గాంధారి : అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు విధులను సక్రమంగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. సోమవారం గాంధారి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రాధబలరాం అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మండలంలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని
తెలిపారు. నూతన పట్టా పాస్ పుస్తకాలు రాని రైతుల సమస్యలను పరిష్కరించాలని తాసీల్దార్ గోవర్ధన్కు సూచించారు. కరోనా వైరస్తో పాటు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండలంలో కరోనా టీకా డోసుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు.
గాంధారి మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు పనులను త్వరగా ప్రారంభించాలని, పెండింగ్లో ఉన్న రోడ్లను అటవిశాఖ అధికారులతో క్లియరెన్స్ తీసుకొని వెడల్పు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. గండివేట్లోని బల్లెం చెరువు, చద్మల్ గ్రామ చెరువు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. హరితహారంలో పెద్ద సంఖ్యలో మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని కోరారు. విద్యుత్శాఖ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ శంకర్నాయక్, ఎంపీడీవో సతీశ్, ఏఎంసీ చైర్మన్ పెద్దబూరీ సత్యం, వైస్ ఎంపీపీ భజన్లాల్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.