హుజూరాబాద్ టౌన్, జులై 28: ‘హుజూరాబాద్ ప్రజలు ఆవేశపడద్దు.. ఆగమాగం కావద్దు. .ఆలోచించి ఓటేసి అభివృద్ధి చేసే పార్టీకి పట్టంగట్టండి’ అంటూ మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రాంత ప్రగతిని కాంక్షించే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. శుక్రవారం టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో వందలాది మంది అనుచరులతో కలిసి పార్టీలోకి వెళ్తున్నానని చెప్పారు. గురువారం హుజూరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న టీఆర్ఎస్కు తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఓ వ్యక్తి భావోద్వేగానికి ప్రజలు బలిపశువులు కావద్దన్నారు. ఈటల చిన్నపిల్లాడిలా రాజీనామా చేసి ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టాడని విమర్శించారు. ఈ ఒక్క సీటుతో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీలేదని, కానీ ఈటలకు ఓటేస్తే నియోజకవర్గ ప్రజలు నష్టపోతారని చెప్పారు.
అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి చేయని ఈటల..బీజేపీ నుంచి గెలిచి ఏం సాధిస్తాడని ప్రశ్నించారు. దళితబంధు పథకానికి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడాన్ని ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. నిస్వార్థంగా తాను టీఆర్ఎస్లో చేరుతున్నానని, ఎవరికీ టికెట్ ఇచ్చినా గెలుపునకు కష్టపడి పని చేస్తానని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ పొల్సాని రామారావు, బీజేపీ మాజీ నియోజకవర్గ ఇన్చార్జి పోరెడ్డి కిషన్రెడ్డి, పోతిరెడ్డిపేట సర్పంచ్ తాటికొండ పుల్లాచారి, బీజేపీ నాయకులు బచ్చు ఆనందం, బోయినపల్లి రామారావు, విష్ణుదాసు గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.