కిసాన్మేళా విజయవంతమైంది. పొలాస వేదికగా జరిగిన కార్యక్రమానికి కర్షకలోకం కదిలివచ్చింది. సాగులో కొత్త విధానాలు, సాంకేతిక వినియోగం వంటి విషయాలను తెలుసుకున్నది. వంగడాలు, వాతావరణం, యాజమాన్యం, వన్యప్రాణుల బెడద, యంత్రసాయం, ఉత్పత్తుల మార్కెటింగ్ తదితర అంశాల్లో రైతులకు సాయంగా నిలిచేందుకు శాస్త్రవేత్తలతో ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో తమ సందేహాలను వ్యక్తం చేసి నివృత్తి చేసుకున్నది. ఈ సందర్భంగా పలు సమస్యలకు శాస్త్రవేత్తలు పరిష్కారమార్గాలు చూపారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
– జగిత్యాల టౌన్, నవంబరు 17
– పూడూర్కు చెందిన రైతు రాంరెడ్డి
అటవీ జంతువులు, కోతుల వల్ల పంటలకు బాగా నష్టం వాటిల్లుతుంది. వాటిని చంపడం నేరమైనందున పొలాల నుంచి తరిమికొట్టాలి. ప్రయోగాత్మకంగా కొన్ని పనులు చేస్తున్నాం. అగ్రికెనాన్ అనే గన్నును ప్రయోగాత్మకంగా తయారు చేసి అందుబాటులోకి తెచ్చాం. దీనిలో ఒక కిలో కాల్షియం కార్బొనెట్ నింపి గ్యాస్ ద్వారా పేల్చినట్లయితే దీని శబ్దానికి కోతులు బెదిరిపోతాయి. అదేవిధంగా అగ్రి సోలార్ అనేది మరో పరికరం. దీని ఖరీదు రూ.10 వేలు ఉంటుంది. పంట పొలాల చుట్టూ దీన్ని అమర్చినట్లయితే కోతులు, అటవీ జంతువుల నుంచి పంటలను కాపాడుకోవచ్చు. అలాగే బయోకస్టిక్ అనే పరికరం ద్వారా కూడా రక్షించుకోవచ్చు.
– డాక్టర్ వీ వీందర్రెడ్డి, రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త
– కరీంనగర్కు చెందిన రైతు వంగల వెంకట్రెడ్డి
* బీపీడీ 5204, హెచ్ఎంటీలపై కాండం తొలుచు పురుగు బెడద ఉంది. వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో వాటి సంతతిని పెంచుకుంటున్నాయి. ఫలితంగా వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నివారణకు ఎసిఫేట్ లేదా కార్టాఫ్హైడ్రోక్లోరైడ్ గుళికలను పంట తొలిదశల్లో వేసుకోవాలి. అలాగే పంటల మార్పి చేయడం వల్ల కూడా కొంత అరికట్టవచ్చు.
– డాక్టర్ ఆర్ జగదీశ్వర్, పరిశోధనా సంచాలకులు
డ్రమ్సీడర్ సాయంతో రైతులు వరి నాట్లు వేసినట్లయితే అధిక లాభాలు పొందవచ్చు. దీన్ని ఉపయోగించే ముందు నేలను చదునుగా చేసుకోవాలి. కలుపు సమస్య ఎక్కువగా వస్తుంది. నత్రజని సంబంధిత ఎరువులను నాట్లు వేసిన తర్వాత వాడుకోవాలి. వేరు వ్యవస్థ లోపలికిపోక పడిపోయే అవకాశమున్నది. పొట్టి రకాలను ఎంచుకోవాలి. ఏప్రిల్ మొదటి వారంలో కోతకు వచ్చే విధంగా విత్తుకోవాలి. కోడి, పశువుల పేడ వాడినట్లయితే మరింత దిగుబడి పెరుగుతుంది.
– శ్రీనివాస్, రైస్బ్రీడర్ శాస్త్రవేత్త
రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలి. వానాకాలంలో వరి వేస్తే యాసంగిలో మరో పంటను వేసుకోవాలి. ప్రత్యామ్నాయ పంట సాగుతో అధిక దిగుబడులు వస్తాయి. ఆరుతడి పంటలు చూసినట్లయితే మక్క కోసం దుక్కి దున్నకుండా జీరోటిల్లర్ పద్ధతిలో వేసుకోవాలి. యాసంగిలో మక్కకు కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉంది. పొద్దుతిరుగుడు పంటను కూడా దుక్కి దున్నకుండా వేసుకోవచ్చు. యాసంగిలో వేరుసెనగ పంటలో దిగుబడులు చాలా పెరుగుతాయి. పెసర, మినుములు, నువ్వులను జనవరి 15 తర్వాత విత్తుకోవాలి. ఆరుతడి పంటలను విత్తే సమయంలో రైతులు విత్తన శుద్ధిని పాటించాలి. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
– డాక్టర్ మంజులత, కరీంనగర్ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త