కలెక్టర్ ఆర్వీ కర్ణన్ క్యాంప్ ఆఫీస్లో అధికారులతో సమావేశం
కరీంనగర్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో దళితబంధు కింద ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో దళితబంధు గ్రౌండింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాడి పరిశ్రమ యూనిట్లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు ముందుగా 50 శాతం నగదును విడుదల చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్కు సూచించారు. పాడి గేదెల కొనుగోలుకు లబ్ధిదారులను బ్యాచ్ల వారీగా తమిళనాడు, హర్యానా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు తీసుకెళ్లి గేదెలు కొనుగోలు చేయించాలని కరీంనగర్ డెయిరీ, విజయ డెయిరీ అధికారులను ఆదేశించారు. ట్రాన్స్పోర్ట్ వాహనాలను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు ముందుగా 50శాతం నగదు విడుదల చేసి యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని ఉప రవాణాశాఖ కమిషనర్ను ఆదేశించారు. ఈ నెల 14లోగా 90 శాతం యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని, దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, ఉప రవాణాశాఖ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్, నెహ్రూ యువ కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ రాంబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, పశుసంవర్ధక శాఖ అధికారి నరేందర్, హుజూరాబాద్ ఎంవీఐ సిరాజ్ మహ్మద్, కరీంనగర్, విజయ డెయిరీల ప్రతినిధులు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.