మెట్పల్లి,ఆగస్టు 23: ఎమ్మెల్సీ కవిత ఇంటగిపై దాడి హేయమైన చర్య అని, తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేయడం బీజేపీకి తగదని కోరుట్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను ఎమ్మెల్యే విద్యాసాగర్రావు కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అవినీతి, అక్రమాలను ఎండగట్టే దమ్మున్న నాయకురాలు కవిత వచ్చే ఎన్నికల్లో మళ్లీ పార్లమెంట్లోకి అడుగుపెడుతుందనే భయంతో బీజేపీ నాయకులు ఢిల్లీ నుంచి కుట్ర చేసి తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచిడిపాజిట్ గల్లంతవుతుందనే భయంతో ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేశారని పేర్కొన్నారు. మోడీ,అమిత్షా వచ్చి మోకాళ్ల మీద నడిచినా బీజేపీకి డిపాజిట్ దక్కదని స్పష్టం చేశారు. నిజామాబాద్ ఎంపీగా కవిత 5 లక్షల మెజార్టీతో వచ్చే ఎన్నికల్లో గెలవడం ఖాయమని తెలిపారు. గత ఎన్నికల్లో బీజేపీ వందల అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచిందని, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు.