కరీంనగర్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలోని గోదాముల్లో బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. జిల్లా కేంద్రంలోని గోదాంగడ్డలో 32,968 మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న కేంద్ర గిడ్డంగుల సంస్థ (సీడబ్ల్యూసీ- సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్) ఉంది. ఇందులో 7 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాములను రిలయన్స్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల కోసం లీజ్కు ఇచ్చింది. ఇక మిగిలిన 25,968 మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాముల్లో ఎఫ్సీఐకి కేటాయించిన 18,792 మెట్రిక్ టన్నుల స్పేస్లో.. గత మార్చి నుంచి 18,400 మెట్రిక్ టన్నుల బియ్యం మూలుగుతున్నాయి. ఇక మిగిలిన స్పేస్లో కరీంనగర్ జిల్లా సివిల్ సప్లయ్స్కి 4,176 మెట్రిక్ టన్నుల స్పేస్ కేటాయిస్తే.. ఈ రోజు వరకు 3,500 మెట్రిక్ టన్నులు రారైస్ను స్టోర్ చేశారు. సిరిసిల్ల సివిల్ సప్లయ్కు 3 వేల మెట్రిక్ టన్నుల స్పేస్ కేటాయిస్తే.. ఈ రోజు వరకు 2,400 మెట్రిక్ టన్నుల రారైస్ను నిల్వ ఉంచారు. ఇక ఈ గిడ్డంగిలో మిలింది కేవలం 1,668 మెట్రిక్ టన్నుల స్టోర్ చేసుకునే స్పేస్ మాత్రమే ఉన్నది. సోమవారం గోదాముకు వెళ్లి పరిస్థితిని పరిశీలించగా, జిల్లాలోని పలు రైస్ మిల్లుల నుంచి బియ్యంతో వచ్చిన 30కిపైగా లారీలు అన్లోడ్ కాకుండా ఉన్నాయి. నాలుగైదు రోజులుగా ఇక్కడే ఉంటున్నాయి. ఈ రెండు రోజుల్లో మిగిలిన స్పేస్లో బియ్యం నిల్వ చేసినట్లయితే కరీంనగర్లోని సీడబ్ల్యూసీ గోదాములు పూర్తి స్థాయిలో నిండిపోయే పరిస్థితి ఉన్నది.
ఆరు నెలలుగా బియ్యం ఇక్కడే..
కరీంనగర్లోని సీడబ్ల్యూసీ గోదాములో రెండు యాసంగి సీజన్ల నుంచి నిల్వ చేస్తున్న పారాబాయిల్డ్ బియ్యం ఉంటున్నాయి. గత మార్చిలో కూడా పెద్ద మొత్తంలో పారాబాయిల్డ్ స్టోర్ అయ్యాయి. ఆరు నెలల కింద ఒక వ్యాగన్ ఇచ్చిన ఎఫ్సీఐ అప్పటి నుంచి పారాబాయిల్డ్ కోసం ఒక్క వ్యాగన్ కూడా కేటాయించ లేదు. దీంతో ఎఫ్సీఐకి కేటాయించిన స్పేస్లో ఇప్పటికీ 18,400 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు అలాగే ఉన్నాయి. ఈ గోదాంలో మూలుగుతున్న రా రైస్ నిల్వలను తరలించేందుకు నెల క్రితం ఒక వ్యాగన్ కేటాయించినా.. ఆ తర్వాత ఒక్కటీ కేటాయించ లేదు. నిజానికి ప్రతి సీజన్లో ఎప్పటి స్టాక్ అప్పుడు తరలించేందుకు ఎఫ్సీఐ వ్యాగన్లు కేటాయించాల్సి ఉంటుంది. కానీ, ఈ గోదాముకు నెలల తరబడి వ్యాగన్లు కేటాయించని పరిస్థితి నెలకొన్నది. ఇటు సివిల్ సప్లయ్స్ సంస్థకు కేటాయించిన బియ్యాన్ని నెలకోసారి తీసుకెళ్తున్నా.. ఆ స్థానంలో ఈ సీజన్లో వచ్చే బియ్యం మళ్లీ భర్తీ అవుతున్నాయి. ఈ గోదాంలో నిల్వలు ఖాళీ చేస్తే తప్పా ఈ వాన కాలం సీజన్లో వచ్చే బియ్యాన్ని నిల్వ చేసే పరిస్థితి కనిపించడం లేదు.
రిలయన్స్కు లీజ్..
బియ్యం నిల్వ చేసేందుకు స్థలం లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కరీంనగర్లోని సీడబ్ల్యూసీ గోదాముల్లో 7 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోదాములను రిలయన్స్ సంస్థకు లీజ్కు ఇచ్చింది. ఐదు సంవత్సరాల కోసం అగ్రిమెంట్ కూడా జరిగినట్లు, రెండు నెలలుగా నెలకు 2 లక్షల చొప్పున అద్దెను చెల్లిస్తున్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో ఒక పక్క ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగమైన బియ్యం నిల్వ చేసేందుకు అవకాశం లేని పరిస్థితి కనిపిస్తోంటే.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లీజ్కు ఇవ్వడంపై ఇటు మిల్లర్లు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్లో రిలయన్స్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసుకునేందుకు లీజ్కు ఇచ్చినట్లు తెలుస్తుండడంపై మండిపడుతున్నారు. ఇటు రిలయన్స్ సంస్థ తీసుకున్న గోదాములను ఇప్పటి వరకు వినియోగంలోకి తెచ్చుకోలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉన్నా అందులో బియ్యాన్ని నిల్వ చేసే పరిస్థితి లేదు.
గడియకొక్క మాటతో ఇబ్బందులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత యాసంగి సీజన్లో 3.21లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లా సివిల్ సైప్లె శాఖ రైసు మిల్లులకు సరఫరా చేసింది. ఇచ్చిన ధాన్యం నుంచి 2.20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉంది. వీటిని వెంట వెంటనే కరీంనగర్లోని ఎఫ్సీఐకి సివిల్ సైప్లె శాఖ పంపాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30 వరకు మొత్తం బియ్యాన్ని ఎఫ్సీఐ సేకరించాల్సి ఉండగా, 70 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకున్నది. గడువు దాటినా బియ్యం మిల్లుల గేటు దాటక పోవడంతో మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఎఫ్సీఐ గోదాములు లేక పోవడం.. మిల్లుల్లో స్థలం లేక 32 మంది మిల్లర్లు కలిసి టెక్స్టైల్స్పార్కులో గోదాంలను అద్దెకు తీసుకుని బియ్యం నిల్వ చేశారు. బియ్యం సంగతిపై ఎఫ్సీఐ గడియకొక్క మాట చెపుతూ ఇబ్బందులు పెడుతుందంటూ మిల్లర్లు ఆరోపిస్తున్నారు. ఎఫ్సీఐ నిర్వాకంతో బియ్యం పందికొక్కుల పాలై తాము నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్లోడింగ్కు ఐదు రోజులపైనే..
కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లోని మిల్లుల నుంచి బియ్యం రవాణా చేస్తున్న లారీలకు ఇక్కడ అన్లోడ్ చేయాలంటే ఐదు రోజులపైనే పడుతోంది. గోదాములో అంతంత మాత్రమే స్పేస్ ఉండడంతో సర్దుబాటు చేసుకుంటూ సీడబ్ల్యూసీ అధికారులు బియ్యాన్ని నిల్వ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. లారీల డ్రైవర్లు నాలుగైదు రోజులుగా ఇక్కడే పడిగాపులు పడాల్సి వస్తున్నది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం, కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్, తిమ్మాపూర్ మండలం పర్లపల్లి తదితర మిల్లుల నుంచి బియ్యం తెచ్చిన లారీలు అన్లోడ్ కాకుండా ఇక్కడే ఉంటున్నాయి. తిమ్మాపూర్ మండలం రేణికుంట మిల్లు నుంచి బియ్యం తెచ్చిన ఓ డ్రైవర్ మాట్లాడుతూ, తమకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని అన్నాడు. బియ్యం నిల్వలను పరీక్షించి అన్లోడ్ చేయకుండా నాలుగైదు రోజులుగా అలాగే ఉంచుతున్నారని వాపోయాడు. ఇటు అన్లోడ్ చేయకపోవడంతో తమపై వెయిటింగ్ చార్జీలు పడుతున్నాయని మిల్లర్లు వాపోతున్నారు.
హమాలీల ఉపాధికి దెబ్బ..
పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ గోదాములో హమాలీలకు కూడా పనిదొరకడం కష్టమే. ఇప్పుడు స్పేస్ పొజిషన్ చూస్తే మరో రెండు రోజుల్లో గోదాం పూర్తి సామర్థ్యంతో నిండిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ గోదాములనే నమ్ముకుని బతుకుతున్న 120 మంది హమాలీలకు.. సీజన్ ఉన్నా పని దొరకని పరిస్థితి ఏర్పడుతున్నది. ఇప్పటికైనా ఎఫ్సీఐ అధికారులు ఈ గోదాములకు కనీసంగా వ్యాగన్లు కేటాయించి బియ్యం నిల్వలు తరలించాలని హమాలీలు వేడుకుంటున్నారు.
తీవ్రంగా నష్టపోతున్నాం
గడువు దాటినప్పటికీ బియ్యాన్ని కొనడంలో ఎఫ్సీఐ తీవ్ర జాప్యం చేస్తున్నది. బియ్యాన్ని నిల్వ చేయడానికి స్థలం లేక గోదాంలు అద్దెకు తీసుకున్నాం. అద్దె భారమవుతుంటే నిలువ ఉంచిన బియ్యం పందికొక్కుల పాలవుతున్నది. ఫలితంగా నష్టపోతున్నాం. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే బియ్యాన్ని తీసుకోవడం లేదు. రేపూ మాపంటూ ఇబ్బందులకు గురిచేస్తంది.
గోదాములు లేకనే
గత యాసంగి లో 3.21లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మిల్లర్లకు ఇచ్చాం. 2.20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 70వేల మెట్రిక్ టన్నులు ఇచ్చారు. మిగిలిన బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఎఫ్సీఐ అధికారులు తీసుకోవ డం లేదు. గోదాములు ఖాళీ లేవని చెపుతున్నారు. సిరిసిల్లలో గోదా ములు తీసుకోమంటే రైల్వే లైను ఉన్న చోటనే తీసుకుంటామంటున్నారు. బియ్యం నిల్వ చేయడానికి స్థలం లేక మిల్లర్లు ఇబ్బంది పడుతున్నది వాస్తవమే.
మా ఉపాధి పోతది..
ఎఫ్సీఐ సార్లు గోదాములు ఖాళీ చేయకపోతే మా ఉపాధి పోతది. ఇంకో రెండు రోజులే పని దొరుకుతది. 120 మందిమి ఈ గోదామును నమ్ముకుని బతుకుతున్నం. ఇసొంటి సీజన్ల మాకు రోజుకు వెయ్యికి మీదనే కూలీ గిట్టేటిది. ఇప్పుడు రోజుకు 500 సుత వస్తలేవు. గోదాములు ఖాళీ చేస్తేనే పని దొరుకుతది. రెండు రోజులు గడిచినంక ఏం చేసుడో అర్థమైత లేదు. ఇప్పటికైనా ఎఫ్సీఐ అధికారులు వ్యాగన్లు కేటాయించి గోదాంల బియ్యం ఖాళీ చేయించాలే.
బాయిల్డ్ నడిస్తెనే పని..
మా గోదాముల బాయిల్డ్ బియ్యం మస్తుగున్నయ్. ఈ బియ్యం లేస్తేనే మాకు పనిదొరుకుతది. ఇంత మంచి సీజన్ ఉండంగా ఇసొంటి పరిస్థితి నేనెప్పుడు చూడలె. గోదాంల ఖాళీ జాగ లేదు. ఇంకో రెండు రోజులు సుతం మాకు పని కష్టమే. లారీలస్తే రాత్రి రాత్రి సుతం నిండుతది. ఇక మేము రోడ్డున పడాల్సింది. ఎఫ్సీఐ అధికారులు కనీస మా ఉపాధి కోసమైనా గోదాముకు వ్యాగన్లు పెట్టాలె.
మొన్న సాయంత్రం వచ్చిన..
కొదురుపాక నుంచి బియ్యంతోని మొన్న సాయంత్రం ఇక్కడికచ్చిన. నా కంటే ముందుగాల వచ్చిన లారీలే ఇంకా ఖాళీ కాలే. నా లారీ వంతు ఎప్పుడొస్తదో..? నిన్నటి నుంచి లారీలు మొత్తం నిలిచి పోయినయి. ఇంతకు ముందీడ ఇసొంటి పరిస్థితి చూడలె. గోదాంల జాగ లేదని బియ్యం దింపుతలేరు. ఏం చేసుడో ఏందో..?