హుజూరాబాద్, సెప్టెంబర్ 7: పద్మశాలీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేరొన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి ఉప ఎన్నికలో తగిన బుద్ధి చెప్పాలని, టీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం పట్టణంలోని సిటీసెంటర్హాల్లో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పద్మశాలీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పట్టణంలో పద్మశాలీల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ప్రభుత్వం ఎకరం భూమి, రూ. కోటి నిధులు కేటాయించగా ఇప్పటికే భూమిపూజ చేసినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలీల సంక్షేమ పథకాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న రూ.74 కోట్ల నిధులు కూడా మంజూరు చేస్తూ జీవో జారీ చేసిందని తెలిపారు. 20 ఏండ్లుగా ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ పద్మశాలీల సంక్షేమాన్ని విస్మరించారని, ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమి అడిగితే పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ నిఖార్సయినా బీసీ బిడ్డ అని, ఈటల పావలా బీసీ అని పేర్కొన్నారు. హుజూరాబాద్లో బీసీనని ఓట్లు దండుకుంటూ హైదరాబాద్లో రెడ్డి పేరుతో చలామణి అవుతాడని ఎద్దేవా చేశారు.
బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పద్మశాలీల ఆర్థిక ఎదుగుదలకు రూ.లక్ష వ్యక్తిగత రుణాల మంజూరు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఊరూరా తిరిగి బట్టలు అమ్ముకునే పద్మశాలీలకు మోపెడ్లను అందజేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. సమావేశం అనంతరం పద్మశాలీలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, నాయకులు స్వర్గం రవి, వేముల యాదగిరి, మెతుకు సత్యం, ఆర్కే రమేశ్, సబ్బని మొగిలి, స్వర్గం నర్సయ్య, సంగెం ఐలయ్య, వాసాల రమేశ్, విడపు రాజు, సీహెచ్ జనార్దన్, తౌటం సంపత్, సబ్బని శివాజీ, కొండ గణేశ్, సబ్బని రాజేందర్, ఎం.వెంకట్రాజం, బీ సదానందం పాల్గొన్నారు.
మమ్ముల పట్టించుకోని ఈటలకు ఓటేయం
పద్మశాలీల గురించి ఏనాడూ పట్టించుకోని ఈటలకు ఓటేయం. పద్మశాలీ భవనం స్థలం కోసం 20ఏండ్లుగా ఈటల వద్దకు వెళ్తే కనీసం మాతో మాట్లాడలె. అతడు చేయని అభివృద్ధిని ఇప్పుడు టీఆర్ఎస్ సర్కారు చేస్తున్నది. ఎన్నో ఏళ్ల మా కలను సీఎం కేసీఆర్ నిజం చేసిండు. అన్నం పెట్టిన చేయిని ఎన్నడూ మరువం. పద్మశాలీలమంతా ఏకమై ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేస్తం.
గెల్లు శీనును గెలిపించుకుంటం
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ కోసం కష్టపడుతం. పద్మశాలీ కులస్తులమంతా ఏకమై టీఆర్ఎస్ను గెలిపించుకుంటం. సీఎం కేసీఆర్ పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి. పద్మశాలీ సంఘం భవనానికి స్థలం ఇచ్చిండు. భవన నిర్మాణానికి నిధులు కేటాయించిండు. సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
పద్మశాలీల మద్దతు టీఆర్ఎస్కే..
పద్మశాలీల మద్దతు టీఆర్ఎస్కే ఉంటది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మా గురించి పట్టించుకోలె. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో ప్రజలందరికీ న్యాయం చేస్తున్నది. ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం మేమంతా కష్టపడుతం. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి పథకం అందుకుంటున్నవారిలో పద్మశాలీల వాటా కూడా ఎక్కువగా ఉన్నది.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం
హుజూరాబాద్లో పద్మశాలీ సంఘ భవన నిర్మాణానికి స్థలంతో పాటు నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్కు రుణపడి ఉంటం. గతంలో ఏ ప్రభుత్వం కూడా మా సంఘం భవనానికి నిధులివ్వలేదు. అడుగగానే ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికే మా మద్దతు ఉంటుంది. ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం కలిసికట్టుగా పని చేస్తం.