ఇల్లంతకుంట, సెప్టెంబర్ 21 : మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తున్నదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ స్పష్టం చేశారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామ శివారులోని ఎస్ఆర్ఆర్ జలాశయంలో బుధవారం చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాడు ఎడారిలా మారిన ఈ ప్రాంతాన్ని కోనసీమను తలపించేలా చేసిన ఘనత అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్దేనని కొనియాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఆర్ అన్ని కాలాల్లో నిండుకుండలా ఉండడంతో ప్రస్తుతం ఈ ప్రాంతం పచ్చని పంటలకు నెలవుగా మారిందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు తాగు, సాగు నీటి కష్టాలు దూరమయ్యాయన్నారు. మత్య్సకారుల అభివృద్ధే ధ్యేయంగా సర్కారు పాలన సాగిస్తున్నదని, ఈ క్రమంలో నేడు ప్రాజెక్టులో 6 లక్షల చేప పిల్లలను విడుదల చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో మధ్య మానేరు, అన్నపూర్ణ ప్రాజెక్టు ప్రాంతాలు ఫిష్ హబ్గా మారబోతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, తహసీల్దార్ స్వాతి, ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, వైస్ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్ గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహా రెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, సర్పంచ్ ఉత్యం అమర్ గౌడ్, జిల్లా మత్స్యశాఖ అధికారులు, మండల మత్స్యశాఖ నాయకులు, టీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.