రాంనగర్, జూలై 29: అన్ని స్థాయిల పోలీసు అధికారుల మెరుగైన పనితీరు, కృషితోనే కరీంనగర్ కమిషనరేట్కు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని సీపీ వీబీ కమలాసన్రెడ్డి పేర్కొన్నారు. సీపీ బదిలీపై వెళ్తున్న సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడానికి కృషి చేసిన అన్ని స్థాయిల పోలీసు అధికారులను గురువారం అభినందించి, రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ వీబీ కమలాసన్రెడ్డి మాట్లాడుతూ, తాను కమిషనర్గా పని చేసిన సుమారు ఐదేళ్ల కాలంలో కరీంనగర్ తనకు జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని పేరొన్నారు. 2018లో ప్రజల రక్షణ, భద్రతలో జాతీయ స్థాయిలో నాల్గో స్థానం, పోలీస్స్టేషన్ ఆవరణలో ఆహ్లాదకర వాతావరణం, ఫిర్యాదులపై సత్వరం స్పందించడం, నేరాల ఛేదన, నియంత్రణకు తీసుకున్న చర్యల్లో భాగంగా 2019 లో చొప్పదండి పోలీస్ స్టేషన్కు జాతీయ స్థాయిలో 8వ స్థానం, 2020లో జమ్మికుంట పోలీస్ స్టేషన్ పదోస్థానం సాధించడం గర్వకారణమన్నారు. ప్రతి ఫిర్యాదు, కేసుల వివరాలు ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్లో అప్లోడ్ చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతోనే ఇది సాధ్యమైనట్లు తెలిపారు.
జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి అన్ని స్థాయిల పోలీసులు కీలకపాత్ర పోషించారని కొనియాడారు. స్టేషన్కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మెదిలి, సత్వర సేవలందిస్తే పోలీస్ శాఖ ప్రతిష్ట పెరుగుతుందని పేరొన్నారు. డీజీపీ మహేందర్రెడ్డి పలుమార్లు కరీంనగర్ పోలీసుల పనితీరును అభినందించారని గుర్తు చేశారు. ఇటీవల ఊపిరాడక ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ విధానం ద్వారా శ్వాస అందించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ ఖలీల్ పేరును జీవన్ రక్షక్ పతకానికి ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. భవిష్యత్లో కూడా కరీంనగర్ కమిషనరేట్ వివిధ అంశాల్లో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, జీ చంద్రమోహన్, ఏఎస్పీ రితిరాజ్, అన్ని స్థాయిల పోలీసులు పాల్గొన్నారు.