కాళేశ్వర జలాలతో యాసంగి సాగు బంగారం
18 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు సన్నద్ధం
సీఎం కేసీఆర్ పెద్దమనసుతో గ్రామాలవారీగా కేంద్రాలు
మొదలైన కొనుగోళ్లు.. ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు
వారం నుంచి తరలివస్తున్న ధాన్యం
ఈ వారం నుంచి వడ్ల రాశులతో పోటెత్తనున్న సెంటర్లు
కరీంనగర్, మే1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):కాళేశ్వరం జలాలతో ఈ యాసంగిలో బంగారంలాంటి పంట పడింది. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా దిగుబడి వస్తున్నది. అయితే, కరోనా నేపథ్యంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడగా, ఆపత్కాలంలోనూ అన్నదాతకు రాష్ట్ర సర్కారు అభయమిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారయంత్రాంగం, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని అంచనా వేసింది. ఇప్పటికే గ్రామాల వారీగా కొనుగోళ్లను ప్రారంభించింది. వారం నుంచే సెంటర్లకు ధాన్యం వస్తుండగా, గత నెల 29 వరకు 11791 మంది రైతుల నుంచి 186కోట్ల విలువైన దిగుబడులు కొన్నది. ఈ మొదటి వారం నుంచి సెంటర్లు వడ్ల రాశులతో పోటెత్తే అవకాశముండగా, క్షేత్రస్థాయిలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నది. కొవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం కేంద్రాలకు ధాన్యం తేవాలని రైతులకు సూచిస్తున్నది.
ఇది కరోనా కాలం. ఎక్కడ చూసినా భయంభయం. ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటేనే వణుకు. ఇలాంటి సమయంలో రైతులది ఆందోళనకర పరిస్థితి. బంగారంలా పండిన యాసంగి పంటలను ఎలా అమ్ముకోవాలో తెలియని స్థితి. కానీ, రాష్ట్ర సర్కారు ఎప్పటిలాగే అన్నదాతపై పెద్దమనసు చూపింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా గొప్ప కార్యక్రమం చేపట్టింది. గత మూడు సీజన్లలాగే ఈసారి పల్లెపల్లెనా ధాన్యం కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పగా, జిల్లాల వారీగా అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే గ్రామాల వారీగా కొనుగోళ్లను ప్రారంభించి, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.
నాడు యాసంగి వచ్చిందంటే తాగునీటికే తండ్లాట ఉండేది. ఇక సాగునీటి సంగతి దేవుడెరుగు. వేసిన పంటలు చేతికి వస్తాయో? రావో? తెలియని పరిస్థితి. ఇక మెట్టప్రాంతాల్లోనైతే రెండో పంటపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ, నేడు ఉమ్మడి జిల్లా నలుమూలలా కాళేశ్వరం జలాలు పారుతున్నాయి. ప్రధాన ప్రాజెక్టులు నిండుగా మారగా, చెరువులు మత్తడి దుంకుతున్నాయి. అత్యంత మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎగువమానేరు కూడా ప్రస్తుతం మత్తడి దూకడం ఆ ప్రాజెక్టు చరిత్రలోనే మొదటిసారి. వీటితోపాటు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం, శ్రీ రాజరాజేశ్వర జలాశయం, లోయర్ మానేరు డ్యాంలకు గోదావరి జలాలు రావడంతో చివరి ఆయకట్టు వరకూ నీరు పారింది. ఎక్కడా సాగుకు ఢోకా లేకపోవడంతో పంట మస్తుగా పండింది. ప్రస్తుతం వస్తున్న దిగుబడులను చూస్తేనే అర్థమవుతున్నది.
ఊపందుకుంటున్న కొనుగోళ్లు
యాసంగి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి జిల్లాలో ఈసారి 9.12 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. ఇందులో 22.17 లక్షల మెట్రిక్టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కొనుగోళ్లకు సిద్ధమైన అధికారులు, రైతులకు ఎక్కడా ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1306 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించగా.. ఇప్పటి వరకు 1288 ఏర్పాటు చేశారు. మిగిలిన కేంద్రాలను అవసరాన్ని బట్టి ఏర్పాటు చేయడమే కాదు, ఇంకా అవసరమైతే మరిన్ని పెంచడానికి అంతా సిద్ధం చేశారు. వారం నుంచి కొనుగోళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అధికారుల అంచనా ప్రకారం.. ఈ నెల మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ పంటలు కోతకు వచ్చాయి. మిషన్ల ద్వారా రోజుకు వందలాది ఎకరాలు కోయడానికి అవకాశమున్నది. ఈ నేపథ్యంలో ధాన్యం భారీగా కొనుగోలు కేంద్రాలకు రానున్నది. అందుకనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా జిల్లాల వారీగా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
సహకారమే.. పెద్ద సాయం
కొనుగోళ్ల విషయంలో కేంద్రం మోకాలడ్డినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రైతు పక్షపాతిగా ముందుకు సాగుతున్నారు. నీళ్లు, కరెంటు, రైతు బంధు, బీమా ఇవ్వడమే కాదు, రైతు పండించిన పంటను సైతం మద్దతు ధరకు కొని తీరుతామని ఇప్పటికే ప్రకటించారు. అయితే, గత కొనుగోళ్లకు ఇప్పటి కొనుగోళ్లకు మధ్య పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గతంలో ఈ సీజన్ వచ్చిందంటే.. యావత్తు అధికార యంత్రాగం కొనుగోళ్లపైనే ప్రత్యేకంగా దృష్టిపెట్టేది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఓవైపు టీకా విధులు, మరోవైపు పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వస్తున్నది. ఇవేకాకుండా కరోనా బాధితులకు అందించాల్సిన సౌకర్యాల వంటి వాటిని దగ్గరుండి చూడాల్సి వస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే.. అధికారులు ప్రస్తుతం బహుముఖ విధులు నిర్వహించాల్సిన పరిస్థితులున్నాయి. ఈ సమయంలో ఎవరో చెడగొట్టే వాళ్ల మాటలు నమ్మకుండా.. చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చూపి ఇబ్బందులు పెట్టే వాళ్ల వైపు ఆకర్షితులు కాకుండా.. రైతులు సహనం పాటిస్తే అదే పెద్ద సహకారం చేసినట్లు అవుతుంది. ‘అమ్మ పెట్టదు.. అడుక్క తిననివ్వదు’ అన్న సామెత చందంగా ప్రతిపక్షాలు.. చిన్న చిన్న సమస్యలుంటే చాలు వాటిని భూతద్దంలో పెట్టిచూపాలని ప్రయత్నం చేస్తాయి. ఇటువంటి వాటిపై అన్నదాతలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమున్నది. అలాగే, ఒకేసారి మార్కెట్కు పోటెత్తకుండా.. వ్యవసాయ అధికారులు ఆయా గ్రామాలకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెస్తే కొనుగోళ్లు సజావుగా సాగుతాయి. తద్వారా అన్నదాతలు ఎక్కువ సేపు కొనుగోలు కేంద్రాల వద్ద ఉండాల్సిన అవసరముండదు. కరోనాకు దూరంగా ఉండడమే కాదు.. వ్యయ ప్రయాసలకులోను కాకుండా ఉంటారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ అన్నదాతలను ఇబ్బంది పెట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొంటున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రమాణాలు తప్పనిసరి
కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక ఒత్తిళ్లకు లోను చేస్తున్నది. అయినా ‘రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు’ అనే నానుడిని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్… ఈసారి కూడా మద్దతు ధరకు కొనేందుకు నిశ్చయించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రమాణాలు పాటిస్తే.. క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే అవకాశముంటుంది. ఎఫ్సీఐ నాణ్యతా ప్రమాణాల ప్రకారం.. తేమ 17 శాతం లోపు ఉండాలి. అలాగే, చెత్త 1 శాతం, మట్టి పెల్లలు 1 శాతం, చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం 5 శాతం, పూర్తిగా తయారు కాని, ముడుచుకుపోయిన ధాన్యం 3 శాతం తక్కువ రకాల మిశ్రమం 6 శాతం చొప్పున ఉన్న ధాన్యానికి కనీస మద్దతు ధర 1,888 చెల్లిస్తారు. సాధారణ రకానికి 1,866 చెల్లిస్తారు. మద్దతు ధర పొందాలంటే ప్రమాణాలు పాటించడం అత్యంత ముఖ్యం. దీని వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద సమస్య తలెత్తే అవకాశమే ఉండదు. అధికారులు కూడా పదే పదే ఈ విషయంపై నొక్కి చెబుతున్నారు. ధాన్యం తెచ్చే ముందు అన్ని ప్రమాణాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.