హుజూరాబాద్(జమ్మికుంట), జూన్ 14: రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నడిపిస్తూ దేశంలోనే నంబర్ 1 సీఎంగా కేసీఆర్ ఉన్నారని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి ప్రశంసించారు. పట్టణంలోని శంకరనందన గార్డెన్లో బుధవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మోత్కులగూడెం చౌరస్తా నుంచి శంకరనందన గార్డెన్ వరకు బతుకమ్మలతో వైద్య సిబ్బంది, మహిళలు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ, తాను వేంకటేశ్వరస్వామి భక్తుడని అయితే కనిపించే వేంకటేశ్వరస్వామి తనకు కేసీఆర్ మాత్రమేనని, ఇంకా రెండో వేంకటేశ్వరస్వామి వైద్యులని కొనియాడారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం అయిన 24153 మంది మహిళలకు కేసీఆర్ కిట్లు అందించామని, ఇందుకోసం రూ. 7 కోట్ల 90 లక్షల 35 వేలు ప్రభుత్వం ఖర్చుపెట్టిందని తెలిపారు.
హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో రూ.10 కోట్లతో, జమ్మికుంట దవాఖానలో రూ. 5కోట్లతో సకల సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. అలాగే, వీణవంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రూ.78 లక్షలతో అభివృద్ధి చేసి 24 గంటల వైద్యం అందించడంలో ప్రభుత్వం సఫలమైందన్నారు. ఇవే కాకుండా ఇతర పీహెచ్సీలు, సబ్హెల్త్సెంటర్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి చిత్తశుద్ధి చాటుకుందన్నారు. హుజూరాబాద్ దవాఖానలో రోజుకు 20 మందికి డయాలసిస్ చేస్తున్నారని, వందల మంది అవుట్ పేషెంట్లు వచ్చి చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. కంటి వెలుగు దేశంలోనే గొప్ప కార్యక్రమమని, నియోజకవర్గంలో లక్షా 90 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, సుమారు 30వేల మందికి ఉచితంగా కళ్లద్దాలు అందజేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా 17 వేల మందికి రూ. 70 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు.
మహిళా సంఘాలకు రూ. 100 కోట్ల రుణం కావాలని కేసీఆర్ కోరితే రూ.230 కోట్లు ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారని కొనియడారు. కరోనా కాలంలో వైద్యుల సేవలు అభినందనీయని, వారందరికీ హాట్సప్ అన్నారు. అనంతరం పలువురు గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందజేశారు. అలాగే, ఉత్తమ సేవలందించిన వైద్యులు, నర్సులు, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బందిని ఆయన శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఆర్డీవో హరిసింగ్, జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, ఎంపీపీలు ఇరుమళ్ల రాణి, ముసిపట్ల రేణుక, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్లు గందె రాధిక, తకల్లపల్లి రాజేశ్వరరావు, సింగిల్ విండో చైర్మన్లు ఎడవెల్లి కొండాల్ రెడ్డి, పొనగంటి సంపత్, డిప్యూటీ డీఎంహెచ్వో చందులాల్, సూపరింటెండెంట్లు రాజేందర్రెడ్డి, రమేశ్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైద్యసిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.
హుజూరాబాద్టౌన్, జూన్ 14: హుజూరాబాద్ ఏరియా దవాఖానలో కార్పొరేట్కు దీటుగా పేదలకు వైద్య సేవలందిస్తున్నట్లు ప్రభుత్వ విప్ పాడి కౌశిక్రెడ్డి పేరొన్నారు. హుజూరాబాద్ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన చైల్డ్ కేర్ సెంటర్ను ఆయన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. దవాఖానలోని అన్ని వార్డులను కలియ తిరిగి పరిశీలించారు. అనంతరం పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ, తొమ్మిదేళ్లలో హెల్త్ బడ్జెట్ను రెండున్నర రేట్లు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పేరొన్నారు. హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసి వైద్య సేవలందిస్తున్నట్లు తెలిపారు. దవాఖానలో రోగులకు, గర్భిణులకు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు.మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక-శ్రీనివాస్, ఎంపీపీ ఇరుమల్ల రాణి-సురేందర్రెడ్డి, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ రాజేందర్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో చందు, సీనియర్ వైద్యులు శ్రీకాంత్రెడ్డి, నారాయణరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.