సిరిసిల్ల తెలంగాణ చౌక్, ఫిబ్రవరి 14: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే జైలు తప్పదని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గడువు ముగిసిన, తక్కవ క్వాలిటీ, నకిలీ మత్తు మందులకు సంబంధించినవి అమ్మితే చర్యలుంటాయని స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రేణుకా మాతా ఫంక్షన్ హాల్లో జిల్లాలోని మెడికల్ ఏజెన్సీ, మెడికల్ షాప్ నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీస్శాఖ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నదని చెప్పారు.
ఓ వైపు గంజాయి అక్రమ రవాణాపై వరుసగా దాడులు చేస్తూనే, ఇతర మత్తు పదార్థాలపైనా దృష్టిపెట్టినట్లు చెప్పారు. యువత సింథటిక్ డ్రగ్స్ వైపుకు ఆకర్షితులవుతున్న నేపథ్యంలో మెడికల్ షాపుల నిర్వాహకులు తరుచూ మత్తు మందు కోసం వచ్చే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని కోరారు. ప్రతి షాప్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే జిల్లాలో ఏర్పాటు చేసిన డీ- అడిక్షన్ సెంటర్కి సంబంధించిన పోస్టర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ భవాని, టౌన్ సీఐ రఘుపతి, మెడికల్ షాప్ నిర్వహకులు ఉన్నారు.