలో జీవం పోసుకోవడం ఎంతో గర్వంగా అనిపిస్తున్నది. నేపాల్, థాయ్లాండ్, ఇండోనేషియాలో మన దేశంలో అయితే హిమాలయాలు, పశ్చిమ కనుమల్లో మాత్రమే ఇలాంటి వృక్షాలకు మనుగడ ఉంది. ఇంత అరుదైన మొక్క తెలంగాణలో జీవం పోసుకోవడం ఈ నేల గొప్పతనం. ఇక్కడి నేల ప్రతి పంటా, ప్రతి వృక్షం మనుగడకు అనువేనని మరోసారి నిరూపితమైంది. నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి అరుదైన మొక్కలను పెంచాలనే కుతూహలం ఎక్కువ. నా తోటలో రుద్రాక్షలు, లీచీ, ఎర్రచందనం, మారేడు, వెలగ, గజ నిమ్మ లాంటి అరుదైన మొక్కలను కూడా పెంచుతున్నా. నా క్షేత్రంలో రుద్రాక్షలు కాయడం ఆ శివుడి అనుగ్రహంగా భావిస్తున్నా.
– ఆకుల లక్ష్మయ్య, రిటైర్డ్ ఆర్టీవో