కొత్తపల్లి, ఆగస్టు 17: రాష్ట్రంలోని దళిత కుటుంబాలతోపాటు ప్రభుత్వ ఉద్యోగం చేసే దళితులకు సైతం దళితబంధు పథకం వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంపై ఆ వర్గం ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఉమ్మడి జిల్లా పరిధిలో సంబురాలు చేసుకుని, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో, జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా ఉద్యోగ ఐక్య కార్యాచరణ సంఘం చైర్మన్ బోగ శశిధర్, కో చైర్మన్ ఎండీ వకీల్, టీఎన్జీవో సంఘం జిల్లా కార్యదర్శి గూడ ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. రాజన్న సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెద్దపల్లిలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ శంకర్ ఆధ్వర్యంలో అంబేద్కర్, సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయగా, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఉద్యోగ సంఘం నాయకులు మాట్లాడుతూ, దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, ఇప్పుడు దళిత బంధు పథకం వర్తింపజేసి చరిత్రలో నిలిచారని కొనియాడారు. కరోనా కష్టకాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం వేతన సవరణ చేసి అండగా నిలిచారని కీర్తించారు. టీఎన్జీవోల సంఘం కృషిని, చరిత్రను అసెంబ్లీలో ప్రస్తావించి యావత్ తెలంగాణ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పారని పేర్కొన్నారు.
దళితుల బతుకుల్లో వెలుగులు
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధుతో దళితుల బతుకుల్లో వెలుగులు నిండుతయ్.. ఈ నిర్ణయం దేశచరిత్రలో నిలిచిపోతుంది. ఇన్నాళ్లు అన్నింటా వెనుకబడ్డ దళితులకు ఈ స్కీం చోదకశక్తిగా మారుతుంది. ఎస్సీ ఉద్యోగులకు వర్తింపజేయడం సంతోషకరం. ముఖ్యమంత్రి మరోసారి ఉద్యోగుల పక్షపాతిగా నిలిచిండు..
ఉద్యోగులకు వర్తింపు చరిత్రాత్మకం
దళిత ఉద్యోగులకు సైతం దళిత బంధును వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం దేశ చరిత్రలో నిలిచిపోతుంది. దీంతో రాష్ట్రంలో 40 వేల మంది, జగిత్యాల జిల్లాలో సుమారు 2600 మంది ఎస్సీ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. మేలు చేసిన సర్కారుకు అండగా ఉంటం.
ఉద్యోగుల పక్షపాతి
తెలంగాణ ఉద్యమంలో వెంట నడిచిన ఉద్యోగులను సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి పక్షపాతిగా నిలిచారు. ఏ ప్రభుత్వంలో కూడా ఉద్యోగులకు ఇంత మంచి పథకాలు వర్తించలేదు. ప్రభుత్వ ఉద్యోగులంటే సంక్షేమ పథకాలకు అనర్హులుగా తేల్చేవారు. సీఎం కేసీఆర్ వచ్చిన తరువాతనే ఉద్యోగులకు మేలు జరిగింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారు. ఉద్యోగులు అడగకుండానే రైతు బంధు, రైతు బీమా, ఇప్పుడు దళిత బంధు వర్తింప చేసి మరోమారు కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. దళితబంధుతో దళిత ఉద్యోగులకు మేలు జరుగడం చాలా సంతోషం.
విప్లవాత్మక మార్పులు వస్తాయి
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితుల గురించి ఆలోచించే నాయకుడు ఉన్నాడంటే ఒక్క సీఎం కేసీఆరే మాత్రమే. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో దళితులకు రిజర్వేషన్లు వస్తే, వారి అభివృద్ధికి సీఎం తీసుకుంటున్న చర్యలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. దళితబంధు పథకంతో వారి కుటుంబాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. దేశానికి ఈ పథకం మార్గదర్శకంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.