ప్రభుత్వ దవాఖానలో సరిపడా సిబ్బందిని నియమించాలి
ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలి
టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్ శశాంక
విద్యానగర్, ఏప్రిల్ 29: జిల్లా ప్రభుత్వ దవాఖానలో సిబ్బందిని పెంచి పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కే శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఆయన కరోనా బాధితులకు అందుతున్న వైద్యసేవలు, నియంత్రణ చర్యలపై నోడల్ అధికారులు, డాక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ప్రభుత్వ దవాఖానలో పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిపడా సిబ్బందిని నియమించి రోజుకు మూడుసార్లు శుభ్రం చేయించాలని ఆదేశించారు. పారిశుధ్య సిబ్బందిని పెంచకుంటే సంబంధిత ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేసి తొలగించాలని, కాంట్రాక్ట్ వేరే వారికి అప్పగించాలని సూచించారు.
కరోనా బాధితులకు చికిత్స అందించడానికి బెడ్స్ కొనుగోలు చేసి, వార్డులను సిద్ధం చేయాలని దవాఖాన సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఆర్టీపీసీఆర్ ల్యాబ్లో డ్రై రన్ పూర్తయినందున పరీక్షలు ప్రారంభించాలని సూచించారు. ఆక్సిజన్ కొరత ఉంటే వెంటనే నోడల్ అధికారికి తెలుపాలన్నారు. జిల్లాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున పట్టణాల్లో, గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టాలని మున్సిపల్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి, జడ్పీ సీఈవోను ఆదేశించారు. ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్కుమార్కు సూచించారు. జిల్లాలో కరోనా చికిత్స చేస్తున్న ప్రైవేట్ దవాఖానలు అవసరమైన మందుల కొరకు ఆర్డర్ చేయకుంటే షోకాజ్ నోటీసు జారీ చేయాలని జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ రవీందర్రెడ్డిని ఆదేశించారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో రద్దీ ఎకువగా ఉంటే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, జడ్పీ సీఈవో రమేశ్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్కుమార్, డీపీవో వీర బుచ్చయ్య, మెప్మా పీడీ రవీందర్, జిల్లా ఇన్చార్జి వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, ఆర్ఎంవో డాక్టర్ శౌరయ్య, జిల్లా క్షయ నివారణాధికారి రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
కొవిడ్ కేర్ సెంటర్లో వసతుల పరిశీలన
విద్యానగర్, ఏప్రిల్ 29: జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ సూల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లో ప్రతి రోజూ సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. క్రీడా పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ను గురువారం ఆయన తనిఖీ చేశారు. భోజనం, వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొవిడ్ కేర్ సెంటర్లోని ప్రతి గదిలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయాలని, పరిసరాలు, టాయిలెట్స్ శుభ్రంగా ఉంచాలని సూచించారు. డ్యూటీ డాక్టర్ను నియమించి, జనరేటర్ ఏర్పాటు చేయాలన్నారు. కొవిడ్ బాధితులు డాక్టర్ సర్టిఫికెట్తో వస్తే అడ్మిట్ చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్, ఆర్డీవో ఆనంద్కుమార్, డీఎస్వో రాజవీర్, తహసీల్దార్ సుధాకర్, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు.