హుజూరాబాద్ రూరల్/ ఇల్లందకుంట/ ఇల్లందకుంట రూరల్, అక్టోబర్ 26 : హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో పెద్ద జోక్లా ఉందని, ఈ ప్రాంతంపై కనీస అవగాహన లేకుండా రూపొందించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం హుజూరాబాద్ మండలం సింగాపూర్, మాలపల్లి గ్రామాల్లో భారీ ర్యాలీగా వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. సాయంత్రం ఇల్లందకుంట మండల కేంద్రంలో ధూం-ధాం కార్యక్రమాన్ని నిర్వహించగా, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాడి కౌశిక్రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆయా చోట్ల మాట్లాడుతూ పేదలకు అన్నం పెట్టేవాళ్లు ఎవరో? సున్నం పెట్టేవాళ్లు ఎవరో?, ధరలు పెంచే వాళ్లు కావాలో, పేదలకు మేలు చేసే వాళ్లు కావాలో ఆలోచన చేయాలని కోరారు. దళితబంధు దళితులతో మొదలైందని, మిగతా కులాల్లోని అందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ వాళ్లు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, తిట్టడం మానేసి ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్కు నడుమంత్రాన వచ్చాడని, నడిమంత్రాన్నే వెళ్లిపోయాడని తెలిపారు.
కేసీఆర్ ఎన్నో పదవులు ఇచ్చి కన్న కొడుకులా ఆదరిస్తే పార్టీకి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పేదవాడైన, యువకుడైన గెలు శ్రీనివాస్ యాదవ్కు ఓటేసి గెలిపిస్తే తలలో నాలుకలా, మీకాళ్లలో మెదిలే మనిషిలా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాడని పేరొన్నారు. తనకు అన్నం పెట్టింది, నచ్చిన ఊరు సింగాపూర్ అని, తనకు గానీ కేసీఆర్కు గానీ ఆతిథ్యం ఇచ్చిన ఊరు సింగాపూర్ అని గుర్తుచేసుకున్నారు. ఇల్లందకుంట రాములోరి ఆశీర్వాదం తీసుకున్నానని, ఈ ఆలయాన్ని రూ.10 కోట్లతో అభివృద్ధి చేసి, పర్యాటక, దివ్యక్షేత్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 30న సిలిండర్కు దండం పెట్టి, కారు గుర్తుకు ఓటేసి బీజేపీని బొంద పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ రాణి సురేందర్రెడ్డి, గెల్లు శ్వేత, సర్పంచ్ మంజుల సమ్మి రెడ్డి ఎంపీటీసీ గుడిపాటి సరిత జైపాల్రెడ్డి, ప్యాక్స్ అధ్యక్షులు కె.సుగుణాకర్రెడ్డి, టీఆర్ఎస్ సైదాపూర్ మండలాధ్యక్షులు సోమారపు రాజయ్య, మండల ప్రధాన కార్యదర్శి చెల్మల్ల రాజేశ్వర్ రెడ్డి, వేలేరు జడ్పీటీసీ చాడ సరిత, లింగాల ఘన్పూర్ ఎంపీపీ జయశ్రీ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, సర్పంచ్ కాల్వ ఎల్లయ్య, టీఆర్ఎస్ సింగపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు కుమార్, ఉప సర్పంచ్ అశోక్, ఎంపీటీసీ విజయ్కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ పొడేటి రామస్వామి, మాజీ సర్పంచ్ పెద్ది స్వరూప, మాజీ ఎంపీటీసీలు పెద్ది కుమార్, రాంస్వరణ్రెడ్డి, ఉప సర్పంచ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
తండ్రి లాంటి కేసీఆర్ను తిడుతవా..
ఈటల రాజేందర్.. నిన్ను పెద్ద చేసి, మంత్రి పదవి ఇచ్చిన తండ్రి లాంటి సీఎం కేసీఆర్ను తిట్టడం నీకు ఎంతవరకు సమంజసం. అన్ని కులాలు, మతాలకు సమన్యాయం చేసింది సీఎం కేసీఆర్ ఒక్కరే. దళితులకు, గౌడ్స్కు వైన్షాపుల్లో రిజర్వేషన్లు కల్పించి మంచి నిర్ణయం తీసుకున్నరు. 2009లో ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు సరైన పంటలు కనిపించకపోయేవి. ఇప్పుడు పచ్చని పంటలు కనిపిస్తున్నయ్. ప్రతి కులంలో, ఇంట్లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారులున్నరు. అందుకే ఇతర రాష్ర్టాల ఎమ్మెల్యేలు వారిప్రాంతాన్ని తెలంగాణలో కలుపాలని కోరుతున్నరు. కులం, మతం పేరిట ఓట్లడిగే పార్టీ బీజేపీ. అన్ని కులాలకు భవనాలు కటిస్తూ ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న వ్యక్తి సీఎం కేసీఆర్. అందుకే సీఎం కేసీఆర్కు ఓటు వేసి రుణం తీర్చుకోవాలి.
నమూనా గ్యాస్బండలతో ప్రచారం
బీజేపీ సర్కారు తీరును ఎండగడుతూ మహిళలు నమూనా గ్యాస్ సిలిండర్లతో ప్రచారం చేశారు. కమలాపూర్లో భారీ ర్యాలీ తీయగా, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హాజరై కార్యకర్తలు, ప్రజల్లో ఉత్సాహం నింపారు. సర్పంచ్ కట్కూరి విజయ, ఎంపీటీసీ మెండు రాధిక, ఉప సర్పంచ్ మౌటం రమేశ్ ముదిరాజ్ స్థానికులతో కలిసి ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని కోరారు. ‘దళితుడా మేలుకో.. దళితబంధు అందుకో’ అని నినదిస్తూ ఓట్లు అభ్యర్థించారు.