కరువు పరిస్థితులు కమ్ముకుంటున్న వేళ తాగునీటికి కొరత లేకుండా రాష్ట్ర సర్కారు ముందుచూపుతో వ్యవహరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఏడాది పాటు ఎలాంటి ముప్పు రాకుండా చేసింది. వచ్చే రెండు నెలల్లో మంచినీటి సమస్య ఎదురుకావొచ్చనే సంకేతాలు రావడం, ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, జలాశయాల్లో నీటి నిల్వ అంతగా లేకపోవడంతో ముందుగానే అప్రమత్తమైంది. ఇప్పటికే కాళేశ్వరం జలాలను జలాశయాల్లో పుష్కలంగా నిల్వ చేసి, ఎలాంటి ఆటంకం లేకుండా మిషన్ భగీరథ కింద ఇంటింటికీ స్వచ్ఛమైన జలం అందిస్తున్నది. నిజానికి గోదావరి జలాలు రాకపోయి ఉంటే వచ్చే ఆగస్టు మొదటి వారంలో తాగునీటికి ఇబ్బంది ఏర్పడేది. కానీ, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఏడాది దాకా ఢోకా లేకుండా పోయింది.
కరీంనగర్, జూలై 6 (నమస్తే తెలగాణ ప్రతినిధి) : దేశ వ్యాప్తంగా వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు, ఈ సీజన్లో పెద్దగా వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటికి కట కట ఏర్పడింది. కానీ, ఉమ్మడి జిల్లాలో మాత్రం తాగునీటికి ఎటువంటి ముప్పు లేదు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ సీజన్లోనే కాదు, ఏడాదిపాటు ఎటువంటి ఢోకా ఉండదని అధికారులు చెబుతున్నారు. నిజానికి ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 7,16,084 కుళాయిల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నీటిని అదనంగా ఇస్తున్నారు. గతంలో గ్రామంలో ఒక్కో వ్యక్తికి రోజుకు 40 లీటర్లు సరఫరా చేయగా, మిషన్ భగీరథ కింద వంద లీటర్లు ఇస్తున్నారు. మున్సిపాలిటీల్లో గతంలో వంద లీటర్లు ఇవ్వగా, దానిని 135 లీటర్లకు పెంచి సరఫరా చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో గతంలో రోజుకు 100 లీటర్లు ఇవ్వగా, వాటిని 150 లీటర్లకు పెంచి సరఫరా చేస్తున్నారు. నిజానికి మిషన్ భగీరథ అమల్లోకి రాక ముందు ఉమ్మడి జిల్లాలో రోజుకు 2.5 టీఎంసీలు మాత్రమే నీటికి వినియోగించేవారు. కానీ, ప్రస్తుతం ఆ డిమాండ్ 8టీంఎసీలకు పెరిగింది.
గతంలో నిత్యం గొడవలే..
కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముఖచిత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే.. నాటి సమైక్య రాష్ట్రంలో తాగునీటికి శాశ్వత నీటి సోర్సు లేదు. 85 శాతం గ్రామాలు, ఇతర ప్రాంతాలకు బోర్లు, మంచినీటిబావులు, వాగులవంటివి సోర్సుగా ఉండేవి. ఇవన్నీ ఎండాకాలానికి ముందే ఎండిపోయేవి. దీంతో మెజార్టీ గ్రామాల్లో నీటి కోసం ఇబ్బందులు ఏర్పడేవి. అందుకోసం వేసవికాలం రాగానే అధికారులు ప్రణాళిక రూపొందించడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడానికి సుమారు ఏటా 7 నుంచి 8 కోట్ల దాకా ఖర్చు పెట్టేవారు. అయినా ఏ ఇంటికీ తాగునీరు సరిగా అందేది కాదు. గ్రామాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ముఖ్యంగా తండాల్లో అనేక ఆగచాట్లు పడేవారు. మున్సిపల్ పరిధిలో శివారు కాలనీల పరిస్థితి దారుణంగా ఉండేది. ట్యాంకర్ ఎప్పుడు వస్తుందో తెలియక మహిళలు ఇబ్బందులు పడేవారు. ప్రధానంగా అనాటి పాలకులకు అవగాహన లేకపోవడం, శాశ్వత నీటి సోర్సును తాగునీటికి వినియోగించాలన్న జిజ్ఞాస లోపించడం, అందుకు అనువైన ప్రణాళికలు చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
తాగునీటికి ఇబ్బందులు తప్పినయ్
గతంలో మా గ్రామంలో మంచినీటి కోసం ఆడబిడ్డలు ఇబ్బందులు పడేవారు. బిందెలు పట్టుకొని గొడవలు చేసిన రోజులు ఉన్నయ్. కనీసం వీధికొక బోర్ మోగర్ కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి గత ప్రభుత్వాలది. కానీ. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటికీ మంచినీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇంటింటికీ నల్లా కలెక్షన్ ఇచ్చి మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన నీటిని అందిస్తున్నరు. ఆడబిడ్డలు నీటి కోసం బిందె పట్టుకొని రోడ్డుకు వెళ్లే పరిస్థితే లేదు ఇప్పుడు. ప్రతినిత్యం ట్యాంకులను శుభ్రపరుస్తూ లీకేజీలను పరిశీలిస్తున్నం. మా గ్రామంతో పాటు మండలంలో చాలా గ్రామాల ప్రజలు ఎండకాలంలో చాలా ఇబ్బందులు పడేవారు. ఎండకాలం వచ్చిందంటే ప్రజాప్రతినిధులకు పెద్ద తలవొప్పి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
– రావుల రమేశ్, సర్పంచ్, నుస్తులాపుర్(తిమ్మాపూర్)
ఎండకాలం వచ్చిందంటే నీటి సమస్య ఉండేది..
నాడు ఎండకాలం వచ్చిందంటే తాగునీటి కోసం ప్రజలు రోడెకిన దుస్థితి ఉండేది. కొలిమికుంటలో నీటి సమస్య తీవ్రంగా ఉండేది. బావుల్లో నీళ్లు లేక, బోర్లలో నీళ్లు రాక వేరే చోటకెళ్లి నీళ్లు మోసుకొచ్చేది. నీటి కోసం ఎంతోమంది బిందెలు వరుసలో పెట్టి గంటలపాటు వేచి చూసేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ తేవడంతో తాగునీటి సమస్యకు పరిష్కారం దొరికింది. గ్రామంలో ఇంటింటికీ నల్లానీరు అందిస్తుండడంతో ప్రజల తాగునీటి కష్టాలు దూరమయ్యాయి. ఎండకాలంలో కూడా ఎలాంటి సమస్య లేకుండా పోయింది. సీఎం కేసీఆర్కు సర్పంచుల అందరి తరపున ధన్యవాదాలు.
ముందు జాగ్రత్త
ఉమ్మడి జిల్లాలో మిషన్ భగీరథ కింద చేపట్టిన పనులు, శాశ్వత నీటి సోర్సులు, ఏర్పాటు చేసిన వాటర్ గ్రిడ్ వల్ల తాగునీటికి ఢోకా లేకుండా పోయింది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నా..? కాళేశ్వరం జలాలు వస్తున్న నేపథ్యంలో ఏడాది దాకా తాగునీటికి ఢోకా ఉండదని స్పష్టం చేస్తున్నారు. తాత్కాలిక నీటి సోర్సులు కాకుండా.. శాశ్వత నీటిసోర్సులు ఏర్పాటు చేయడం, అలాగే అన్ని రిజర్వాయర్లకు కాళేశ్వరం జలాలు తరలించి వాటిని నింపుకునేలా ప్రణాళికలు చేయడం, వాటిని ఆచరణలో పెట్టడం వల్ల భవిష్యత్లోనూ ఉమ్మడి జిల్లావాసులకు నీటి కొరత లేకుండా ఉండనున్నది.
డిమాండ్కు అనుగుణంగా..
పెరిగిన నీటి డిమాండ్ను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు సమకూర్చింది. గతంలో మాదిరిగా కాకుండా శాశ్వత నీటి సోర్సును ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో గ్రిడ్స్ను ఏర్పాటు చేశారు. సిరిసిల్ల-వేములవాడ-చొప్పదండి నియోజకవర్గాలకు మధ్య మానేరు నుంచి, కోరుట్ల-జగిత్యాల-ధర్మపురికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి, పెద్దపల్లి-రామగుండం-మంథనికి ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ను, మానకొండూరు-మానకొండూరు-హుజూరాబాద్-హుస్నాబాద్ నియోజకవర్గాలకు లోయర్ మానేరు డ్యాం నుంచి నీటిని ఇస్తున్నారు. ప్రస్తుతం తాగునీటికి వినియోగిస్తున్న రిజర్వాయర్ల పరిధిలోకి కాళేశ్వరం జలాలు వచ్చి చేరుతున్నాయి. మరికొన్ని రిజర్వాయర్లలోకి నెల రోజుల క్రితమే కాళేశ్వరం జలాలు తరలించి నిల్వ ఉంచారు. ఆయా జలాశయాల మట్టాలను ఒకసారి పరిశీలిస్తే.. శ్రీరాంసాగర్లో 20 టీంఎసీలు, మధ్యమానేరులో 17 టీఎంసీలు, లోయర్మానేరు డ్యాంలో 7, ఎల్లంపల్లిలో 11 టీఎంసీలున్నాయి. దీనిని తోడు ప్రస్తుతం కాళేశ్వరం జలాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో ఈ రిజర్వాయర్ల మట్టాలు మరింత పెరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో తాగునీటికి ఎటువంటి ఢోకా ఉండదని అధికారులు చెబుతున్నారు.