భవిష్యత్లో దేశానికి, తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని, నూతన ఆవిష్కరణలకు తెలంగాణే నాంది అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. దేశవ్యాప్త అభివృద్ధి టీఆర్ఎస్(బీఆర్ఎస్)తోనే సాధ్యమని, రోల్ మోడల్గా నిలిచిన తెలంగాణే అందుకు నిదర్శనమన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 119 కోట్లతో నిర్మించనున్న పెద్దపల్లి-కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి, 1.52 కోట్లతో పెద్దపల్లి కమాన్ నుంచి జెండా చౌరస్తా వరకు నిర్మించే నాలుగులేన్ల రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే 1.82 కోట్లతో నిర్మించిన రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు. దేశాన్ని అరవైఏండ్ల పాటు పాలించి చేతకాని దరిద్రపు, దద్దమ్మగా కాంగ్రెస్ పార్టీ మారితే.. దేశాన్ని పూర్తిగా దోచుకుని, గుజరాత్ దోస్తులకు పెడుతున్న పార్టీ బీజేపీ అని ధ్వజమెత్తారు.
పెద్దపల్లి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి : 60 ఏండ్లు పాలించినా దేశాన్ని అభివృద్ధి చేయలేని దద్దమ్మ కాంగ్రెస్ అని, ఎనిమిదేండ్లలో దేశాన్ని దోస్తులకు దోచిపెడుతున్న పార్టీ బీజేపీ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. సోమవారం పెద్దపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల అనంతరం ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందన్నారు. దేశంలో పదింటిని ఉత్తమ గ్రామాలుగా ఎంపిక చేయాలని నిర్ణయిస్తే ఎంపికైన 10 తెలంగాణలోనివేనని, అయితే, మొత్తం తెలంగాణ గ్రామాలే వస్తున్నాయని మళ్లీ 20 గ్రామాలను ఎంపిక చేస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణవే రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం అవార్డులను ఇచ్చిందన్నారు. దేశవ్యాప్త అభివృద్ధి ఒక్క టీఆర్ఎస్(బీఆర్ఎస్)తోనే సాధ్యమవుతుందన్నారు.
నిత్యం నీతిని వల్లె వేస్తూ.. జై శ్రీరాం అంటూ దేవుడిని కొలుస్తూనే దేశాన్ని దివాళా తీయిస్తున్నారని బీజేపీపై మంత్రి వేముల మండిపడ్డారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి దేశంలోని అన్ని రకాల వనరులను గుజరాత్ దోస్తులు అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. వీరి అవినీతి దేశ సరిహద్దులు దాటి విదేశాల్లోకి కూడా విస్తరించిందని, దీనికి తాజాగా, జరిగిన అవినీతి అక్రమాలను ప్రత్యేకంగా వివరించారు. బడా పారిశ్రామిక వేత్తలకు 12 లక్షల కోట్లను మాఫీ చేసి బ్యాంకులను దివాళా తీయించారని మండిపడ్డారు. 15 ఏండ్ల క్రితం కాంగ్రెస్ హయాంలో 2జీ స్ప్రెక్టంను 1,78,000 కోట్లకు విక్రయిస్తే అవినీతి జరిగిందన్న అప్పటి ముఖ్యమంత్రి మోదీ.. తాను ప్రధాని అయ్యాక 5జీ స్ప్రెక్టంను 1,48,000 కోట్లకే విక్రయించాడని తెలిపారు. ఈ ఒక్క వ్యవహారంలోనే మోదీ 10 లక్షల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని స్పష్టంగా అర్థమవుతున్నదని చెప్పారు. 2జీకి, 5జీకి ధర పెరుగుతుందా..? తగ్గుతుందా..? ప్రజలు ఆలోచించాలన్నారు.
ఆర్ఎస్ఎస్ రాంమాధవ్తో మాట్లాడించి శ్రీలంకలో పవర్ ప్రాజెక్టును అదానీకి ఇప్పించారని, ఆస్ట్రేలియా ప్రధానితో మాట్లాడి బొగ్గు బావులను ఇప్పించారని విమర్శించారు. సింగరేణి బొగ్గు టన్నుకు మనం 3 వేలు, 4 వేలకు కొంటుంటే.. అలా వద్దు.. ఆస్ట్రేలియా బొగ్గును 26 వేలకు టన్ను చొప్పున కొనాలంటున్నారని, ఆస్ట్రేలియా బొగ్గు కొంటే ఒక్కో టన్నుకు 23 వేల చొప్పున మోదీ, షాకు ముడుతాయన్నారు. ఇలా వారు దేశాన్ని పూర్తిగా దోచుకుతింటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నదని, ఆయనే దేశానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. బీజేపీ అవినీతి అక్రమాలను దేశ ప్రజలకు వివరించేందుకు కేసీఆర్ బీఆర్ఎస్తో ముందుకు కదులుతున్నారన్నారు.
దాంతో మోదీ, షా కింద నేల కదులుతున్నదని, అందుకే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా అభూత కల్పనలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు జిల్లాకు 1478 కోట్లు విడుదలయ్యాయని, అందులో 680 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయన్నారు. జూలపల్లి, ఓదెల, ఎలిగేడు నుంచి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాష్ట్ర ప్రజల కన్నీటి కష్టాలను తీర్చింది ఆయనేనని చెప్పారు. ‘పెద్దపల్లి ఏనాడైనా జిల్లాగా ఏర్పడుతుందని కలగన్నామా?.. జిల్లా కేంద్రంలో ఇలా రాష్ట్ర సచివాలయం మాదిరిగా కలెక్టరేట్ను నిర్మించుకుంటామని అనుకున్నామా..?’ అని ప్రశ్నించారు. దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని అనేక సమస్యలకు పరిష్కారం చూపింది టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అని, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకున్న తర్వాత సాగునీటి కష్టాలు తీరాయని, వరద కాల్వ కళకళలాడుతున్నదని, ఎస్సారెస్పీ తిరిగి జీవం పోసుకున్నదని పేర్కొన్నారు. సాగు నీరు వచ్చే పరిస్థితులు నెలకొనడంతో సాగు విస్తీర్ణంతో పాటుగా పంట దిగుబడి పెరిగిందన్నారు. దేశంలో వరిధాన్యాన్ని కొనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ఆర్వోబీ నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయం, పారిశ్రామిక, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, రైల్వే కోచ్ ఇవ్వాలని పార్లమెంటులో తెలంగాణ ఎంపీలం గొంతెత్తి మొత్తుకున్నా ప్రధాని పట్టించుకోలేదని వాపోయారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో హామీ ఇచ్చిన ఐటీఐఆర్ ఇచ్చినట్టే ఇచ్చి గుజరాత్కు తరలించుకుపోయారని తెలిపారు.
అభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరించే కాంగ్రెస్ నాయకులు నీతి నిజాయితీ గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని, జరిగిన అభివృద్ధి అంతా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) హయాంలోనేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు చేసే ఆరోపణలను పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
పెద్దపల్లి నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుంచి ఎంతో మంది నేతలు ఎమ్మెల్యేలు అయినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, దశాబ్దాలుగా జరగని అభివృద్ధి ఈ 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలోనే జరిగిందని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. గతంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్క ప్రయత్నం కూడా జరగలేదన్నారు. పెద్దపల్లి అభివృద్ధిపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక దృష్టి ఉందని, అందుకే జిల్లా చేశారని తెలిపారు. పెద్దపల్లి వాసుల ఇబ్బందులు తీర్చుతున్న ముఖ్యమంత్రికి ఇక్కడి ప్రజలు రుణపడి ఉంటారని చెప్పారు.