రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ విస్తృత పర్యటన
దాదాపు ఆరు గంటలపాటు టూర్
ఇల్లంతకుంటలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
వేములవాడలో 100పడకల దవాఖాన పరిశీలన
జిల్లా దవాఖానలో వైద్య, ఆరోగ్యశాఖ, వైద్య సిబ్బందితో సమీక్ష
గ్రంథాలయంలో విద్యార్థులు, అభ్యర్థులతో ముచ్చట
ఎగువ మానేరు వద్ద జలహారతి.. జలాలను చూసి సంతోషం
సిరిసిల్ల /ఇల్లంతకుంట, ఏప్రిల్ 19: ప్రగతి రథ సారథి.. అమాత్యుడు కేటీఆర్ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఉదయం నుంచి 11.30గంటల నుంచి సాయంత్రం 5.50 గంటల దాకా అలుపెరుగకుండా తిరిగారు. మొదట ఇల్లంతకుంటలో 2.63కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన, తర్వాత వేములవాడలోని తిప్పాపూర్లో 100 పడకల దవాఖానను సందర్శించారు. పదిరోజుల్లో ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించిన ఆయన, జిల్లా కేంద్రంలోని ప్రధాన హాస్పిటల్లో వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షించారు. సాయంత్రం గంభీరావుపేటలోని ఎగువమానేరుకు వెళ్లారు. జలాలను చూసి ఉద్వేగానికి లోనయ్యారు. పూజలు చేసి హారతి ఇచ్చి సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో అలుపెరుగని పర్యటన చేశారు. ఉదయం నుంచి 11.30గంటల నుంచి సాయంత్రం దాకా 5.50 గంటల వరకు రికాం లేకుండా తిరిగారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలు దేరి ఇల్లంతకుంట మండలానికి చేరుకున్న ఆయనకు 11:30 గంటలకు మండల శివారులో టీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇల్లంతకుంటకు 12:15 గంటలకు చేరుకున్నారు. మండలకేంద్రంలో మొత్తం 2.63కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. మొదట 30 లక్షల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ ప్రహరీ, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 12:22కు కాలినడకన ప్రజలకు అభివాదం చేస్తూ వివేకానంద చౌరస్తాకు వెళ్లి, అక్కడ 1.30 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను ప్రారంభించారు. తర్వాత 12:32కు 15లక్షలతో మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించారు.
12:48 గంటలకు 50లక్షలతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ సముదాయాన్ని, 12:54 గంటలకు 15లక్షలతో నిర్మించిన గ్రామ సంత, తర్వాత 23లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించి, అదే వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. 2.35గంటలకు వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్కు చేరుకొని, వంద పడకల దవాఖాన నిర్మాణాన్ని పరిశీలించారు. పది రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. తర్వాత 3.24గంటలకు జిల్లా కేంద్రంలోని దవాఖానకు వెళ్లి వైద్య, ఆరోగ్యశాఖ, వైద్య సిబ్బందితో కొవిడ్ రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించి, విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తర్వాత జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించారు.
నూతనంగా ఏర్పాటు చేసిన రీడింగ్ రూంతో పాటు ఎన్ఆర్ఐ దంపతులు జోగినపల్లి స్రవంతి-కిరణ్ వితరణ చేసిన ప్రొజెక్టర్, టాస్క్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం 4.50గంటలకు నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టుకు చేరుకున్నారు. నిండుగా పరుచుకున్న కాళేశ్వర జలాలను చూసి సంబురపడ్డారు. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైందంటూ కొనియాడారు. అనంతరం జలాలకు పూజలు చేసి, హారతిఇచ్చారు. నీటిలో పూలు చల్లారు. సాయంత్రం 5.32గంటలకు దేశాయిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, 5.50గంటలకు తిరుగుపయనమయ్యారు.