కొడిమ్యాల, జూలై 28(మల్యాల):కొండగట్టు అంజన్న సన్నిధిలో బుధవారం ఈవో వెంకటేశం ఆధ్వర్యంలో తలనీలాల టెండర్ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 1, 2021 నుంచి జూలై 31, 2022 వరకు తలనీలాలు పోగు చేసుకునేందుకు గాను టెండర్ ప్రక్రియను నిర్వహించగా 15 సంస్థలు పాల్గొన్నాయి. ఈ ప్రక్రియలో అత్యధికంగా రూ.కోటీ 40 లక్షల 20 వేల 200 పాట పాడి హైదరాబాద్కు చెందిన నరేశ్ కుమార్ ఎంటర్ ప్రైజెస్ యాజమాన్యం హక్కులను దక్కించుకుంది. అంతేగాక ఏడు నెలలుగా ఆలయ పరిధిలో తలనీలాలను సేకరించి భద్రపరిచిన వాటికి వేలం ప్రక్రియను నిర్వహించగా ఈ వేలం ప్రక్రియలో 28 సంస్థలు పాల్గొన్నాయి. ఏలూరుకు చెందిన హుమాశ్రీ ఎంటర్ ప్రైజెస్ కిలోకు రూ.17,700 చొప్పున సేకరించేందుకు గాను హక్కులు దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆలయానికి కురుల రూపంలో దాదాపు రూ.3 కోట్ల వరకు సమకూరనున్నది. గతంలో కంటే రికార్డు స్థాయిలో ఆలయానికి టెండర్ ద్వారా ఆదాయం సమకూరగా ఆలయ ఈవో టెండర్ దక్కించుకున్న వారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రత్యేకాధికారి చంద్రశేఖర్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్ శ్రీనివాస శర్మ, సునీల్ తదితరులున్నారు.