హుజూరాబాద్, సెప్టెంబర్ 20: ఎన్నో ఏండ్లు పదవులు అనుభవించిన బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ అభివృద్ధిపై పూర్తి నిర్లక్ష్యం చూపారని, ఇప్పుడు ఆయన చేయని పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని, అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వైపు ఉంటారో?, నియోజకవర్గాన్ని పట్టించుకోని ఈటల వైపు ఉంటారో? ఆలోచించుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్లోని సిటీసెంటర్హాల్లో టాక్సీ డ్రైవర్లు, వస్త్ర దుకాణంలో పని చేస్తున్న గుమస్తాలు(క్లాత్ మర్చంట్), వడ్డెర సంఘం నాయకులతో సోమవారం సమావేశమైన ఆయన, వారినుద్దేశించి ప్రసంగించారు. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత హుజూరాబాద్లో పర్యటిస్తే చాలా బాధ కలిగిందని, ఒక రోడ్డు సరిగ్గా లేదని, మెయిన్ రోడ్లు గుంతలమయంగా ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. ఒక పైపు లైన్ సైతం వేయలేదని, ఈ దయనీయ పరిస్థితులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. వెంటనే సీఎం కేసీఆర్ సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పనులు యుద్ధప్రతిపాదికన నడుస్తున్నాయన్నారు. అనేక పదవులు అనుభవించిన ఈటల తన సొంత ప్రయోజనాలు చూసుకొని ఆస్తులను పెంచుకున్నాడే కానీ, హుజూరాబాద్ ప్రజల గురించి ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇక్కడి సమస్యలపై మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఎన్నోసార్లు ఈటలకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
టీఆర్ఎస్తోనే హుజూరాబాద్ అభివృద్ధి
సీఎం ఆధ్వర్యంలో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంటే హుజూరాబాద్ మాత్రం కేవలం ఈటల రాజేందర్ నిర్లక్ష్యంతోనే ఆగిపోయిందనేది మూమ్మాటికి నిజమని మంత్రి గంగుల స్పష్టం చేశారు. హుజూరాబాద్ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని చెప్పారు. ఏడేళ్లు పదవిలో ఉండి అభివృద్ధిని పట్టించుకోని ఈటల, ఉప ఎన్నికలో గెలిస్తే ఏం లాభం ఉంటుందో ఆలోచన చేయాలని సూచించారు. కుల సంఘాలు, ఇతర అసోసియేషన్లకు ఒక గుంట జాగ ఇవ్వలేదని, భూమి లేదని కుంటిసాకులు చెప్పేవాడని, కానీ ఇప్పుడు తాము అందరికీ కేటాయిస్తున్నట్లు తెలిపారు. టాక్సీ డ్రైవర్ల, క్లాత్ మర్చంట్ అసోసియేషన్కు తప్పకుండా కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
గెల్లుకు మద్దతుగా తీర్మానాలు
‘గెల్లు శ్రీనివాస్ జై.. టీఆర్ఎస్ జిందాబాద్’ అంటూ టాక్సీ డైవర్ల అసోసియేషన్, వడ్డెర, క్లాత్ మర్చంట్ అసోసియేషన్ నాయకులు ఈ సందర్భంగా సమావేశంలో నినాదాలు చేశారు. ఉప ఎన్నికలో గెల్లు గెలుపు కోసం కృషి చేస్తామని ముక్తకంఠంతో చెప్పారు. ఏకగ్రీవ తీర్మానం చేసి మంత్రికి పత్రాలను అందించారు. అనంతరం మంత్రి, గెల్లు శ్రీనివాస్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తాళ్లపెల్లి శ్రీనివాస్, వెన్నంపల్లి కిషన్, అపరాద ముత్యంరాజు, నాయకులు పొనగంటి మల్లయ్య, గందె శ్రీనివాస్, తాళ్లపెల్లి రమేశ్, సంపంగి రాజేందర్(మైఖేల్), సమ్మయ్య, అంకుషావళి, సర్వమియా, సదానందం, అంకం వెంకటేశ్వర్లు, గట్ల శ్యామ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి 50 మంది చేరిక
టాక్సీ డ్రైవర్లు, క్లాత్ మర్చంట్, వడ్డెర సంఘం నాయకుల సమావేశం సందర్భంగా దాదాపు 50 మంది మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారందరికీ మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు, పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న కృషిని చూసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు.